వరంగల్, మే 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సైన్స్ అండ్ టెక్నాలజీ సాయంతో నిమ్న వర్గాల సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్నది. సామాజిక, ఆర్థిక అసమానతలను రూపు మాపేందుకు ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా వరంగల్ రీజినల్ సైన్స్ సెంటర్లో ఎస్సీ, ఎస్టీ సెల్ను ఏర్పాటు చేసింది. రూ.1.80 కోట్లతో రాష్ట్ర సర్కారు భవనాన్ని నిర్మించగా, ఇటీవల మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. టీఎస్కాస్ట్ ఆధ్వర్యంలో ఈ సెల్ను నిర్వహించనుండగా, శాస్త్రీయ అధ్యయనాలు, సర్వేల ఆధారంగా పరిశోధనలు చేసి వివిధ ప్రాంతాల స్థితిగతులపై నివేదికలు అందజేయనున్నది.
ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా శాస్త్ర, సాంకేతిక అంశాలను భవిష్యత్తు తరానికి తెలియజెప్పేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నది. తెలంగాణ రాష్ట్ర సాంకేతిక సమితి(టీఎస్కాస్ట్) ఆధ్వర్యంలో సైన్స్ అండ్ టెక్నాలజీ సాయంతో సామాజిక, ఆర్థిక స్థితిగతులను మార్చేందుకు పూనుకున్నది. రూ.8 కోట్లతో కొత్తగా ఏడు ప్రాజెక్టులను మొదలుపెడుతున్నది. మొదటి దశలో వరంగల్ రీజినల్ సైన్స్ సెంటర్లోఎస్సీ, ఎస్టీ సెల్ను ఏర్పాటు చేసింది. రూ.1.80 కోట్లతో ఈ భవనాన్ని నిర్మించారు. మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం ప్రారంభించారు. అట్టడుగు వర్గాల ఉద్ధరణ, సాధికారతే లక్ష్యంగా వరంగల్లో ఎస్సీ, ఎస్టీ సెల్ ఏర్పాటైంది. ఈ సెల్లో శాస్త్రీయ అధ్యయనాలు, సర్వేలు, భౌగోళిక సమాచార వ్యవస్థ ఆధారంగా పరిశోధనలు చేస్తారు. అక్కడ పరిస్థితులపై నివేదికలు రూపొందిస్తారు.
సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్(సెస్), టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్(టిస్), జవహర్లాల్ నెహ్రూ ఆరిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ(జేఎన్ఎఫ్ఏయూ) సహకారంతో ఈ సెల్లో వివిధ ప్రాజెక్టులను అమలు చేయనున్నారు. పైలట్ ప్రాజెక్టు కింద సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఇప్పటికే ఎనిమిది క్లస్టర్ల ఎంపిక పూర్తయింది. పర్వతగిరి(వరంగల్), బెల్లంపల్లి(మంచిర్యాల), బోనకల్లు(ఖమ్మం), సారంగపూర్(నిర్మల్), శంకరపట్నం(కరీంనగర్) మండలాలను ఎస్సీ క్లస్టర్లుగా, దమ్మపేట(భద్రాద్రి), భూపాలపల్లి(జేఎస్ భూపాలపల్లి), ఏటూరునాగారం(ములుగు) మండలాలను ఎస్టీ క్లస్టర్లుగా ఎంపిక చేశారు. ఎస్సీ, ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో ఈ మండలాల్లోని ఆ వర్గం యువతకు స్వయం ఉపాధి అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు.
రాష్ట్రంలో ఒక్కటే..
వరంగల్ నగరానికి మొదటి నుంచి ఎడ్యుకేషన్ హబ్గా గుర్తింపు ఉన్నది. రాష్ట్రంలోనే ఏకైక రీజినల్ సైన్స్ సెంటర్ ఇక్కడే ఉన్నది. పిల్లలకు స్కూలు స్థాయిలోనే సైన్స్ ఆవిష్కరణలపై అవగాహన పెంచడం, వాటిని ఆచరణలోకి తెచ్చేలా ప్రోత్సహించే లక్ష్యంతో 1986లో కేంద్ర ప్రభుత్వం రీజినల్ సైన్స్ సెంటర్లను ఏర్పాటు చేసింది. శాస్త్ర, సాంకేతిక అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం లక్ష్యం గా ఇవి ఏర్పాటయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి అప్పుడే మూడు మంజూరయ్యాయి. వరంగల్, విజయవాడ, తిరుపతిలో వీటిని ఏర్పాటు చేసేలా అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. సమైక్య ప్రభుత్వాలు వరంగల్లో సైన్స్ సెంటర్ నిర్మాణంపై నిర్లక్ష్యం వహించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రూ.5.87 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పూర్తి చేసింది. పాఠ్య పుస్తకాల్లోని క్లిష్టమైన అంశాలను విద్యార్థులకు సులువుగా తెలియజేసే లక్ష్యంతో సైన్స్ సెంటర్ను నిర్మించారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల్లోని మౌలిక అంశాలపై అవగాహన కల్పించేలా రీజినల్ సైన్స్ సెంటర్లో ఎగ్జిబిట్లను ఏర్పాటు చేశారు. స్పేస్ సైన్స్, సోలార్ పవర్, 5డి థియేటర్, ఎడ్యుకేషన్ త్రూ శాటిలైట్ హాల్, పర్యావరణ కాలుష్యం, మానవ శరీర నిర్మాణం మోడల్స్ ఉన్నాయి.
మరోవైపు వరంగల్ రీజినల్ సైన్స్ సెంటర్లో ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు ప్రక్రియ మొదలైంది. ప్రమోషన్ ఆఫ్ కల్చర్ ఆఫ్ సైన్స్ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన మేరకు గత డిసెంబర్లో ఆర్ఎస్సీకి ఇన్నోవేషన్ హబ్ మంజూరైంది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియమ్స్(ఎన్సీఎస్ఎమ్) దీన్ని మంజూరు చేసింది. తెలంగాణ రాష్ట్ర సాంకేతిక సమితి(టీఎస్కాస్ట్) ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు ఏర్పాటవుతున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం చొప్పున ఖర్చు భరించనున్నాయి. డిస్కవరీ హాల్, ఇన్నోవేషన్ రీసెర్చ్సెంటర్, ఐడియా ల్యాబ్, డిజైన్ స్టూడియోలను ఏర్పాటు చేయనున్నారు. సృజనాత్మక, సైన్స్ ఆవిష్కరణలు, సంపద్రాయ సైన్స్లోని ఆలోచనలకు కార్యరూపం దాల్చేలా ఇన్నోవేషన్ హబ్ ఉండనుంది.