ములుగురూరల్, ఫిబ్రవరి29: సమాజంలో ఎన్నో అవరోధాలను ఎదుర్కొని వాటిని అధి గమిస్తూ 18వ శతాబ్దంలోనే సంఘ సంస్కర్తగా పనిచేసిన సేవాలాల్ మహారాజ్ సూచించిన మార్గాన్ని అనుసరించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీశిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ(సీతక్క) అన్నారు. సేవాలాల్ జయంతి ముగింపు వేడుకలను గురువారం ములుగు జిల్లా కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క పాల్గొని మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ను దైవంగా భావిస్తున్నారంటే ఆయన అనుసరించిన మార్గం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చునన్నారు. ‘అనర్థాలకు కారణమయ్యే మద్యపానానికి దూరంగా ఉండు..
‘అహింసా మార్గాన్ని అవలంబిస్తూ మహిళలను గౌరవించు’ అన్న సేవాలాల్ బోధనలు పాటించాలని అన్నారు. కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్ మాట్లాడుతూ బంజారా జాతి అభివృద్ధికి సేవాలాల్ మహారాజ్ కృషి చేశారని అన్నారు. ఆయన చెప్పిన విధంగా సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాలని అన్నారు. మాజీ ఎంపీ సీతారాంనాయక్ మాట్లాడుతూ విద్యతోనే అభివృద్ధి జరుగుతుందని, అభివృద్ధి చెందిన వారు జాతిలో ఇతరుల ఉన్నతికి పాటు పడాలని అన్నారు. సేవాలాల్ చూపిన ఆశయాలను అందరి సహకారంతో సాధిస్తూ గిరిజన జాతి అభ్యున్నతికి పాటు పడాలని కోరారు. కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ డీడీ పోచం, డీఎస్పీ రవీందర్, బంజారా నాయకులు పాల్గొన్నారు.