బచ్చన్నపేట, జూన్ 25 : గ్రామ పంచాయతీ వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి వస్తున్న కారోబార్లు మల్టీ పర్పస్ విధానంతో ఉనికి కోల్పోయే స్థితికి చేరుకున్నారు. పెన్ను పట్టి రికార్డులు రాసి, సిబ్బందితో పనులు చేయించే కారోబార్లు నేడు పార పట్టుకోవాల్సిన స్థితికి చేరుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీల్లో కారోబార్లు, బిల్ కలెక్టర్లు, సిబ్బంది కలిపి 58 వేల మంది పని చేస్తున్నారు.
అందులో కారోబార్లు 4,337 మంది, బిల్కలెక్టర్లు 795 మంది, నలుగురు జూనియర్ అసిస్టెంట్లు, 450 మంది క్లర్కులు పంచాయతీల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. అయినా వారికి ఇచ్చేది కేవలం నెలకు రూ. 9,500 మాత్రమే. ఆ వేతనాలు కూడా నెలనెలా రాకపోవడంతో కుటుంబాన్ని పోషించుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కారోబార్లు, బిల్ కలెక్టర్ల బాధలు అర్థం చేసుకొని వారిని మల్టీ పర్పస్ విధానం నుంచి విముక్తి చేసి పాత పద్ధతినే కొనసాగించాలని కోరుతున్నారు. అలాగే ప్రతినెలా గ్రీన్చానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 71 మండలాలు, 1,688 గ్రామ పంచాయతీలున్నాయి. ఇందులో 1,005 మంది కారోబార్లు, 68 మంది బిల్ కలెక్టర్లు, 61 మంది క్లర్క్లు, ఒకరు జూనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్నారు. అయితే 2020లో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న కారోబార్లు, బిల్ కలెక్టర్ల వివరాలను పంచాయతీ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయగా, వాటిని ఆన్లైన్లో పొందుపర్చింది. వీరినే పంచాయతీ అసిస్టెంట్లుగా నియమించాలని, జీవో 51 నుంచి మినహయింపు ఇవ్వాలని సిబ్బంది కోరుతున్నారు.
కారోబార్లు చాలీ చాలని వేతనాలతో గ్రామాల్లో 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శి గ్రామానికి వచ్చే సరికే అన్ని పనులు చేసి పెడుతున్నారు. సిబ్బందితో పారిశుధ్య పనులు చేయించడం, వీధి దీపాలు వేయించడం, డ్రైనేజీలతో పాటు శుభ, అశుభ కార్యక్రమాలైన వాళ్ల ఇళ్ల వద్ద పరిశుభ్రంగా ఉంచడం, పన్నుల వసూలు, నల్లా బావి, బోరు మోటర్లు కాలిపోతే మరమ్మతు చేయించడం తదితర పనులు చూసుకుంటారు. కార్యదర్శి రాగానే వారితో కలిసి గ్రామాభివృద్ధిలో భాగస్వామ్యమవుతుంటారు.
అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలోనూ వారి పాత్ర ఉంటున్నది. అయితే ప్రభుత్వ మల్టీ పర్పస్ విధానంతో అన్ని పనులు వారే స్వయంగా చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఏ ప్రభుత్వ ఉద్యోగికి లేని నిబంధనను వారికి వర్తింపజేయడంతో కారోబార్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఏళ్ల తరబడి పని చేసినా రెగ్యులర్ కాక రిటైర్మెంట్కు దగ్గర పడ్డ వారు ఎందరో ఉన్నారు. తక్కువ వేతనాలకే పనిచేస్తూ బతుకీడ్చడం వారికి దుర్భరంగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గ్రామ పంచాయతీ ఉద్యోగులకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.
జీవో 51ని సవరించి అందులో నుంచి కారోబార్, బిల్ కలెక్టర్లను మినహాయించి పాత పద్ధతినే కొనసాగించాలి. ఎవరి పనులు వారే చేసుకునేలా ప్రభుత్వం ఆదేశాలివ్వాలి. కారోబార్లు ఉనికి కోల్పోకుండా చర్యలు తీసుకోవాలి. అలాగే ప్రతి కారోబార్కు వర్క్ చార్ట్ అందించాలి. పంచాయతీల్లో ఇప్పటి వరకు పని చేస్తున్న సిబ్బంది మొత్తాన్ని ఆన్లైన్ చేయాలి. అప్పుడే పంచాయతీలపై ఆర్థిక భారం పడకుండా ఉంటుంది. ఏ ప్రభుత్వ శాఖలో లేని నిబంధనను పంచాయతీల్లో అమలు చేయడం సబబు కాదు. గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న అన్ని కేటగిరీల సిబ్బందికి ప్రతి నెల గ్రీన్ చానల్ ద్వారా వేతనాలను వారి ఖాతాల్లో జమ చేయాలి.
– మామిడాల నర్సింహులు, తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం జేఏసీ చైర్మన్
ఏళ్ల తరబడి పని చేస్తున్నప్పటికీ వచ్చే జీతంతో పూట గడవడం కష్టంగా మారింది. జీతం కూడా సకాలంలో రాదు. తెల్లవారింది మొదలు రాత్రి వరకు గ్రామంలో వెట్టి చాకిరి చేయాల్సిందే. అయినా సరైన గుర్తింపు లేదు. ప్రతి ఒక్కరు మమ్మల్ని బెదిరిస్తుంటరు. కొత్త సర్పంచ్లు వచ్చినప్పుడల్లా ఎవర్ని తీసేస్తారోననే భయం. ఉద్యోగ భద్రత లేదు. సిబ్బందిని తీసేయకుండా ప్రభుత్వం డీపీవోల ద్వారా ఉత్తర్వులు ఇప్పించాలి. మల్టీ పర్పస్ నుంచి మినహాయింపు ఇచ్చి మా పని మేమే చేసుకునేలా ఆదేశాలు ఇవ్వాలి. వేతనాలు నెలనెలా మా ఖాతాల్లో జమయ్యేలా చర్యలు తీసుకోవాలి. ప్రతీ ఒక్కరికి గుర్తింపు కార్డులు అందించాలి.
– కాళ్ల ప్రభాకర్, కారోబార్, నారాయణాపూర్, బచ్చన్నపేట మండలం