దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న దళితబంధు పథకం రెండో విడుత ప్రక్రియ మొదలైంది. దేశంలో ఎక్కడా లేని ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన దళిత కుటుంబాలకు రూ.10లక్షల విలువైన యూనిట్లను అందిజేస్తున్నది. అందులో భాగంగా తొలివిడుత వరంగల్ జిల్లాలో 303 మందికి రూ.30.30కోట్ల విలువైన రకరకాల యూనిట్లను పంపిణీ చేయగా, వాటిని అందుకున్న లబ్ధిదారులు మంచి ఆదాయాన్ని గడిస్తున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రెండో విడుత జిల్లాలోని 11 మండలాలకు 3,486 యూనిట్లను కేటాయించగా అధికారులు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపడుతున్నారు. దరఖాస్తులు స్వీకరించి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు.
– వరంగల్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ)
వరంగల్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : దళితబంధు పథకం ద్వారా రెండో విడుత జిల్లాలో 3,486 యూనిట్లను లబ్ధిదారులకు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. వీటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారు. దీంతో దళితబంధు పథకం రెండోవిడుత యూనిట్ల కోసం లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియ మొదలైంది. దళితుల జీవితాల్లో వెలుగు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకాన్ని అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. దేశంలో మరే రాష్ట్రంలో లేని రీతిలో ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల యూనిట్ను అందజేస్తున్నది. గత ఏడాది తొలివిడుత ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 100 మందికి దళితబంధు పథకాన్ని వర్తింపజేసింది. తద్వారా జిల్లాలో 303 మంది రూ.30.30 కోట్ల యూనిట్లను పొందారు. వారు కోరిన యూనిట్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. రవాణ రంగంలో ఫోర్వీలర్, ట్రాన్స్పోర్టు వెహికిల్స్, ట్రాక్టర్లు, కార్లు, ప్యాడీ బాయిలర్స్, జేసీబీలు, హార్వెస్టర్లు, ఇతర సెక్టార్లలో ఆటో మొబైల్, ఆటో స్పేర్ పార్ట్స్, సిమెంట్, స్టీల్, ఐరన్, హార్డ్వేర్, టైల్స్, క్లాత్, లేడీస్ ఎంపోరియం, ఫర్టిలైజర్, ఎలక్ట్రికల్, ఫర్నిచర్, కిరాణం, మెడికల్ తదితర షాపులను నిర్వహిస్తున్నారు. గతంలో గుమస్తాలుగా పని చేసిన వీరిలో పలువురు ఇపుడు దళితబంధు పథకం వల్ల ఓనర్లయ్యారు. దళితబంధు తమ కుటుంబాల్లో వెలుగు నింపిందని ఆనందం వెలిబుచ్చుతున్నారు. తొలివిడుత లబ్ధిదారులకు అందజేసిన యూనిట్ల వివరాలను ఇటీవల అధికారులు దళితబంధు యాప్లో నమోదు చేశారు. ఆయా యూనిట్ ఫొటోలు, వీడియోలను అప్లోడ్ చేశారు. దళితబంధు పథకం యూనిట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ యాప్ను రూపొందించింది.
లబ్ధిదారులకు అందజేసే యూనిట్లు
దళితబంధు ద్వారా రెండోవిడుతలో నిర్ణయించిన యూనిట్ల జాబితాను ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ జాబితాలో వ్యవసాయ, అనుబంధ పథకాలైన మినీ డైరీ, ట్రాక్టర్, ట్రాలీ, ట్రైలర్, పౌల్ట్రీ, వరి నాటు వేసే యంత్రాలు, పవర్ టిల్లర్, రొటోవేటర్, హార్వెస్టర్, అదనపు బ్యాటరీలతో కూడిన అగ్రికల్చర్ డ్రోన్, కస్టమ్ హైరింగ్ సెంటర్, మొబైల్ రైస్మిల్, పందిరి కూరగాయల సాగు, ఫిష్ కల్చర్, కాటన్ హర్, చైన్ హార్వెస్టర్, ట్రాన్స్పోర్టు సెక్టార్లో ఏడుగురు కూర్చునే సామర్థ్యం గల ఆటో, ప్యాసింజర్ ఆటోరిక్షా, మూడు, నాలుగు చక్రాల ఆటో ట్రాలీలు, కారు ట్యాక్సి, గూడ్స్ వెహికిల్, జేసీబీ, టిప్పర్ లారీ, పొక్లెయినర్, మినీ బస్, ఎయిర్ కండిషన్డ్ బస్, ఉత్పత్తి పథకాలైన ఐరన్ గేట్స్, గ్రిల్స్ తయారీ యూనిట్, ఆటో ట్రాలీ, ఐరన్ బెడ్ తయారీ యూనిట్, కాంక్రీట్ మిశ్రమం తయారీ యంత్రం, సిమెంట్ ఇటుకలు, రింగుల తయారీ, సెంట్రింగ్, ఆర్సీసీ రూఫ్ మేకింగ్ యూనిట్, పేపర్ ప్లేట్స్, కప్స్ తయారీ యంత్రం, కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ, ఫ్లెక్సీ ప్రింటింగ్, వాటర్ ప్లాంట్, టైలరింగ్ ఇండస్ట్రీ, ఫ్లవర్ బొకేల తయారీ, యూపీవీసీ డోర్స్, విండోస్, కబ్ బోర్డుల తయారీ, మినీ రైస్మిల్ తదితర యూనిట్లకు చోటు కల్పించింది. రిటైల్ దుకాణాలైన మెడికల్, జనరల్ స్టోర్స్, మినీ సూపర్ బజార్, ఎలక్ట్రికల్ షాపు, శానిటరీ, టైల్స్, విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల దుకాణం, రెడీమెడ్ క్లాత్స్టోర్, ఫర్నిచర్, లెదర్ షాపు, బుక్ స్టాల్, లేడీస్ ఎంపోరియం, సీసీ కెమెరా సేల్స్, సర్వీసెస్, మిల్క్ ప్రొడక్ట్స్, మినీ కోల్డ్ స్టోరేజీ, క్యాటిల్తో పాటు సర్వీస్ సెక్టార్లో హోటల్, క్యాటరింగ్ సర్వీస్, బేకరీ, డీటీపీ, ఫొటో స్టూడియో, టెంట్ హౌస్, డెకరేషన్, లైటింగ్, డీజే సౌండ్ సిస్టం, బ్యూటీ పార్లర్, ఆర్గానిక్ మిల్లెట్స్ షాపు, బిర్యానీ సెంటర్, మిఠాయివాలా, డయోగ్నొసిస్ సెంటర్, దాబా హోటల్, ఫుట్ వేర్, పౌల్ట్రీ, ఐస్క్రీమ్, పెట్రోల్ పంపు, పెయింట్ తదితర షాపులకు ప్రభుత్వం రూ.10 లక్షలు అందజేయనున్నది.
రెండోవిడుత యూనిట్లు ఎన్నంటే..
దళితబంధు పథకం ద్వారా రెండో విడుత ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 1,100 మందికి యూనిట్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లెక్కన జిల్లాలోని పదకొండు మండలాలకు 3,486 యూనిట్లను కేటాయించింది. వీటిలో నర్సంపేట మున్సిపాలిటీ 150, మండలాల వారీగా నర్సంపేట 130, చెన్నారావుపేట 130, దుగ్గొండి 180, ఖానాపురం 90, నల్లబెల్లి 120, నెక్కొండ 150, రాయపర్తి 216, సంగెం 216, గీసుగొండ 160, జీడబ్ల్యూఎంసీ పరిధిలోని 15వ డివిజన్ 37, 16వ డివిజన్ 33, 17వ డివిజన్ 45, పర్వతగిరి, వర్ధన్నపేట, వర్దన్నపేట నియోజకవర్గం పరిధిలోని ఖిలా వరంగల్, వరంగల్ ప్రాంతాలు, వర్ధన్నపేట మున్సిపాలిటీ కలిపి 600, వరంగల్ తూర్పు నియోజకవర్గం 1,100 యూనిట్లు ఉన్నాయి. ఒక్కో యూనిట్ విలువ రూ.10 లక్షలు. ఈ లెక్కన ప్రభుత్వం దళితబంధు పథకం ద్వారా రెండో విడుత రూ.348.60 కోట్లతో జిల్లాలో 3,486 యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నది. ఇందుకోసం లబ్ధిదారులను ఎంపిక చేయడానికి దరఖాస్తులను స్వీకరిస్తున్నది. కొద్దిరోజుల నుంచి జిల్లాలోని ఎంపీడీవో, మున్సిపాలిటీ కార్యాలయాల్లో దరఖాస్తుల స్వీకరిస్తున్నది. ఇప్పటివరకు జిల్లాలో సుమారు ఏడు వేల దరఖాస్తులు ప్రభుత్వానికి అందినట్లు అధికారులు తెలిపారు. ఎప్పటికప్పుడు వీటిని గ్రామ స్థాయిలో దళితబంధు పథకం స్పెషల్ ఆఫీసర్స్, మండల స్థాయి బృందాలు పరిశీలిస్తున్నాయి. వెరిఫికేషన్ పూర్తి చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు.