నమస్తే నెట్వర్క్, అక్టోబర్ 22 ;సద్దుల బతుకమ్మ సంబురం అంబరాన్నంటింది. ఊరూరా ఆడబిడ్డల ఆటాపాటలతో పూల పండుగ ఆదివారం వైభవంగా జరిగింది. తీరొక్క పూలతో పేర్చి ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో..’, ‘ఒక్కేసి పువ్వేసి చందమామ..’ పాటలతో వీధులు, మైదానాలు హోరెత్తగా ఆ ప్రాంతమంతా పూలవనాన్ని తలపించింది. డీజేలో పాటలకు అనుగుణంగా యువతులు కోలాటాలతో ఉత్సాహంగా ఆడిపాడారు. అనంతరం చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేసి ‘గౌరమ్మా.. వెళ్లి రావమ్మా..’ అంటూ వీడ్కోలు పలికారు. ఆ తర్వాత ఒకరికొకరు వాయినాలు ఇచ్చిపుచ్చుకొని సత్తుపిండిని ఒకరికొకరు పంచుకున్నారు.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సద్దుల బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకొన్నారు. పల్లె, పట్నం అనే లేకుండా ఆడబిడ్డలు సంతోషంగా ఆడిపాడారు. తీరొక్క పూలతో అందంగా పేర్చిన రంగురంగు ల బతుకమ్మలతో సాయంత్రం వేళ వీధులు, ప్రధాన కూడళ్ల వద్ద అంతా కలిసి ఆటపాటలతో సందడి చేశారు. దీంతో దారులన్నీ పూదోటలుగా మారాయి. ముఖ్యంగా జిల్లాకేంద్రాల్లోని బతుకమ్మ పాయింట్లు పూలజాతరను తలపించాయి. హనుమకొండలోని పద్మాక్షి గుట్ట, మెట్టుగుట్ట, వరంగల్లోని రంగలీలా మైదానం, చిన్నవడ్డేపల్లి, జనగామలోని బతుకమ్మకుంట, భూపాలపల్లిలోని అంబేద్కర్ స్టేడియం, హనుమాన్ టెంపుల్, ములుగులోని తోపుకుంట మినీ ట్యాంక్బండ్, మహబూబాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియం, నిజాం చెరువు, బంధం చెరువు ప్రాంతాలన్నీ కిటకిటలాడాయి. అనంతరం చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేశారు.