వర్ధన్నపేట, మార్చి 23 : వేతనాల కోసం వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపల్ కార్యాలయం ఎదుట పారిశుధ్య కార్మికులు శనివారం ధర్నా చేశారు. నిత్యం తెల్లవారుజామునే రహదారులు, అంతర్గత రోడ్లు, డ్రైనేజీలను శుభ్రం చేసే తమకు అధికారులు నాలుగు నెలలుగా వేతనాలు అందించడం లేదని ఆందోళన వ్యక్తంచేశారు.
ఈ విషయమై రెండు నెలల క్రితం మున్సిపల్ కార్యాలయం ముందు భైఠాయించి నిరసన తెలిపారు. అయినప్పటికీ మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడంతో నెలలుగా వేతనాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని పేర్కొన్నారు. వేతనాల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా పాలక మండలి తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు వేతనాలను మంజూరు చేయాలని కార్మికులు కోరారు.