వరంగల్ : నర్సంపేట నియోజకవర్గంలో 25 హెల్త్ సబ్ సెంటర్ల శాశ్వత భవన నిర్మాణం కోసం రూ.4 కోట్ల నిధులను తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంజూరు చేసింది. ఈ సందర్భంగా నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ..నియోజకవర్గంలోని అన్ని వర్గాల నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మరింత చేరువగా సర్కారు వైద్యం అందుతుందన్నారు. 90 శాతం హెల్త్ సబ్ సెంటర్లు అద్దె భవనంలో నడుస్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో కరోనా సమస్య తలెత్తినప్పుడు ఇంటి యజమానులు ANM సెంటర్లను ఖాళీ చేయాలని అనేక సందర్భాల్లో ఒత్తిడి చేసినట్లు ఆయన తెలిపారు.
ఇంత పెద్ద ఎత్తున 59 సబ్ సెంటర్లలో 19 ఇప్పటికే మంజూరు కావడం, నేడు మరో 25 సబ్ సెంటర్లు మొత్తం 44 సబ్ సెంటర్ల కోసం శాశ్వత భవనాలకు మంజూరు కావడం ఎంతో గర్వంగా ఉందన్నారు. సబ్ సెంటర్ల ఏర్పాటుకు సహకరించిన సీఎం కేసీఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, హెల్త్ కమిషనర్ వాకాటి కరుణకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.