రెండో విడుత సబ్సిడీ గొర్రెల పంపిణీలో అక్రమాలకు తావులేకుండా ప్రభుత్వం పక్కా ప్రణాళిక రూపొందించింది. ఈ మేరకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నది. గొర్రెల కొనుగోలులో పశుసంవర్ధక శాఖ వైద్యులను పక్కనపెట్టింది. వీరి స్థానంలో వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించింది. మొత్తం ప్రక్రియ పర్యవేక్షణకు 13 బృందాలను నియమించింది. ఇక గొర్రెల కోసం లబ్ధిదారులు తమ వాటాధనాన్ని చెల్లించే విధానంలో కూడా మార్పులు తీసుకొచ్చింది. డీడీల రూపంలో కాకుండా బ్యాంకు సొంత ఖాతా నుంచి కలెక్టర్ ఖాతాకు బదిలీ చేయాలని స్పష్టం చేసింది.
– వరంగల్, మే 13(నమస్తేతెలంగాణ)
వరంగల్, మే 13(నమస్తే తెలంగాణ) : గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ఇందులో భాగంగా గొర్రెల పెంపకందారుల కోసం సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. రెండు విడుతల్లో సబ్సిడీ గొర్రెలను అందజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు గ్రామం వారీగా లబ్ధిరులను గుర్తించారు. యాభైశాతం మందితో ‘ఏ’ లిస్టు, మరో యాభై శాతం మందితో ‘బి’ లిస్టు తయారు చేశారు. డ్రా పద్ధతి ద్వారా ఇప్పటికే ‘ఏ’ లిస్టులోని వారికి గొర్రెలను పంపిణీ చేశారు.
ఒక్కొక్కరికి 21 గొర్రెలతో కూడిన రూ.1.25 లక్షల యూనిట్ను పంపిణీ చేసింది. లబ్దిదారు తన వాటాధనం కింద రూ.31,250 డీడీ రూపంలో చెల్లించగా ప్రభుత్వం 75 శాతం సబ్సిడీగా రూ.93,750 ఇచ్చింది. లబ్ధిదారులను తమ వెంట తీసుకెళ్లి పశు సంవర్ధకశాఖ వైద్య అధికారులు ఈ నిధులతో ప్రభుత్వం సెలెక్ట్ చేసిన రాష్ర్టాల్లో గొర్రెలను కొనుగోలు చేశారు. అయితే, వాటాధనం సేకరించడం నుంచి గొర్రెల కొనుగోలు, రవాణా, పంపిణీలో అక్రమాలు జరిగాయని వివిధ జిల్లాల్లో ఆరోపణలొచ్చాయి. ‘ఏ’ లిస్టులోని కొందరు వివిధ కారణాల వల్ల తమ వాటాధనాన్ని చెల్లించకపోతే వారి పేర ఇతరులు వాటాధనాన్ని చెల్లించి గొర్రెలను పొందారనేది ఆరోపణల సారాంశం.
ఇక సబ్సిడీ గొర్రెలను కొనుగోలు చేయకుండానే చేసినట్లు, వాటిని లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు, దళారీలు కొందరు పశు సంవర్ధకశాఖ అధికారులతో అవగాహన కుదుర్చుకోవడం వల్లే ఇదంతా జరిగిందని ఫిర్యాదులొచ్చాయి. దీంతో రెండోవిడుత పంపిణీలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు కొత్త మార్గదర్శకాలను రూపొందించింది. ‘బి’ లిస్టులోని గొర్రెల పెంపకందారులు తమ వాటాధనాన్ని బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నారు. దీన్ని నేరుగా కలెక్టర్ పేర ఉన్న బ్యాంకు ఖాతాకు బదిలీ చేస్తున్నారు. దీంతో వాటాధనాన్ని ఇతరులు కాకుండా స్వయంగా గొర్రెల పెంపకందారుడే చెల్లించాడనేది స్పష్టం అవుతుంది.
ప్రత్యేక టీంల ఏర్పాటు..
ఈ సారి పశుసంవర్ధక శాఖ వైద్య అధికారులు కాకుండా వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా స్థాయి అధికారులు సబ్సిడీ గొర్రెల కొనుగోలు, రవాణా, పంపిణీని మానిటరింగ్ చేస్తారు. ఇందుకోసం కలెక్టర్ ప్రత్యేకంగా 13 బృందాలను ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయి అధికారుల్లో ఒక్కొక్కరు ఒక్కో టీం లీడర్గా వ్యవహరిస్తారు. ఈ టీముల్లో మండల పంచాయతీ అధికారులు ఉంటారు. ఇందులో ఒక టీం రిజర్వ్లో ఉంటుంది. పన్నెండు టీంలు గొర్రెలను కొనుగోలు చేసి గ్రామాలకు చేర్చడం, లబ్ధిదారులకు అందేవరకు బాధ్యతలు తీసుకుంటారు. గొర్రెలను ఆంధ్రప్రదేశ్లోని కడప, చిత్తూరు, కర్నాటక రాష్ట్రంలోని బాగల్కోట్ జిల్లాల్లో కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మే నుంచి ఆగస్టులోగా రెండోవిడుత సబ్సిడీ గొర్రెలను పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ క్రమంలో పశు సంవర్ధక శాఖ అధికారులు కొద్ది రోజుల నుంచి ‘బి’ లిస్టులోని గొర్రెల పెంపకందారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
వాటాధనం చెల్లింపు..
జిల్లాలోని పదమూడు మండలాల్లో 199 గొర్రెల పెంపకందారుల సహకార సంఘాలు ఉండగా, వీటిలో 23,252 మంది సభ్యులు ఉన్నట్లు పశు సంవర్ధక శాఖ అధికారులు వెల్లడించారు. తొలివిడుత 10,470 మందికి గొర్రెల పంపిణీ జరిగింది. రెండో విడుతలో 12,782 మందికి పంపిణీ చేయాల్సి ఉంది. ధరలు పెరిగినందున ఒక్కో లబ్ధిదారుకు అందజేసే 21 గొర్రెల యూనిట్ విలువను ప్రభుత్వం రూ.1.75 లక్షలకు పెంచింది. ఇందులో లబ్ధిదారుడు తన వాటాధనం కింద రూ.43,750 చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం రూ.1,31,250 సబ్సిడీ అందజేయనుంది. కాగా, ఇప్పటికే వరంగల్ జిల్లాలో 400 మందికిపైగా తమ వాటాధనాన్ని బ్యాంకు ఖాతా నుంచి కలెక్టర్ ఖాతాకు పంపినట్లు తెలిసింది. కొద్దిరోజుల్లో ప్రత్యేక బృందాల అధికారులు వాటాధనం చెల్లించిన వారికి సబ్సిడీ గొర్రెలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. అలాగే గొర్రెల ట్రాన్స్పోర్టు టెండర్లు త్వరలో ఖరారు కానున్నట్లు తెలిసింది.