వరంగల్, నవంబర్ 13: వరంగల్, హనుమకొండ జిల్లాల్లో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ సోమవారం పూర్తయింది. వరంగల్ తూర్పు నియోజకవర్గ నామినేషన్లను రిటర్నింగ్ అధికారి షేక్ రిజ్వాన్ బాషా పరిశీలించారు. 37 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా, ఆరు తిరస్కరణకు గురయ్యాయి. 31 సరిగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా నన్నపునేని నరేందర్ వేసిన నాలుగు సెట్లనూ ఆమోదించారు. అలాగే, బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్రావు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా సురేఖ నామినేషన్లను రిటర్నింగ్ అధికారి ఆమోదించారు. బీఎస్పీ అభ్యర్థి చిత్రపు పుష్పిత లయ నామినేషన్ ఓకే అయింది. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి త్రిపురోజు రవికుమార్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థి కొండా మురళీధర్రావు, బీజేపీ డమ్మీ అభ్యర్థి ఎర్రబెల్లి రేణుక అందించిన ధ్రువీకరణ పత్రాలు సరిగా లేకపోవడంతో తిరస్కరించారు. వీరితోపాటు స్వతంత్ర అభ్యర్థులు నరేశ్ సిద్ధం, బైరి వంశీకృష్ణ, ఎండీ నసీరుద్దీన్ నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఈ నెల 15 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది.
హనుమకొండ: వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 35 మంది 55 నామినేషన్లు వేసినట్లు రిటర్నింగ్ అధికారి ఎల్.రమేశ్ తెలిపారు. వీటిని హనుమకొండ ఆర్డీవో కార్యాలయంలో క్షుణ్ణంగా పరిశీలించి, 15 తిరస్కరించినట్లు ఆయన చెప్పారు. బీఆర్ఎస్ అభ్యర్థి దాస్యం వినయ్భాస్కర్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాయిని రాజేందర్రెడ్డి, బీఎస్పీ నుంచి మాదారపు రవికుమార్, బీజేపీ అభ్యర్థి రావు పద్మ, తెలంగాణ ద్రావిడ ప్రజల పార్టీ నుంచి ఐలాపురం వేణుచారి, ధర్మ సమాజ్ పార్టీ నుంచి కోగిల రూప, మార్యూస్ట్ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (యునైటెడ్) నుంచి గడ్డం నాగార్జున, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి జంగా రాఘవరెడ్డి, అలయెన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫామ్స్ ఫార్టీ నుంచి గట్ల యుగేంధర్, అజాద్ సమాజ్ పార్టీ నుంచి సయ్యద్ షాజిహషీర్, బహుజన్ రిపబ్లిక్ సోషలిస్టు పార్టీ నుంచి సీత రాజ్కుమార్, స్వతంత్ర అభ్యర్థులు ఎమ్మడి రవి, ఉల్లెంగుల యాదగిరి, మహ్మద్ ఖలీలొద్దీన్, కుందూరు కృష్ణ, గుజ్జుల శ్రీనివాస్రెడ్డి, గుర్రం జక్కయ్య, మధుకర్ జన్ను, బొమ్మగాని భార్గవ్, పూసల సత్యప్రకాశ్ నామినేషన్లు ఓకే అయ్యాయి. పెండెం రాఘవరావు, నరేందర్ గొల్లెన, బంక రాజు, గుర్రం శాంతమ్మ, సాయిని రవీందర్, ఫారూక్ అహ్మద్ హసన్ మహ్మద్, సౌమ్యశ్రీ ఆకుతోట, డాక్టర్ నాయిని శ్రీగోదారెడ్డి, మూరతోటి కల్పన, ఎర్ర అశోక్, దామెర సుదర్శన్, యాదగిరి బొనగిరి, సయ్యద్ నయీమ్, సయ్యద్ ఖాజా నయీమొద్దిన్, బానోత్ విద్యాసాగర్ నామినేషన్లను తిరస్కరించారు.
వర్ధన్నపేట/పరకాల/నర్సంపేట: స్క్రూటినీలో భాగంగా వర్ధన్నపేట నియోజకవర్గానికి సంబంధించి ఆరుగురు అభ్యర్థుల ఎనిమిది నామినేషన్లు తిరస్కరణకు గురైనట్లు వర్ధన్నపేట ఎన్నికల రిటర్నింగ్ అధికారి, అదనపు కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే తెలిపారు. 26 మంది 40 నామినేషన్లు దాఖలు చేశారు. వర్ధన్నపేట ఆర్వో కార్యాలయంలో ఆర్వో అశ్వినీ తానాజీ వాకడే, ఏఆర్వో విజయ్సాగర్ ఆధ్వర్యంలో నామినేషన్లను పరిశీలించారు. ఇందులో ఆరుగురు అభ్యర్థుల 8 నామినేషన్ పత్రాల్లో సరైన వివరాలు లేకపోవడంతో తిరస్కరించారు. పరకాల నియోజజవర్గంలో ఎన్నికల అబ్జర్వర్ గోపాలకృష్ణ, రిటర్నింగ్ అధికారి కె.శ్రీనివాస్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్లను పరిశీలించారు. 41 మంది నామినేషన్లు దాఖలు చేయగా, అందులో ఐదింటిని తిరస్కరించారు. బీజేపీ అభ్యర్థిగా పగడాల స్వర్ణలత, అలియన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ అభ్యర్థిగా యాదగిరి బొనగాని, స్వతంత్ర అభ్యర్థులుగా మంద సంధ్యారాణి, ఐలి సాంబయ్య, కుమ్మరి కన్నయ్య నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. 36 మంది అభ్యర్థుల పత్రాలు సరిగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. నర్సంపేటలో ఐదు నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. 24 మంది 42 సెట్లు వేశారు. ఇందులో ఐదింటిని తిరస్కరించగా, 19 ఆమోదం పొందాయి. కార్యక్రమంలో ఏఆర్వో విశ్వప్రసాద్, వివిధ రాజకీయ పార్టీల ఏజెంట్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తిరస్కరణకు గురైన వాటిలో గటిక అజయ్కుమార్, షేక్ హర్షియా, జంపాల వీరస్వామి, ఇమ్మడి బాబు, బోడ అనిల్కుమార్ నామినేషన్లు ఉన్నాయి.
వరంగల్: ఎన్నికల సంఘం నిబంధనల మేరకే నామినేషన్ల పరిశీలన జరగాలని కేంద్ర ఎన్నికల సాధారణ పరిశీలకుడు షణ్ముగ రాజన్ అన్నారు. సోమవారం నామినేషన్ల పరిశీలనలో భాగంగా తూర్పు నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన నామినేషన్ల పరిశీలన ప్రక్రియను పరిశీలించారు. రిటర్నింగ్ అధికారి షేక్ రిజ్వాన్ బాషా నామినేషన్ల పరిశీలనను నిబంధలన ప్రకారమే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అడిషనర్ ఆర్వో అనీసుర్ రషీద్, అసిస్టెంట్ ఆర్వో ఇక్బాల్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఉన్నారు.