నర్సంపేట, ఆగస్టు 18: సమాజం గర్వించదగిన ముద్దుబిడ్డ సర్వాయి పాపన్న అని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న 373వ జయంతి వేడుకలను శుక్రవారం పట్టణంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సంపేటలోని ఆర్అండ్బీ గెస్ట్హౌస్ నుంచి పాకాల రోడ్డు వరకు గౌడ కులస్తులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పెద్ది హాజరై పాపన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ బహుజన రాజ్యాధికార పోరాటయోధుడు, మొగలాయిల దౌర్జన్యాలను ఎదిరించిన వీరుడు సర్వాయి పాపన్నగౌడ్ అని కొనియాడారు. తెలంగాణ ప్రాంత ప్రజలు పాపన్నను చిరకాలం గుర్తించుకుంటారని తెలిపారు. ఆనాటి పాలకుల అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారని గుర్తుచేశారు. పాపన్న జీవిత స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. యువత ఆయన అడుగు జాడల్లో నడవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సర్వాయి పాపన్న జయంతిని నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. బీఆర్ఎస్ సర్కారు గౌడ కులస్తులకు సముచిత స్థానం కల్పించిందన్నారు.
గీత కార్మికుల అభివృద్ధికి తోడ్పాటు
గీత కార్మికుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటునందిస్తున్నదని ఎమ్మెల్యే పెద్ది అన్నారు. సీఎం కేసీఆర్ గౌడ కులస్తుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. ఇప్పటికే నర్సంపేటలో రూ. కోటితో గౌడ సంఘం ఆత్మగౌరవ భవనాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. గౌడ సంఘం నర్సంపేట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కమ్యునిటీ హాల్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని వెల్లడించారు. కమ్యునిటీ హాల్ నిర్మాణానికి రూ. 50 లక్షలను అదనంగా మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల్లో నియోజకవర్గంలోని గౌడ కులస్తులకు మొదటి ప్రాధాన్యంతోపాటు తన సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణ, గౌడ సంఘం పట్టణ అధ్యక్షుడు గిరగాని సాంబయ్య, కార్యదర్శి తాళ్లపళ్లి కుమారస్వామి, కోశాధికారి కోల వెంకన్న, తాళ్లపల్లి చంద్రమౌళి, మాచర్ల ఐలుమల్లు, ఊడుగుల శ్రీనివాస్, తండా శ్రీధర్, కౌన్సిలర్ వేముల సాంబయ్య, సట్ల సుధాకర్, వేముల రవి, రామగోని సుధాకర్, పుల్లూరి స్వామి, బూర వేణు, దూపటి శ్రీను, మండ మల్లయ్య పాల్గొన్నారు.