ఆత్మకూరు, సెప్టెంబర్ 14 : స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ -2023 అవార్డులో భాగంగా ఐదు వేల జనాభా కల్గిన ఉత్తమ జీపీ పురస్కరాన్ని సర్పంచ్ పర్వతగిరి రాజు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చేతుల మీదుగా గురువారం హైదరాబాద్లో అందుకున్నారు. రాజేంద్ర నగర్లోని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో స్వచ్ఛ పురస్కారాల ప్రదానం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఏ శ్రీనివాస్కుమార్, డీపీవో వీ జగదీశ్వర్, ఎంపీడీవో శ్రీనివాస్రెడ్డి, ఎంపీవో చేతన్కుమార్రెడ్డి, కార్యదర్శి మేడ యాదగిరి, ఎస్బీఎస్ కన్సల్టెంట్లు ప్రవీణ్, సంపత్ పాల్గొన్నారు.
అవార్డుకు పరిశుభ్రత, అభివృద్ధి పనులు దోహదం..
ఆత్మకూరు గ్రామంలో నిత్యం జరుగుతున్న ఓడీఎఫ్ ప్లస్ కార్యక్రమాలైన ప్లాస్టిక్ వ్యర్థాలు, తడిపొడి చెత్త నిర్వహణ అంశాలతో పాటు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి రూ. 3కోట్ల 50 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులు కూడా అవార్డు రావడానికి దోహదం చేశాయని ఎంపీడీవో శ్రీనివాస్రెడ్డి, ఎంపీవో చేతన్కుమార్రెడ్డి తెలిపారు. ఇటీవల పెద్ద చెరువు నుంచి రాయకుంట చెరువు వరకు రూ.1కోటీ 80 లక్షలతో సీసీ డ్రైనేజీ నిర్మాణం వల్ల గ్రామం సుందరంగా తయారైందన్నారు. అలాగే రూ.1కోటీ 70లక్షలతో గ్రామంలో 11 బిట్లతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణంతో గ్రామంలో మట్టి రోడ్లు లేకుండా పోయాయన్నారు. ఆత్మకూరు సీసీ రోడ్లు, సెంట్రల్ లైటింగ్తో సుందరంగా కనిపిస్తోందన్నారు. స్వచ్ఛ పురస్కారానికి ఆత్మకూరు ఎంపిక కావడానికి మల్టి పర్పస్ వర్కర్లు నిత్యం చేస్తున్న పారిశుధ్యం పనులు ఒక వైపు, గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులు కారణమయ్యాయని ఎంపీడీవో శ్రీనివాస్రెడ్డి, ఎంపీవో చేతన్కుమార్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.