హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 11 : చారిత్రక వేయిస్తంభాల రుద్రేశ్వరాలయంలో ఈ నెల 18న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర దేవాదాయధర్మాదాయశాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ ఎం రామకృష్ణారావు సూచించారు. శనివారం ఆయన ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారికి ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ స్వాగతం పలికి గర్భాలయంలోని రుద్రేశ్వరస్వామికి వారి గోత్రనామాలతో పూజలు నిర్వహించారు.
అనంతరం ఆలయ నాట్యమంటపంలో స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్ర్తాలను అందజేశారు. ఈ సందర్భంగా ఈవో శేషగిరి, గంగు ఉపేంద్రశర్మలతో రామకృష్ణారావు మాట్లాడారు. 23 ఏళ్ల తర్వాత శనిత్రయోదశి రోజు మహాశివరాత్రి రావడం గొప్ప విషయమన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నందున అందుకు తగినట్లు క్యూలైన్స్, బారికేడ్లు, పోలీస్ బందోబస్తు చేయాలని సూచించారు. కలెక్టర్, సీపీ సహకారంతో వివిధ శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఉత్సవాలు విజయవంతం చేయాలని కోరారు. పూజా రుసుములకు సంబంధించిన రశీదులు భక్తులకు అదజేయాలన్నారు.
ఎండతీవ్రత ఉన్నందున మంచినీరు, చలువ పందిళ్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సామన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని, జాగరణ ఉండే భక్తుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవాలని ఈవోను ఆదేశించారు. కల్యాణోత్సవం, లింగోద్భవకాల పూజలు వేదపండితుల ఆధ్వర్యంలో ఆగమశాస్త్ర ప్రకారం నిర్వహించాలని ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మకు సూచించారు. కార్యక్రమంలో అర్చకులు గంగు మణికంఠశర్మ, ప్రణవ్, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.