కృష్ణకాలనీ, జూన్ 22 : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు చుక్కెదురైంది. ఆయన ఊకదంపుడు మాటలు వినలేక జనం సభ జరుగుతుండగానే వెళ్లి పోయారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పాత అంగడి మైదానంలో గురువారం సాయంత్రం నిర్వహించిన బీజేపీ మహాజన్ సంపర్క్ అభియాన్ సభ జనాలు లేక సభ వెలవెలబోయింది. బీజేపీ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి చందుపట్ల కీర్తిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి మాట్లాడుతుండగానే జనాలు ఇంటిబాట పట్టారు. సభ ప్రారంభం నుంచే జనాలు ఇక్కడ ఉండడానికి ఇష్టపడలేదు.
మొదట కొంత మంది బీజేపీ నాయకులు మాట్లాడుతుండగానే మహిళలు సభ నుంచి వెళ్తుండగా, ఓ కార్యకర్త బతిమాలి వారిని సభలో కూర్చోబెట్టాడు. అనంతరం సభలోకి వచ్చిన సంజయ్ మాట్లాడుతుండగానే సభకు వచ్చిన ప్రజలు వినలేక వెళ్లిపోయారు. దీంతో జనాలు లేక కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. 25 నుంచి 28 నిమిషాలు మాట్లాడినా అక్కడ ఉన్న కొద్దోగొప్పో మంది నుంచి స్పందన కూడా కరువైంది. ఒకానొక సందర్భంలో బండి కుర్చీలతోనే మాట్లాడుతున్నాడా.. అని అన్నట్లు సభలో కనిపించింది.