వరగంల్ చౌరస్తా, జూన్ 4 : శాంతి భద్రతలు పరిరక్షించడంతో పాటు ప్రజా సమస్యలను పరిష్కరించడంలో తెలంగాణ పోలీసులు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో సురక్షా దినోత్సవాన్ని ఐడీవోసీ గ్రౌండ్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రైం ఏదైనా పరిష్కరించి బాధితులకు తక్కువ సమయంలో న్యాయం చేయడంలో తెలంగాణ పోలీసులది అందెవేసిన చెయ్యన్నారు. తెలంగాణ ఏర్పాటైతే మత ఘర్షణలు చెలరేగుతాయని పుకార్లు చేసిన ఉమ్మడి రాష్ట్ర నాయకులు ఇప్పుడు నోళ్లు వెల్లబెడుతున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ అన్ని పోలీస్ స్టేషన్లకు అత్యాధునిక వాహనాలు, యంత్ర పరికరాలు, ఆయుదాలు సమకూర్చారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో పోలీస్ శాఖది కీలక పాత్ర అని అన్నారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పలువురు పోలీస్ సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందించారు. అనంతరం సీపీ ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పాటుకు తగిన వనరులు లేక చాలా కేసులు మధ్యలోనే నిలిచిపోయేవన్నారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత పోలీస్ వ్యవస్థ శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశ రాజధానితో పోటీ పడే విధంగా తయారయిందని చెప్పారు. రాష్ట్రంలోని ఏ గ్రామంలో ఏం జరిగినా హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రత్యక్షంగా పరిశీలించే సాంకేతికతను సాధించామని చెప్పారు. దేశంలోని మొత్తం సీసీ కెమెరాల్లో సుమారు 70శాతం తెలంగాణలోనే ఉన్నాయన్నారు. కమిషనరేట్ పరిధిలో సుమారు 25వేల సీసీ కెమెరాలు ఉన్నాయని, సైబర్ క్రైం కేసులను ఛేదించడంలో తెలంగాణ పోలీసులు దేశంలోనే ముందు వరుసలో ఉన్నారన్నారు. ఇక్కడి పోలీసుల పనితీరును అమలు చేయడానికి చాలా రాష్ర్టాల పోలీసులు ఆసక్తి కనబరుస్తున్నారని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితంగా పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో మరింత నమ్మకం పెరుగున్నదని చెప్పారు. కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. అన్యాయం, దోపిడీకి గురైన బాధితులకు న్యాయం జరగాలంటే పోలీసుల పాత్ర చాలా కీలకమన్నారు. ప్రజలు పోలీసుల వద్దకు న్యాయం కోసం స్టేషన్కు వెళ్లాలంటే భయపడే రోజులు పోయాయని, ఫ్రెండ్లీ పోలీసింగ్ వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, ఆర్డీవో మహేందర్జీ, ఏసీపీ బోనాల కిషన్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ దిడ్డి భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ పాల్గొన్నారు.