ధర్మసాగర్, ఫిబ్రవరి 18 : పౌరులంతా ఛత్రపతి శివాజీ వీరత్వాన్ని అందిపుచ్చుకొని నవ సమాజ నిర్మాణానికి పాటుపడాలని మాజీ ఉపముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని దేవునూర్లో ఆదివారం శివాజీ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. తొలుత గ్రామస్తులు డప్పుచప్పుళ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం చేసిన సమావేశంలో కడియం శ్రీహరి మాట్లాడారు. శివాజీ యుద్ధ నైపుణ్యం, పరిపాలన ఆదర్శమని కొనియాడారు. ధైర్యసాహసాలకు మారు పేరు ఛత్రపతి శివాజీ అని గుర్తుచేశారు. మత సామరస్యాన్ని చాటారని తెలిపారు.
ప్రజలే ప్రభువులుగా పాలన సాగిందన్నారు. శివాజీ ఎన్నో యుద్ధాలు చేసినా హింసను ప్రోత్సహించలేదన్నారు. పవిత్ర స్థలాలను ధ్వంసం చేయలేదన్నారు. రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకన్న, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మునిగెల రాజు ముదిరాజ్, ఎంపీటీసీ లక్క సునీత, సర్పంచ్ చిర్ర కవిత, మాజీ ఎంపీపీ రఘు, విగ్రహ ప్రతిష్ఠాపన కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.