విధి నిర్వహణలో ఇన్నాళ్లు కాసులే కర్తవ్యంగా వ్యవహరించిన కొందరు పోలీసు అధికారులు, సిబ్బందికి ఇప్పుడు గుబులు పట్టుకుంది. ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో కలవరం మొదలైంది. తమపైనా వేటు పడేనా.. అనే ఆందోళన వారిని వెంటాడుతున్నది. జిల్లాలో ఇప్పటికే ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఒక ఎస్సై, ఏఎస్సై, కానిస్టేబుల్పై సస్పెన్షన్ వేటు పడింది. వరుసగా జరిగిన ఈ సస్పెన్షన్ల పర్వం పోలీసుశాఖలో కలకలం రేపింది. ప్రస్తుతం జిల్లాలోని పలువురు పోలీసు అధికారులు, సిబ్బందిపై వచ్చిన ఆరోపణలపై వరంగల్ సీపీ రంగనాథ్ ఆదేశాలతో క్షేత్రస్థాయిలో విచారణ జరుగుతోంది. మునుపెన్నడూ లేని రీతిలో డీసీపీ స్థాయి అధికారి విచారణ చేస్తున్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని సీపీ సంకేతాలు ఇస్తున్నారు.
వరంగల్, ఫిబ్రవరి 19(నమస్తేతెలంగాణ) : జిల్లాలో పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది అక్రమార్జనే లక్ష్యంగా విధులు నిర్వర్తించారు. ఈ క్రమంలో సంఘ విద్రోహ శక్తులతో చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. భూ కబ్జాదారులతో దోస్తీ చేశారు. భూ ఆక్రమణ కోసం కొందరు అసాంఘిక శక్తులతో టీంలను ఏర్పాటు చేశారు. అరాచకాలకు అడ్డుపడే వారిపై దాడులకు దిగేందుకు సొంత సైన్యానికి ఆయుధాలను సైతం సమకూర్చారు. భూ దందాల్లో రౌడీషీటర్లు, గూండాలనూ ప్రోత్సహించారు. పీడీఎస్ రైస్ వంటి అక్రమ దందాలకు దన్నుగా నిలిచారు. తమ దారి రహదారి అనే విధంగా అవినీతి, అక్రమాల్లో పోటీపడుతున్న పోలీసు అధికారులు, సిబ్బందికి ఇటీవలికాలంగా జరుగుతున్న పరిణామాలు మింగుడు పడడం లేదు. డిసెంబర్ మొదటి వారంలో వరంగల్ సీపీగా బాధ్యతలు స్వీకరించిన ఏవీ రంగనాథ్ జిల్లాలో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న, హద్దు మీరి ప్రవర్తిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందిపై నజర్ పెట్టారు. ముఖ్యంగా భూ కబ్జాదారులు, ఇతర మాఫియాలతో కలిసి అడ్డదారిలో ముందుకెళ్తున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజల నుంచి తనకు అందుతున్న ఫిర్యాదులపై విచారణకు ఆదేశిస్తున్నారు. పోలీ సు శాఖలోని నిఘా విభాగాలతో పా టు డీసీపీ స్థాయి అధికారులకు విచారణ బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఆరోపణలు రుజువైతే అధికారులు, సిబ్బందిపై వేటు వేస్తున్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడినవారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదనే సంకేతాలు సీపీ ఇస్తున్నారు.
ఇప్పటికే పలువురి సస్పెన్షన్..
గత నెల పదిహేను రోజుల వ్యవధిలో జిల్లాలో ఐదుగురు పోలీసు అధికారులు, సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. వీరిలో ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఒక ఎస్సై, ఏఎస్సై, కానిస్టేబుల్ ఉన్నారు. రంగనాథ్ సీపీగా వచ్చిన తర్వాత ఫస్ట్ వేటు గీసుగొండ ఇన్స్పెక్టర్గా పనిచేసిన ఆర్ వెంకటేశ్వర్లుపై పడింది. జనవరి 3న వెంకటేశ్వర్లును సస్పెన్షన్ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. వెంకటేశ్వర్లు దామెర ఎస్సై హరిప్రియ హద్దులు మీరి వ్యవహరించడంతో సదరు మహిళా ఎస్సై భర్త ఫిర్యాదు మేరకు విచారణ జరిపి సస్పెన్షన్ చేసినట్లు ఉత్తర్వుల్లో తెలిపారు. అప్పటికే భూ కబ్జాదారులతో పాటు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారికి సహకరిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ వెంకటేశ్వర్లు సస్పెండ్ కావడంతో మనుగొండ, గీసుగొండలో అదేరోజు రాత్రి స్థానికులు పటాకులు పేల్చి సంబురాలు జరుపుకోవడం సంచలనం కలిగించింది. ఆ తర్వాత నర్సంపేట పోలీసు స్టేషన్లో పనిచేసిన ఏఎస్సై నాగరాణిపై సస్పెన్షన్ వేటు పడింది. ఒకరి వద్ద డబ్బులు తీసుకుని ఇవ్వకపోవడంతో బాధితుల ఫిర్యాదుతో ఆమెపై హనుమకొండ పోలీసు స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. విచారణలో ఆరోపణలు నిజమని తేలడంతో ఏఎస్సై నాగరాణిని జనవరి 4న సస్పెండ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.
నల్లబెల్లి పోలీసు స్టేషన్లో విధులు నిర్వర్తించిన కానిస్టేబుల్ స్వామిపై ఈ నెల 3న సస్పెన్షన్ వేటు పడింది. ఇది జరిగిన కొద్దిరోజులకే నల్లబెల్లి పోలీసు స్టేషన్లో పనిచేసిన సబ్ ఇన్స్పెక్టర్ ఎన్ రాజారాం అవినీతి ఆరోపణలపై ఈ నెల 9న సస్పెండ్ అయ్యారు. పీడీఎస్ బియ్యం దందా, గుడుంబా తయారీదారుల నుంచి డబ్బు గుంజడం, బీమా స్కాంలో నిందితులకు స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి ముడుపులు పుచ్చుకోవడంతో పాటు డబ్బు కోసం నిందితులకు సహకరిస్తూ బాధితులకు అన్యాయం చేస్తున్నారని ఎస్సైపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిగింది. నివేదిక అందిన తర్వాత సీపీ రంగనాథ్ నల్లబెల్లి ఎస్సై రాజారాంను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా గురువారం మట్టెవాడ సీఐ సీహెచ్ రమేశ్పై భూ తగాదా కేసులో సస్పెన్షన్ వేటు పడింది. దత్తపుత్ర కాలనీలోని ఒక ప్లాటు వివాదంపై ఇటీవల కోర్టు తీర్పు వెలువడింది.
జడ్జిమెంట్ను అమలు చేయాలని బాధితులు సీఐ రమేశ్ను కలిశాడు. అయితే సదరు సీఐ ప్రత్యర్థులకు సహకరించడం, బాధితుల నుంచి డబ్బు తీసుకున్నట్లు ఆరోపణలు రావడంపై విచారణ జరిగినట్లు తెలిసింది. ఈ క్రమంలో రమేశ్పై సస్పెన్షన్ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ భూ వివాదంలో రమేశ్తో పాటు మరికొందరి పాత్ర కూడా ఉందనే ఆరోపణపై విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం. దీంతో ఈ వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఉంది, మరెవరిపై వేటు పడొచ్చనే అంశంపై చర్చ జరుగుతోంది. జిల్లాలోని ఇన్స్పెక్టర్లు, ఎస్సైలతో పాటు పలువురిపై అవినీతి, అక్రమాల ఫిర్యాదులు అందడంతో విచారణ సాగుతోంది. భూ ఆక్రమణ ఫిర్యాదుపై ఈస్ట్జోన్ డీసీపీ పుల్లా కరుణాకర్ గురువారం ఖానాపురం మండలం మంగళవారిపేట గ్రామాన్ని సందర్శించి విచారణ జరిపారు. ఇలాంటి పరిణామాలతో అవినీతి, అక్రమాలకు పాల్పడిన, భూ కబ్జాలు, అక్రమ దందాల్లో పాత్రదారులైన పోలీసు అధికారులు, సిబ్బందిలో టెన్షన్ నెలకొంది.