కన్నెపల్లి నుంచి వెన్నెల వెలుగుల్లో సారలమ్మ కదిలివచ్చింది.. వనంలో ఘనమైన మొక్కులందుకోను మేడారం గద్దెపై బుధవారం అర్ధరాత్రి కొలువుదీరింది. దారిపొడవునా భక్తజనం జాబిలమ్మకు ప్రణమిల్లింది. కరుణించాలని.. కడుపుపండాలని ఆడబిడ్డలు తడిబట్టలతో వరం పట్టగా.. తన్మయత్వంతో వేలాది మంది సాష్టాంగపడగా వారందరినీ దీవిస్తూ.. జంపన్నను పలుకరిస్తూ కల్పవల్లి తరలివచ్చింది. ఆద్యంతం శివసత్తులు పూనకాలతో శివవాలూగారు. కోరిన కోర్కెలు తీర్చాలని.. కష్టాలు కడతేర్చాలని భక్తులు మొక్కులు ముట్టజెప్పారు. నేడు చిలుకలగుట్ట నుంచి తల్లి సమ్మక్క రాక కోసం తనువెల్లా కనులు చేసుకొని ఎదురుచూస్తున్నారు.
వరాల వన దేవత సారలమ్మ బుధవారం మేడారం గద్దెపై కొలువుదీరింది. పగిడిద్దరాజు, గోవిందరాజులు సారలమ్మతోనే గద్దెలపైకి చేరారు. కన్నెపల్లిలోని సారలమ్మ గుడి వద్ద ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం వడ్డెలు(పూజారులు) పూజలు చేశారు. సాయంత్రం గుడి నుంచి మొంటె (వెదురు బుట్ట)లో అమ్మవారి ప్రతిరూపమైన పసుపు, కుంకుమలు తీసుకుని మేడారానికి బయలుదేరారు. జంపన్నవాగులోంచి సమ్మక గుడికి చేరుకున్నారు. అప్పటికే అకడికి చేరుకున్న పగిడిద్దరాజు, గోవిందరాజులుతో కలిసి వడ్డెలు ముగ్గురి రూపాలను రాత్రి12.12గంటలకు మేడారం గద్దెలపై చేర్చారు. కన్నెపల్లి నుంచి మూడు కిలో మీటర్ల దూరంలోని మేడారం గద్దెల వద్దకు సారలమ్మ వస్తున్న వేడుకను చూసేందుకు లక్షలాది మంది భక్తులు పోటీపడ్డారు. పూజారి దేవతను తీసుకొస్తున్న సమయంలో సంతానభాగ్యం కలుగాలని, కోరెలు నెరవేరాలని గుడి ముందు మహిళలు నేలపై పడుకోగా సారలమ్మను తీసుకువచ్చే ప్రధాన పూజారి కాక సారయ్య వారిని తొక్కుకుంటూ వెళ్లారు. అమ్మవారి ప్రతిమను వెదురు బుట్టలో తీసుకొస్తుండగా ఆలయం మెట్ల నుంచి వంద మీటర్ల పొడవునా భక్తులు కింద పడుకొని వరం పట్టారు.
పూజారులు వీరిపై నుంచి దాటి వెళ్లారు. సారలమ్మ రాకను సూచిస్తూ ఆదివాసీ పూజారులు కొమ్ముబూరలు ఊదారు. ప్రత్యేక డోలు వాయిద్యాలు, శివసత్తుల పూనకాలు, హిజ్రాల శివాలుతో సారలమ్మ ఆలయం భక్తితో ఉప్పొంగింది. సారలమ్మ నేరుగా గద్దెలపైకి కాకుండా మేడారంలోని సమ్మక్క పూజా మందిరానికి చేరుకుంది. అప్పటికే అక్కడికి గోవిందరాజు, పగిడిద్దరాజులు చేరుకున్నారు. పూజారులంతా కలిసి పూజలు చేసి కట్టు వేసిన అనంతరం సారలమ్మను గద్దెపైకి చేర్చారు. మంత్రి, కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు అమ్మవారికి స్వాగతం పలికారు. సోలం వెంకటేశ్వర్లు పట్టిన హనుమంతుడి జెండా నీడలో కన్నెపల్లి వెన్నెలమ్మ గద్దెపైకి చేరింది. కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆధ్వర్యంలో అధికారులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎస్పీ డాక్టర్ పీ శబరీష్ పర్యవేక్షణలో రోప్పార్టీ సిబ్బంది, సీఆర్పీఎఫ్ పోలీసులు తాడు వలయంతో భద్రత కల్పించారు.