హనుమకొండ చౌరస్తా, జనవరి 27: ఆసియాఖండంలోనే అతిపెద్దదైన సమ్మక్క-సారలమ్మ మినీ మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతున్నది. ఈ మేరకు ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ ఆర్ఎం శ్రీలత శుక్రవారం వివరాలు వెల్లడించారు. ఈ బస్సులు హనుమకొండ బస్స్టేషన్ నుంచి ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు నడుపుతామని తెలిపారు. ప్రతి 45 నిమిషాలకో బస్సును ఏర్పాటు చేసినట్లు ఆమె చెప్పారు. భక్తుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడుపాలని నిర్ణయించినట్లు తెలిపారు.
భక్తులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరాలని శ్రీలత సూచించారు. హనుమకొండ నుంచి మేడారం వరకు పెద్దలకు రూ.160, పిల్లలకు రూ.90 ఛార్జి ఉంటుందని వెల్లడించారు.