ములుగు, మార్చి 21 (నమస్తే తెలంగాణ) : ములుగు జిల్లా కేంద్రంలో టెన్త్ ఇంగ్లిష్ పేపర్ బయటికి వచ్చినట్లు పుకార్లు షికారు చేశాయి. ఈ విషయం పోలీసులకు చేరడంతో తీవ్ర కలకలం రేగింది. వివరాల్లోకి వెళ్తే.. ములుగులోని ఓ పరీక్ష కేంద్రం నుంచి జిల్లా కేంద్రంలోని సెయింట్ ఆంథోని అనే ప్రైవేట్ స్కూల్కు ఇంగ్లిష్ ప్రశ్నపత్రం చేరిందని ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకుడు కుమ్మరి సాగర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఎస్సై వెంకటేశ్వర్ హుటాహుటిన సంబంధిత పాఠశాలకు చేరుకొని తనిఖీలు చేయగా ప్రశ్న పత్రాలు లభించలేదు. సమాచారం ఇచ్చిన సాగర్ను అడుగగా అరవింద పాఠశాల కరస్పాండెంట్ అక్కల సతీశ్ తనకు చెప్పాడని తెలియజేయగా సాగర్తో కలిసి ఎస్సై అరవింద పాఠశాలకు వెళ్లి తనిఖీలు చేసి విషయంపై ఆరా తీశారు. కాగా, పోలీసుల విచారణలో పేపర్ బయటకు రాలేదని తేలడంతో సాగర్తో పాటు పాఠశాలల యాజమాన్యాలను ఎస్సై మందలించారు.
ఇలాంటి విషయాల్లో కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని హెచ్చరించారు. పేపర్ నిజంగానే బయటికి వస్తే తనకు గాని, పోలీస్ శాఖకు సమాచారం అందించాలని కోరారు. ఈ విషయమై విద్యాశాఖ అధికారులను వివరణ కోరగా నిబంధనల మేరకు పరీక్షలు జరుగుతున్నాయని, ప్రశ్న పత్రం బయటకు వెళ్లే సమస్య లేదన్నారు. ఇంగ్లిష్ ప్రశ్నపత్రం బయటకు వచ్చిందనడంలో వాస్తవం లేదని తేల్చిచెప్పారు. ప్రైవేటు పాఠశాల యాజమాన్యాల పోటీతత్వం కారణంగా ఈ వదంతులు వచ్చాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. కా గా, ఈ విషయంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పిల్లలు ప్రశాంతంగా పరీక్షలు రాస్తుంటే ఇలాంటి పుకార్లు ఏంటని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.