‘బీజేపీ పాలనలో పేదలకు సంక్షేమ పథకాలు అందని ద్రాక్షలా మారాయి. పెరిగిన ధరలతో దేశంలో సామాన్యులంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నరు.. దేశాన్ని సరైన బాటలో నడిపేందుకు ఇప్పుడు జాతీయ స్థాయిలో ఒక్క సమర్థవంతమైన నాయకుడు కూడా లేడు. ఇలాంటి పరిస్థితి నుంచి దేశాన్ని కాపాడాలంటే కేసీఆర్ వంటి సమర్థవంతమైన నాయకుడు అవసరం’ అంటున్నారు రిటైర్డ్ ఉద్యోగులు. కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడని, దేశంలో మార్పు తెచ్చే శక్తి ఆయనకే ఉందని చెబుతున్నారు. మత సామరస్యం వర్ధిల్లాలన్నా.. ఆమెరికా, చైనా దేశాల సరసన భారత్ కూడా చేరాలన్నా కేసీఆర్ లాంటి నాయకుడు జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తున్నారు.
నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 13 : ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప దార్శనికుడని, అందుకే పోరాడి సాధించుకున్న తెలంగాణను ఎనిమిదేళ్లలోనే అభివృద్ధిలో ఎంతగానో తీర్చిదిద్దారని, దేశాన్ని కూడా సరైన దారిలో నడపాలంటే కేసీఆర్ వంటి నాయకుడు జాతీయ రాజకీయాల్లోకి రావాలని రిటైర్డ్ ఉద్యోగులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలను చూసి తమను కూడా తెలంగాణలో కలుపాలని పక్క రాష్ర్టాలవారు కోరుకుంటున్నారని, ఇది కేసీఆర్ పాలనకు నిదర్శనమని చెబుతున్నారు. ఇతర రాష్ర్టాల ప్రజల ఆకాంక్షలు కూడా నెరవేరాలంటే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు.
దేశంలో మంచి మార్పు కోసం ఎవరు ప్రయత్నించినా ప్రోత్సహించాల్సిందేనని, ఇతర రాష్ర్టాల నేతలు కూడా సీఎం కేసీఆర్ విజన్కు సహకరించాలని పేర్కొంటున్నారు. దశాబ్దాలుగా అసాధ్యమనుకున్న తెలంగాణను సాధించి కేసీఆర్ సుసాధ్యం చేశారని, అలాంటి గొప్ప మేధావి జాతీయ రాజకీయాల్లో ఉంటే దేశ ఆర్థిక పరిస్థితి మారుతుందని చెబుతున్నారు. రిటైర్డు ఉద్యోగులకు నెలవారీగా పింఛన్ ఇవ్వాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చి నెల రోజులు దాటుతున్న కేంద్రం ఏమీ చెప్పడం లేదని, రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కారు దివ్యాంగులకు రూ.3వేల పింఛను ఇస్తున్నదని, రిటైర్డ్ ఉద్యోగులకు కేంద్రం ఆ మాత్రం పింఛను ఇవ్వలేదా అని ప్రశ్నిస్తున్నారు. రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావాలంటే కేసీఆర్ తప్పకుండా జాతీయ రాజకీయాల్లోకి రావాలని దేశ పాలనా పగ్గాలు చేపట్టాలని ఆకాంక్షిస్తున్నారు.
కేసీఆర్తోనే విప్లవాత్మక మార్పులు
దేశంలో ప్రధాని మోదీ పాలనలో పేదలకు సంక్షేమ పథకాలు అందడం లేదు. పాలన గాడి తప్పుతోంది. పెరిగిన ధరలతో సామ్యానులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ లాంటి వ్యక్తి దేశ రాజకీయాల్లోకి వెళ్లడం మంచి విషయమే. కేసీఆర్ లాంటి విజన్ ఉన్న నాయకుడితో దేశంలో తప్పకుండా మార్పు వస్తుంది. దేశంలో మార్పు తీసుకొచ్చే శక్తి కేసీఆర్కే ఉంది. తెలంగాణలో అమలవుతున్న ప్రజా సంక్షేమ పథకాలు దేశం మొత్తంలో అమలవుతాయి. దేశంలో మత సామరస్యం వర్ధిల్లాలన్నా, ఆమెరికా, చైనా దేశాల మాదిరిగా భారత్ అభివృద్ధి చెందాలన్నా సీఎం కేసీఆర్ లాంటి నాయకుడు జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
– కొండ్రెడ్డి సోమిరెడ్డి, రిటైర్డ్ ఎంఈవో, నర్సింహులపేట
శుభపరిణామం
హనుమకొండ, సెప్టెంబర్ 13 : సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావడం శుభపరిణామం. ఆయన ఒక విజన్ ఉన్న నాయకుడు. కేసీఆర్కు ఒక తెలంగాణ ప్రాంతంలోనే కాదు.. దేశంలోని ఇతర రాష్ర్టాల పరిస్థితులపై అవగాహన ఉంది. ఉద్యమం సందర్భంగా 14 సంవత్సరాలు తెలంగాణ అంతా తిరిగి ప్రజలతో మమేకమై ఏ ప్రాంత ప్రజలకు ఎలాంటి సమస్యలున్నాయో క్షుణ్ణంగా తెలుసుకున్నారు. కొట్లాడి తెలంగాణ సాధించడంతో పాటు ఎనిమిదేళ్ల పాలనలో తనంటే ఏమిటో నిరూపించుకున్న నాయకుడు సీఎం కేసీఆర్. అసాధ్యం అన్న వ్యవసాయరంగాన్ని సుసాధ్యం చేసి చూపిన రైతుల పక్షపాతి కేసీఆర్. ఆయన జాతీయ రాజకీయాల్లో ఉంటే తెలంగాణకు కూడా మరింత మేలు జరిగే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల వారు చాలా సంతోషంగా ఉంటున్నారు. అన్ని వర్గాల వారు కేసీఆర్ పాలననే కోరుకుంటున్నారు. ప్రస్తుతం దేశం పరిస్థితి అధ్వానంగా ఉంది. దేశంలోని ప్రజలు సెక్యూరిటీ లేకుండా భయాందోళనలో ఉన్నారు. ఆర్థిక వనరులు సమకూర్చే ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ సంస్థల చేతుల్లో పెడుతోంది. దీని వల్ల దేశ ప్రజలపై మరింత భారం పడుతుంది. అదే తెలంగాణ ప్రజలు ఎలాంటి భయబ్రాంతులు లేకుండా స్వేచ్ఛగా బతుకుతున్నారు. అన్ని అంశాల మీద పట్టున్న నాయకుడితో దేశానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. తెలంగాణ లెక్క దేశం కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుంది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణలో ఉద్యోగులు, పెన్షనర్లు సంతోషంగా ఉన్నారు. నేను ప్రభుత్వ ఉద్యోగిగా సుమారు 33 సంవత్సరాలు ఎక్సైజ్ శాఖలో పనిచేశాను. మన ప్రభుత్వం ఉద్యోగులకు చేయూతనిచ్చినట్లుగా గతంలో ఏ ప్రభుత్వాలు కూడా చేయలేదు. నెలకు రెండు వేల పింఛన్ ఇస్తూ కేసీఆర్ ఇంటికి పెద్ద దిక్కు అయ్యాడని ఇటీవల నాతో ఇద్దరు ముగ్గురు తెలిసిన వాళ్లు చెప్పడం సంతోషమనిపించింది. ముఖ్యంగా పెన్షనర్లకు దేశంలో ఎక్కడా లేనివిధంగా 75 సంవత్సరాలు దాటిన తర్వాత కాకుండా 70 సంవత్సరాలు దాటిన తర్వాతే క్వాంటమ్ ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్దే. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం వల్ల దేశ ప్రజలకు మంచే జరుగుతుందనేది నా వ్యక్తిగత అభిప్రాయం.
– చిలువేరు మల్లికార్జున్, విశ్రాంత ఎక్సైజ్ సీఐ
దేశంలోని గని కార్మికులందరికీ గొప్ప మేలు
కృష్ణకాలనీ, సెప్టెంబర్ 13 : దేశ ప్రజలు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారు. జాతీయ రాజకీయాల్లో ఆయన సేవలు ఎంతో అవసరం. దేశ రాజకీయాలు 75 ఏండ్లుగా కాంగ్రెస్, బీజేపీ నాయకుల చేతుల్లోనే ఉంటున్నాయి. కాంగ్రెసోళ్లు పోతే బీజేపోళ్లు.. బీజేపోళ్లు పోతే కాంగ్రెసోళ్లు.. ఇలా దేశాన్ని పంచుకొని వారు చెప్పిందే వేదం.. చేసిందే పని అన్నట్టుగా చేస్తున్నాయి తప్ప.. పేదలు బతుకలేని స్థితిలోకి తీసుకొచ్చారు. ఇలాంటి సందర్భంలో జాతీయ పార్టీ పెట్టాలనుకోవడం మంచి పరిణామం. తెలంగాణ వలె దేశం కూడా అభివృద్ధి సాధించాలని ఇక్కడి పథకాలు అన్ని రాష్ర్టాల్లో అమలుకావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. వాళ్లు కూడా కేసీఆర్ రాక కోసం ఎదురుచూస్తున్నారు. పోరాడి తెలంగాణ సాధించడంతో పాటు ముఖ్యమంత్రి పదవి చేపట్టి దేశ ప్రజలు మెచ్చే ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాడు. సింగరేణిలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణలో పనిచేసే కార్మికులకు ప్రత్యేకంగా స్పెషల్ ఇంక్రిమెంట్ ఇస్తున్నాడు. 10శాతం ఉన్న లాభాల వాటాను 16కు పెంచడమే గాక ఏటా పెంచుకుంటూ నేడు 29శాతం ఇస్తున్న ఘనత కేసీఆర్దే. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో వచ్చినట్లయితే దేశ వ్యాప్తంగా ఉన్న సింగరేణి కార్మికులందరికీ స్పెషల్ ఇంక్రిమెంట్తో పాటు లాభాల వాట అత్యధికంగా ఇవ్వగల విజన్ ఉన్న నాయకుడు. అలాగే దేశమంతా ఉచిత కరెంట్ వస్తుంది. ప్రజలకు అవసరమయ్యే ప్రతి అంశంపై పూర్తి అవగాహన ఉన్న నాయకుడాయన. అలాంటి వ్యక్తి దేశానికి ఎంతైనా అవసరం. కేసీఆర్ పెట్టే జాతీయ పార్టీకి తప్పకుండా మద్దతిస్తాం.
– పొడిశెట్టి ఆగమచారి, సింగరేణి రిటైర్డ్ కార్మికుడు,
జయశంకర్ భూపాలపల్లి
అభివృద్ధి చెందిన దేశమవుతుంది..
స్టేషన్ ఘన్పూర్, సెప్టెంబర్ 13 : రాదనుకున్న తెలంగాణను సాధించిన వ్యక్తి కేసీఆర్. లో వోల్టేజీ సమస్యతో మోటర్లు కాలిపోయి, పంటలు ఎండిపోయి పెట్టుబడి రాక రైతాంగం నష్టపోయే దుర్భర పరిస్థితిని గట్టెక్కించి వ్యవసాయాన్ని పండుగ చేశాడు. సాధించుకున్న తెలంగాణలో వ్యవసాయానికి 24గంటల నాణ్యమైన ఉచిత కరెంటుతో పాటు రైతుబంధు, రైతు బీమా అందించి రైతును రాజు చేస్తున్న కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం మంచి పరిణామమే. ఆయనకు అన్ని అంశాల మీద అవగాహన, మంచి పట్టు ఉంది. సమస్యలను పరిష్కరించగల నేర్పు ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు, కుల వృత్తులకు ఉపాధి, పేదలకు సంక్షేమ పథకాలు అందించి ఆదుకొనే మేధస్సు ఉంది. ముఖ్యమంత్రిగా తెలంగాణను ఎనిమిదేండ్ల కాలంలోనే ఎంతో అభివృద్ధి చేశారు. ఆయన దేశ రాజకీయాల్లోకి వెళ్తే అభివృద్ధి చెందుతున్న దేశం, అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందనడంలో సందేహం లేదు. ఆ సత్తా కేసీఆర్కే ఉంది. కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టాలని దేశాన్ని ముందుకు నడిపించాలని తెలంగాణతో పాటు ఇతర రాష్ర్టాల ప్రజలు కోరుకుంటున్నారు.
– పొన్న భిక్షపతి, రిటైర్డ్ విద్యుత్ శాఖ లైన్ ఇన్స్పెక్టర్, స్టేషన్ఘన్పూర్
ప్రభుత్వరంగ సంస్థలకు పునర్జీవం
జనగామ చౌరస్తా, సెప్టెంబర్ 13 : కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలు బతకాలంటే దేశంపై నిజంగా ప్రేమ ఉన్న కేసీఆర్ పీఎం కావాలి. బీజేపీ ఇప్పటికే అనేక ప్రభుత్వరంగ సంస్థల్ని అంగడిలో సరుకుల్లా కార్పొరేట్లకు అమ్మేసింది. దానికి ఉదాహరణ మా బీఎస్ఎన్ఎల్ సంస్థే. లాభాల్లో ఉన్న కంపెనీని అమ్మకానికి పెట్టి వేలాది మంది ఉద్యోగులను నడిరోడ్డు మీద పడేశారు. ప్రజల భద్రతకు సంబంధించిన కమ్యూనికేషన్ వ్యవస్థను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టి దేశ భద్రతను ప్రమాదంలో పడేస్తున్నారు. ప్రభుత్వరంగ సంస్థల స్థలాలను కూడా కార్పొరేట్ వ్యవస్థలకు తక్కువ ధరకు విక్రయించి, దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగిస్తున్నారు. ఇది మారాలి. ప్రభుత్వరంగ సంస్థలు మళ్లీ జీవం పోసుకోవాలి. అందుకు దేశ ప్రజలపై, మట్టిపై అమితమైన గౌరవం ఉన్న కేసీఆర్ పీఎం అయితేనే మన దేశం మళ్లీ అభివృద్ధిపథంలో నడుస్తుందని నా నమ్మకం.
– బొల్లపల్లి వెంకటస్వామి, రిటైర్డ్ డీఈ, బీఎస్ఎన్ఎల్, జనగామ
ఆర్థిక పరిస్థితిలో గొప్ప మార్పు వస్తుంది..
ఏటూరునాగారం, సెప్టెంబర్ 13 : కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ప్రవేశం దేశ చరిత్రలో మైలు రాయిలాంటిది. అసాధ్యం అనుకున్న ప్రత్యేక తెలంగాణను సాధించిన గొప్ప మేధావి కేసీఆర్. జాతీయ రాజకీయాల్లో ఉంటే దేశ ఆర్థిక పరిస్థితి మారిపోతుంది. తెలంగాణలోని దళితబంధు, రైతుబంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్లు ఇలా ఎన్నో స్కీములు అన్ని రాష్ర్టాల్లోని అర్హులకు అందుతాయి. దేశం సుభిక్షంగా ఉంటుంది. ఇలా దేశమంతా అభివృద్ధి జరగాలి. రిటైర్డు ఉద్యోగులకు నెలవారీ పెన్షన్ ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి నెల రోజులు దాటుతున్నా కేంద్రం ఇంతవరకు ఏమీ చెప్పలేదు. అమలు చేయలేదు. రాష్ట్రంలో దివ్యాంగులకు రూ.3వేల పెన్షన్ అందుతోంది. రిటైర్డు ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం రూ.5వేలు ఇవ్వలేదా? బడుగు, బలహీన వర్గాలపై జీఎస్టీ వేసి ఆర్థిక భారం వేస్తోంది. ఇలాంటి వాటికి కేసీఆర్ స్వస్తి పలుకనున్నారు. తెలంగాణ మాదిరిగా అన్ని రాష్ట్రాల్లో రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వాలని సంకల్పించడం గొప్ప విషయం. కేసీఆర్కు మంచి విజన్ ఉంది. పంటలపై ఆంక్షలు ఉండవు. దేశానికి సమర్థవంతమైన నాయకత్వం ప్రస్తుత పరిస్థితుల్లో అవసరం. దేశం అద్భుతమైన ప్రగతి సాధిస్తుంది. సాగునీటిరంగానికి పెద్దపీట వేసే అవకాశం ఉంది. ఆయన పాలనా అనుభవం దేశానికి ఎంతో ఉపయోగపడుతుంది. కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టాలనే నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. కేసీఆర్ లక్ష్యం నెరవేర్చేందుకు తెలంగాణ ప్రజలు వెన్నంటి ఉండాలి. ఇతర రాష్ర్టాల ప్రజలు కూడా కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకోవడం మంచి విషయం.
– కాత యాదగిరి, రిటైర్డ్ సూపరిండెంటెంట్
కేసీఆర్ ప్రయత్నానికి అందరూ సహకరించాలి
ఎల్కతుర్తి, సెప్టెంబర్ 13 : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. స్వరాష్ట్రం కోసం పోరాడి తెచ్చిన తెలంగాణను సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ దిశగా తీసుకెళ్తున్నారు. అన్ని రంగాల్లో రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తున్నారు. అయితే ఇటీవల ఇతర రాష్ర్టాల ప్రజలు తెలంగాణలో అమలవుతున్న పథకాలను చూసి తమను తెలంగాణలో కలుపాలని డిమాండ్ చేయడమే దీనికి నిదర్శనం. కల్యాణలక్ష్మి, రైతుబంధు పథకాలు చరిత్రలో నిలిచిపోతాయి. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకోవడం మంచి నిర్ణయం. దేశంలో మంచి మార్పు కోసం ఎవరు ప్రయత్నించినా ప్రోత్సహించాలి. తెలంగాణను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషిచేయాలి. ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులు, నాయకులు సైతం సీఎం కేసీఆర్కు సహకరించాలి.
– కొమ్మిడి మల్లారెడ్డి, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం మండల అధ్యక్షుడు, ఎల్కతుర్తి
గొప్ప దార్శనికుడు
హనుమకొండ సబర్బన్, సెప్టెంబర్ 13 : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప దార్శనికుడు. అందుకే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి తొమ్మిదేండ్లు గడవకముందే అద్భుతమైన ప్రగతి సాధ్యమైంది. ప్రతి ఊరికి నర్సరీ, పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డు, వైకుంఠధామం నిర్మించారు. రైతుబంధు, రైతుబీమా పథకాలను ప్రవేశపెట్టి రైతులను ఆదుకుంటున్నారు. పేదల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. ముఖ్యంగా ఆడపిల్ల పెళ్లి కోసం కల్యాణలక్ష్మి ప్రవేశపెట్టి నిరుపేద కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటున్నారు. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తే సామాన్యులకు న్యాయం జరుగుతుంది. ఆయనకున్న దూరదృష్టితో దేశం అన్ని విధాలా బాగుపడుతుంది.
– గొల్లపల్లి లక్ష్మయ్య, విశ్రాంత ఉపాధ్యాయుడు