గుమ్మడి, తంగేడు, గునుగు, పట్టుకుచ్చు, కట్ల, రుద్రాక్ష, గోరింట, బంతి, చామంతి, తామర ఇలా తీరొక్క పూలతో ఇంటింటా బతుకమ్మను పేర్చి, నేటి ‘సద్దుల’ పండుగను సంబురంగా జరుపుకొనేందుకు మహిళా లోకం సిద్ధమైంది. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకల్లో తుది ఘట్టం నేడు అంగరంగవైభవంగా జరుగనుంది. ఊరూరా సద్దుల బతుకమ్మకు ఏర్పాట్లు పూర్తికాగా, ఆడబిడ్డల ఆటపాటలతో వీధులన్నీ హోరెత్తనున్నాయి. పిల్లలు, పెద్దల సందడితో పల్లెలన్నీ పండుగ చేసుకోనున్నాయి. కాగా పూల కొనుగోలుదారులతో మార్కెట్లన్నీ శనివారం కళకళలాడాయి.
నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 21 : మహిళలకు అత్యంత ఇష్టమైన పెద్ద బతుకమ్మ సంబురాలు ఆదివారం హోరెత్తనున్నాయి. చిన్నాపెద్దా తేడాలేకుండా ఉత్సాహంగా జరుపుకొనే సద్దులకు ఊరూరా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎంగిలిపూల నుంచే పల్లెపట్టణం తేడా లేకుండా తీరొక్క పూలతో రోజూ చిన్నబతుకమ్మలను పేర్చి అందరొక్కచోట చేరి ఆడిపాడారు. కొత్తగా పెళ్లయి మెట్టినింటికి వెళ్లిన మహిళలంతా బతుకమ్మ పండగకు పుట్టినింటికి చేరుకుంటారు. మమతానురాగాల బతుకమ్మను పేర్చి సంతానం, పాడిపంటా చల్లంగుండాలని ఆడిపాడుతారు. ఏడాదికి సరిపడా ఆనందాన్ని మూటగట్టుకొని తిరిగి మెట్టింటికి వెళతారు. తమకు మంచి భర్త దొరకాలని కన్నె పిల్లలు బతుకమ్మను కొలుస్తారు. ముఖ్యంగా సద్దుల బతుకమ్మ రోజున మహిళల సందడి అంతా ఇంతా కాదు. పూలు సేకరించి, కట్టలు కట్టి, రంగులద్ది, బతుకమ్మను పేర్చి ఆడిపాడి చెరువులు, కాలువలు, నదుల్లో నిమజ్జనం చేస్తారు. ఆ తర్వాత వాయినాలు ఇచ్చిపుచ్చుకొని సత్తుపిండి పంచుకుంటూ బతుకమ్మ పాటలు నెమరేసుకుంటూ ఇళ్లకు చేరుకుంటారు.
సద్దుల బతుకమ్మ కోసం హనుమకొండలోని పద్మాక్షి గుట్ట, మెట్టుగుట్ట, వరంగల్లోని రంగలీల మైదానం, చిన్నవడ్డేపల్లి, జనగామలోని బతుకమ్మ కుంట, భూపాలపల్లిలోని అంబేద్కర్ స్టేడియం, హనుమాన్ టెంపుల్, ములుగులోని తోపుకుంట మినీ ట్యాంక్ బండ్, మహబూబాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియం, నిజాం చెరువు, బంధం చెరువు వద్ద ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆయా చోట్ల వేడుకలు అంబరాన్నంటనున్నాయి.
బతుకమ్మ కోసం తీరొక్క పువ్వులు, ఆకులు కొనుగోలు చేసేవారితో మార్కెట్లన్నీ శనివారం కిటకిటలాడాయి. పల్లెల నుంచి పలువురు రైతులు, కూలీలు గునుగు, తంగేడు, పట్టుకుచ్చులు ఇలా రకరకాల పూలను తెచ్చి విక్రయించారు. బతుకమ్మను పేర్చేందుకు శనివారం నుంచే ఆడబిడ్డలు గునుగు కట్టలను సిద్ధం చేసుకున్నారు.