వరంగల్, డిసెంబర్ 18(నమస్తేతెలంగాణ): అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఈ నెల 28 నుంచి రైతుబంధు సాయాన్ని అందజేయనున్నట్లు ప్రకటించింది. సంక్రాంతి పండుగలోగా రైతులందరి ఖాతాల్లో నిధులు జమ చేయనున్నట్లు వెల్లడించింది. వడ్డీ వ్యాపారుల నుంచి రైతులకు విముక్తి కల్పించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా పంట పెట్టుబడి కోసం ఏటా రెండు విడుతల్లో ఎకరానికి రూ. 10 వేల ఆర్థిక సాయం అందజేస్తున్నది. తొలివిడుత వానకాలం రూ. 5 వేలు, రెండో విడుత యాసంగి రూ. 5 వేల చొప్పున నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నది. రైతుబంధు పథకం నుంచి ఇప్పటికే తొమ్మిది విడుతల్లో రాష్ట్రంలోని అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో రూ. 58 వేల కోట్ల పంట పెట్టుబడి సాయాన్ని జమ చేసింది. పదో విడుత ప్రస్తుత యాసంగి సుమారు 65 లక్షల పైచిలుకు మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో దాదాపు రూ. 7,600 కోట్లు జమ చేయనుంది. దీంతో పది విడుతల్లో రైతుబంధు పథకం ద్వారా రైతులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అందజేసిన పంట పెట్టుబడి సాయం సుమారు రూ. 66 వేల కోట్లకు చేరనుంది.
ఈ పథకం ద్వారా జిల్లాలో ఏటా ప్రతి సీజన్లో సుమారు 1.46 లక్షల మంది రైతులు దాదాపు రూ. 136 కోట్లకు పైగా పంట పెట్టుబడి సాయం పొందుతున్నారు. గత వానకాలం వీరి ఖాతాల్లో ఈ ఏడాదికి సంబంధించి తొలి విడుత ఎకరానికి రూ. 5 వేల చొప్పున రైతుబంధు నిధులను జమ చేసింది. యాసంగి సాగుకు రైతులు సమాయత్తం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం రెండో విడుత ఎకరానికి మరో రూ. 5 వేల పంట పెట్టుబడి సాయాన్ని ఈ నెల 28 నుంచి వారి ఖాతాల్లో జమ చేసేందుకు నిర్ణయించింది. మొదట ఎకరం భూమి గల రైతుల నుంచి ప్రారంభించి సంక్రాంతి పండుగలోగా అందరి రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులను జమ చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఆదివారం ప్రకటించారు. రైతుబంధు, రైతుబీమా, సాగునీటి సౌకర్యం, వ్యవసాయానికి 24 గంటల కరెంటుతో తెలంగాణ రైతుల్లో ఆత్మైస్థెర్యం పెరిగిందని ఆయన తెలిపారు.
యాసంగి పంట పెట్టుబడి కోసం ఈ నెల 28 నుంచి తమ ఖాతాల్లో రైతుబంధు నిధులను జమ చేయనున్నట్లు మంత్రి నిరంజన్రెడ్డి ప్రకటించడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. ఆయన ప్రకటనపై రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. యాసంగి సాగుకు రైతులు నడుం కట్టిన తరుణంలో ప్రభుత్వం రాయితీపై వేరుశనగ విత్తనాల పంపిణీ చేపట్టింది. సబ్సిడీపై చిరుధాన్యాల విత్తనాలను రైతులకు అందజేయడానికి వ్యవసాయశాఖ ప్రణాళిక రూపొందించింది. దమ్ము చేసిన పొలంలో నేరుగా వరి విత్తనాలను విత్తే పద్ధతిపై అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ విధానంతో ఒక్కో ఎకరానికి రూ. 6 వేల వరకు లబ్ధి పొందవచ్చని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత యాసంగి వివిధ పంటల సాగుకు తాము సన్నద్ధమైన నేపథ్యంలో రైతుబంధు పథకం ద్వారా ఈ నెల 28 నుంచి పంట పెట్టుబడి సాయం అందజేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు సంబురపడుతున్నారు.