చెత్త సంపదను సృష్టిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘పల్లె ప్రగతి’ సత్ఫలితాన్నిస్తున్నది. గ్రామాలకు అదనపు ఆదాయం సమకూర్చుతున్నది. సర్కారు ముందుచూపుతో ప్రతి గ్రామ పంచాయతీకి ఒకటి చొప్పున డంపింగ్ యార్డు ఏర్పాటు చేసింది. ఇళ్లల్లో పోగవుతున్న చెత్తను రోడ్లు, ఖాళీ ప్రదేశాల్లో వేయొద్దని అవగాహన కల్పించింది. జీపీ సిబ్బంది ప్రతి రోజూ ఇంటింటికీ వెళ్లి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు. సెగ్రిగేషన్ షెడ్లో సేంద్రియ ఎరువు తయారు చేస్తున్నారు. వీటి విక్రయాలతో గ్రామాలు అదనపు ఆదాయం పొందుతున్నాయి. ఇప్పటికే 322 జీపీలకు రూ.7 లక్షలకుపైగా ఇన్కం సమకూరింది. సంపద సృష్టిలో పర్వతగిరి మండలం, పంచాయతీల్లో మరియపురం ప్రథమస్థానంలో నిలిచాయి.
వరంగల్, డిసెంబర్ 12(నమస్తేతెలంగాణ) : పల్లెల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. ప్రగతిపథంలో దూసుకుపోతున్నాయి. పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరుస్తున్నాయి. ప్రతి పల్లెలో నర్సరీ, పల్లె ప్రకృతి వనం, డంపింగ్యార్డు, వైకుంఠధామం వెలిసింది. ఇంటింటి నుంచి సేకరించిన తడి, పొడి చెత్తను డంపింగ్ యార్డుకు తరలించేందుకు గ్రామ పంచాయతీకో ట్రాక్టర్ లేదా ట్రాలీ ఆటో సమకూరింది. సిబ్బంది కొరత తీరింది. నెలనెలా ప్రతి గ్రామ పంచాయతీకి ప్రభుత్వం నిధులు ఇస్తున్నది.
ఫలితంగా పల్లెలు అభివృద్ధి బాట పట్టగా, డంపింగ్యార్డుల ద్వారా గ్రామ పంచాయతీలకు అదనపు ఆదాయం కూడా సమకూరుతున్నది. తడి, పొడి చెత్త వినియోగంతో ఆదాయాన్ని పొందుతున్నాయి. దీంతో ప్రభుత్వ ఆశయం నెరవేరుతున్నది. పల్లె ప్రగతి కార్యక్రమం అమల్లో భాగంగా ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఒక డంపింగ్యార్డు నిర్మించింది. ఆయా గ్రామంలో ఇళ్ల నుంచి సిబ్బంది సేకరించిన చెత్తను వేరుచేసేందుకు ఈ డంపింగ్ యార్డుల్లో ఏర్పాట్లు చేసింది.
తడి చెత్తతో వర్మీ కంపోస్టు తయారు చేయడానికి ప్రత్యేకంగా నాడెపు ఎరువు గుంతలు నిర్మించింది. పొడి చెత్తలోని ప్లాస్టిక్ బాటిళ్లు, గాజు, ఇతర సామగ్రి నిల్వ చేయడానికి వేర్వేరు గడులను ఏర్పాటు చేసింది. ట్రాక్టర్ లేదా ఆటోట్రాలీ ద్వారా డంపింగ్యార్డుకు తరలించిన తడి చెత్తను నాడెపు ఎరువు తయారీ గుంతల్లో, పొడి చెత్తలోని ప్లాస్టిక్ బాటిళ్లు, గాజు, ఇతర సామగ్రిని అమ్ముతున్నారు. జిల్లాలో 322 గ్రామ పంచాయతీలకు రూ.7 లక్షలకుపైగా ఆదాయం సమకూరింది. వర్మీ కంపోస్టు అమ్మకంతో రూ.3,86,559, పొడి చెత్త ద్వారా రూ.3,16,389 ఆదాయం వచ్చినట్లు జిల్లా ఇన్చార్జి పంచాయతీ అధికారి ఎం సంపత్రావు వెల్లడించారు. 27,214 కిలోల పొడి, 41,389 కిలోల తడి చెత్తను సేకరించినట్లు తెలిపారు.
32,446 కిలోల వర్మీ కంపోస్టు తయారీ చేశాయని, ఇందులో 13,907 కిలోలను స్థానిక అవసరాలకు వినియోగించుకోగా 21,596 కిలోలను విక్రయించామని చెప్పారు. ఆదాయం పొందడంలో పర్వతగిరి మండలం అగ్రస్థానంలో ఉండగా గీసుగొండ రెండో స్థానంలో ఉంది. ఈ మండలంలోని 33 గ్రామ పంచాయతీలకు వర్మీ కంపోస్టు విక్రయంతో రూ.1,10,600, పొడి చెత్త అమ్మకంతో రూ.1,18,630 ఆదాయం సమకూరింది. గీసుగొండ మండలంలోని 21 గ్రామ పంచాయతీలు తడి చెత్త ద్వారా రూ.72,500, పొడి చెత్త ద్వారా రూ.39,660 ఆదాయాన్ని పొందినట్లు అధికారులు తెలిపారు.
తడి, పొడి చెత్త వినియోగంలో జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో గీసుగొండ మండలంలోని మరియపురం పంచాయతీ టాప్లో ఉంది. వర్మీ కంపోస్టు అమ్మకం, పొడి చెత్త విక్రయం ద్వారా ఈ పంచాయతీకి రూ.79,600 ఆదా యం సమకూరింది. 2,700 కిలోల వర్మీ కంపోస్టును ఈ గ్రామ పంచాయతీ అమ్మింది. తద్వారా రూ.54 వేల ఆదాయం పొందింది. పొడి చెత్తలోని వస్తువులు 866 కిలోల అమ్మకం ద్వారా రూ,25,600 ఆదాయం సమకూర్చుకుంది. ఇదే మండలంలోని గంగదేవిపల్లి రెండో స్థానంలో ఉంది. ఈ గ్రామ పంచాయతీ తడి చెత్త ద్వారా రూ.16,250, పొడి చెత్త ద్వారా రూ.5,220 ఆదాయం పొందింది.
పర్వతగిరి గ్రామ పంచాయతీ తడి చెత్తతో రూ.8 వేలు, పొడి చెత్తతో రూ.11,354 ఆదాయం పొంది మూడో స్థానంలో నిలిచింది. ఎలుకుర్తి తడి చెత్తతో రూ.6,200, పొడి చెత్తతో రూ.4,220, నల్లబెల్లి మండలం నాగరాజుపల్లి తడి చెత్తతో రూ.3,056, పొడి చెత్తతో రూ.4,150, సంగెం మండలం గవిచర్ల తడి చెత్తతో రూ.10,450, పొడి చెత్తతో రూ.810, చింతలపల్లి తడి చెత్తతో రూ.9,887, పొడి చెత్తతో రూ.430, రామచంద్రపురం తడి చెత్తతో రూ.9,650, పొడి చెత్తతో రూ.330, కాట్రపల్లి తడి చెత్తతో రూ.9,600, పొడి చెత్తతో రూ.450, కాపులకనపర్తి తడి చెత్తతో రూ.8,925, పొడి చెత్తతో రూ.310, గుంటూరుపల్లి తడి చెత్తతో రూ.8,900, పొడి చెత్తతో రూ.290, పర్వతగిరి మండలం వడ్లకొండ జీపీ తడి చెత్తతో రూ.9 వేలు, పొడి చెత్తతో రూ.2,751, కొంకపాక తడి చెత్తతో రూ.4 వేలు, పొడి చెత్తతో రూ.6,984, కల్లెడ తడి చెత్తతో రూ.4 వేలు, పొడి చెత్తతో రూ.6,291 ఆదాయం పొందాయి. పర్వతగిరి మండలంలోని ఏనుగల్ జీపీ తడి చెత్తతో రూ.4 వేలు, పొడి చెత్తతో రూ.8,719, చింతనెక్కొండ తడి చెత్తతో రూ.4,500, పొడి చెత్తతో రూ.8,624 బూరుగుమడ్ల తడి చెత్తతో రూ.6 వేలు, పొడి చెత్తతో రూ.2,215, అన్నారం తడి చెత్తతో రూ.2,800, పొడి చెత్తతో రూ.7,601 చౌటపల్లి తడి చెత్తతో రూ.4 వేలు, పొడి చెత్తతో 4,170 ఆదాయం పొందినట్లు అధికారులు తెలిపారు.
జిల్లాలోని కొన్ని గ్రామ పంచాయతీలకు తడి చెత్తతో గాకుండా పొడి చెత్త ద్వారా ఆదాయం వస్తున్నది. మండల కేంద్రమైన నెక్కొండ గ్రామ పంచాయతీకి తడి చెత్తతో రూ.780, పొడి చెత్తతో రూ.8,600 ఆదాయం సమకూరింది. పర్వతగిరి, చింతనెక్కొండ, అన్నారం, ఏనుగల్, కొంకపాక, కల్లెడ, చౌటపల్లి గ్రామ పంచాయతీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దుగ్గొండి మండలం చలపర్తి గ్రామ పంచాయతీకి తడి చెత్తతో రూ.288, పొడి చెత్తతో రూ.3,750, పొనకల్ తడి చెత్తతో రూ.1,725, పొడి చెత్తతో రూ.2,940, నర్సంపేట మండలం గురిజాల జీపీ తడి చెత్తతో రూ.375, పొడి చెత్తతో రూ.3,150, మహేశ్వరం తడి చెత్తతో రూ.300, పొడి చెత్తతో రూ.3,150, పర్వతగిరి మండలం అడ్డబాటతండా జీపీ తడి చెత్తతో రూ.2 వేలు, పొడి చెత్తతో రూ.5,580, అనంతారం తడి చెత్తతో రూ.2,800, పొడి చెత్తతో రూ.4,738, నెక్కొండ మండలం అలంకానిపేట జీపీకి తడి చెత్తతో రూ.150, పొడి చెత్తతో రూ.3,600 ఆదాయం సమకూరింది. కొద్ది నెలల నుంచి తడి, పొడి చెత్త వినియోగం, తద్వారా ఆదాయాన్ని పెంచుకోవడంలో జిల్లాలోని గ్రామ పంచాయతీలు పోటీ పడుతున్నాయి. దీంతో మున్ముందు గ్రామ పంచాయతీలకు ఆదాయం మరింత పెరుగనుంది.