డబుల్ ఇంజిన్ సర్కారు అని డబ్బా కొట్టుకుంటున్న కేంద్రంలోని బీజేపీ పనితీరుకు, గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా ముందుకు పోతున్న రాష్ట్రంలోని బీఆర్ఎస్ సర్కారు పనితీరుకు ఇవిగో మచ్చుకు కొన్ని ఉదాహరణలు.. కేంద్రంలో ఎనిమిదేళ్లుగా అధికారం వెలగబెడుతున్న బీజేపీ, ఇప్పటికీ జాతీయ ‘దారి’ద్య్రాన్ని రూపుమాపడం లేదు. కేంద్రం అలసత్వం మూలంగా ఉమ్మడి జిల్లాలోని ఎన్హెచ్లు ఇప్పటికీ ప్రమాదాలకు నెలవుగానే ఉన్నాయి.
జగిత్యాల-కరీంనగర్-హనుమకొండ-వరంగల్-మహబూబాబాద్ జిల్లా కేంద్రాల మీదుగా ఖమ్మం వరకు ఉన్న ఎన్హెచ్ 563 పరిస్థితి ఆదినుంచీ ఆధ్వానంగా ఉండగా, హైదరాబాద్, జనగామ, హనుమకొండ- వరంగల్ మీదుగా ములుగు జిల్లా దాటి ఆవలి రాష్ట్రం వెళ్లే ఎన్హెచ్ 163 పనులు కొన్నిచోట్ల ఇంకా నత్తకు నడక నేర్పుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఈ దారుల్లో ప్రయాణమంటేనే ప్రాణాలు అరచేత పెట్టుకొని వెళ్లాల్సిందే..
వరంగల్, మార్చి 29(నమస్తే తెలంగాణ) : మెరుగైన రవాణా వ్యవస్థతోనే గ్రామాల సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందన్న స్ఫూర్తితో రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎనలేని కృషి చేసింది. ఎనిమిదేళ్లలో వేల కోట్ల నిధులు వెచ్చించి ఉమ్మడి రాష్ట్రంలో పల్లెలకు పట్టిన ‘దారి’ద్య్రాన్ని తొలగించింది. ఏళ్ల తరబడి గతుకులు, అతుకుల దారులతో అష్టకష్టాలు పడిన గ్రామాల ప్రగతికి ‘బాటలు’ వేసింది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలో పంచాయతీ రాజ్, ఆర్అండ్బీ శాఖల ద్వారా గ్రామీణ రోడ్లకు మహర్దశ తెచ్చింది. రోడ్లకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వెంటనే మరమ్మతులు చేసేలా పర్యవేక్షిస్తున్నది.
అత్యవసర వైద్య సేవలు వేగంగా అందే పరిస్థితి వచ్చింది. చదువులు, ఉపాధి కోసం సమీప పట్టణాలు, నగరాలకు వెళ్లి వచ్చే వసతులు కలిగాయి. వరంగల్ రూరల్, జనగామ జిల్లాల నుంచి రోజూ వందల మంది ఉపాధి కోసం వరంగల్ నగరానికి వచ్చి వెళ్తున్నారు. ఆయా గ్రామాలను సమీప మండల కేంద్రాలకు అనుసంధానిస్తూ కొత్త రోడ్లు వేయడం వల్లే ఇలాంటి కొత్త అవకాశాలను పల్లె వాసులు అందుకుంటున్నారు. తెలంగాణలో సాగు విస్తీర్ణం బాగా పెరిగిన నేపథ్యంలో రైతులకు ఎప్పటికప్పుడు అవసరమైన పెట్టుబడి సరుకులను తెచ్చుకోవడం, అమ్మిన సరుకులు వేగంగా పట్టణాలకు చేర్చేందుకు మెరుగైన రవాణా వసతులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
దశాబ్దాలుగా ‘దారి’ద్య్రం
జనగామ-దుద్దెడ ఎన్హెచ్-365బీ విస్తరణకు ఇప్పటికీ మోక్షం కలుగలేదు. 46 కి.మీ రోడ్డు పనులకు రూ.450కోట్లు కేటాయించిన కేంద్రం, రెండు దశాబ్దాలైనా పనులు మొదలుపెట్టలేదు. చేర్యాల, బచ్చన్నపేట మార్గాల్లో చెట్ల తొలగింపు, సైడ్బర్మ్ల మరమ్మతులు కూడా ముందుకుసాగడం లేదు. ఇదివరకు గుంతలతో ఉన్న రోడ్డును ఇరువైపులా తవ్వడంతో జనగామ-సిద్దిపేట మార్గంలో వాహనదారులకు మరిన్ని ఇబ్బందులు వచ్చిపడ్డాయి. గతంలో ఆర్అండ్బీ నిర్వహణలో ఉన్నప్పుడు ప్రయాణం సాఫీగా సాగగా.. కేంద్రం ఆధీనంలోకి వెళ్లడంతో ‘దారి’ద్య్రం పట్టుకుంది. అలాగే పెంబర్తి జంక్షన్ సమీప రైల్వేట్రాక్ వెనుక నుంచి శామీర్పేట శివారు వరకు బైపాస్ నిర్మాణం పూర్తికాలేదు. సకాలంలో నిధులు విడుదల కాకపోవడంతో భూసేకరణ ఆలస్యమవుతోంది. ఇదిలా ఉంటే నెల్లుట్ల-పాలకుర్తి మార్గంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన రహదారిపై రాకపోకలు సాఫీగా సాగుతున్నాయి.
కొనసా..గుతున్న ‘స్మార్ట్’.. స్టేట్ సూపర్ ఫాస్ట్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుకు, తెలంగాణపై కేంద్రం చూపుతున్న వివక్షకు స్మార్ట్సిటీ పనులు అద్దం పడుతున్నాయి. వరంగల్ మహానగరాన్ని కేంద్రం ఏడేళ్ల క్రితం స్మార్ట్సిటీగా ప్రకటించింది. అరకొర నిధులు విడుదల చేస్తూ నత్తకు నడక నేర్పేలా పనులు చేయిస్తున్నది. రెండు విడుతల్లో సుమారు రూ.1500 కోట్ల అంచనాలతో పనుల ప్రణాళికలు వేసి కేవలం రూ.240కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఐదేళ్ల కిత్రం చేపట్టిన పనులను కూడా ఇంకా పూర్తి చేయకుండా చోద్యం చూస్తున్నది. హనుమకొండ చౌరస్తా నుంచి హంటర్రోడ్లోని శాయంపేట జంక్షన్ వరకు చేపట్టిన స్మార్ట్ రోడ్డు పనులు ఐదేళ్లు గడిచినా పూర్తికాలేదు. కానీ, నగర అభివృద్ధిపై దృష్టి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం పనులు వెనువెంటనే పూర్తి చేస్తున్నది. హనుమకొండ సర్క్యూట్ గెస్ట్ హౌస్.. కలెక్టర్ బంగ్లా నుంచి అంబేద్కర్ జంక్షన్ వరకు కేవలం నెల రోజుల్లోనే రూ.1.75కోట్లతో పూర్తిచేసింది. ఇది మచ్చుకు ఒక్క ఉదాహరణ మాత్రమే
– వరంగల్, మార్చి 29
భూపాలపల్లిలో కుంగిన ఎన్హెచ్ 353సీ.. మెరుస్తున్న ఎస్హెచ్
మహదేవ్పూర్ నుంచి భూపాలపల్లి వరకు ఉన్న 33 కి.మీ. జాతీయ రహదారి(ఎన్హెచ్ 353సీ) అస్తవ్యస్తంగా ఉంది. ఈ రోడ్డు వెడల్పును 7 నుంచి 10 మీటర్లకు పెంచి రూ.154కోట్లతో వేసినప్పటికీ కిలోమీటర్ల కొద్దీ కుంగిపోయింది. అలాగే భూపాలపల్లి నుంచి చెల్పూర్ వరకు రోడ్డు అధ్వానంగా ఉండగా మోరంచపల్లి-భూపాలపల్లి మార్గంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటోంది. ఇందుకోసం బైపాస్ రోడ్డు వేయాలని ఎమ్మెల్యే గండ్ర సహా బీఆర్ఎస్ ఎంపీలు ఎన్నోమార్లు కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేసినా కేవలం 8 కి.మీ. పనులకే నిధులిచ్చి చేతులు దులుపుకొన్నారు. ఆ పనులు కూడా నత్తనడకన సాగుతుండగా ఇదే జాతీయరహదారిపై కాటారం మండలం మేడిపల్లి వద్ద నిర్మించిన టోల్ప్లాజాను ప్రారంభించకపోవడం వల్ల ఇరుకురోడ్డుతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. కాగా భూపాలపల్లి మండలం కమలాపూర్ క్రాస్రోడ్డు నుంచి గొల్లబుద్దారం వరకు 15 కి.మీ, కాటారం నుంచి మహాముత్తారం మండలం యామన్పల్లి మీదుగా రాష్ట్ర ప్రభుత్వం వేసిన 21 కి.మీ.ల రోడ్లు అద్దంలా మెరిసిపోతున్నాయి.
– జయశంకర్ భూపాలపల్లి, మార్చి 29 (నమస్తే తెలంగాణ)
ఎన్హెచ్ అధ్వానం.. ‘ఆర్డబ్ల్యూఎస్’, ‘పీఆర్’ సూపర్
వరంగల్ జిల్లాలో ఎన్హెచ్ 365 అధ్వానంగా తయారైంది. అదే రాష్ట్ర ప్రభుత్వం వేసిన రోడ్లు అద్దాల్లా మెరుస్తున్నాయి. 2013-14లో ఎన్హెచ్ 365ని వేయాలని నిర్ణయించి, మహారాష్ట్రలోని సిరోంచ నుంచి జిల్లా మీదుగా మహబూబాబాద్ వైపు వెళ్లే ఈ జాతీయ రహదారి పనులు ఇప్పటికీ కొన్ని చోట్ల ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన మారాయి. చాలా చోట్ల అసంపూర్తిగానే మిగిలి ప్రయాణికులను వెక్కిరిస్తున్నాయి. కొన్నిచోట్ల అసలు మొదలే కాలేదు. పర్యవేక్షించేవారు లేక వాహనదారులు నిత్యం నరకం చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆర్డబ్ల్యూఎస్, పీఆర్ రోడ్లకు నిధులు కేటాయించి పనులు వేగంగా పూర్తి చేయించింది. దీంతో డబుల్ రోడ్లు అందుబాటులోకి వచ్చి పల్లెలు కళకళలాడుతున్నాయి. ఎక్కడా ఇబ్బందులు లేకుండా వాహనదారులు సాఫీగా ప్రయాణిస్తున్నారు. లింకురోడ్లు కూడా బాగవడంతో ఆయా గ్రామాలకు రవాణా ఇక్కట్లు తొలగిపోయాయి.
– నర్సంపేట, మార్చి 29
కంకరతో ఎన్హెచ్ కటకట.. రయ్య్న్ర రాష్ట్ర రహదారి
ఇక్కడ ఓ వైపు తారు, మరోవైపు దుమ్ము, కంకరతో కనిపిస్తున్నది జాతీయ రహదారే. వరంగల్ జిల్లా ఖానాపురం నుంచి మహబూబాబాద్ మండలం కంబాలపల్లి వరకు 30 కిలోమీటర్ల రోడ్డు పనులను కేంద్ర ప్రభుత్వం రూ.120కోట్ల వ్యయంతో మొదలుపెట్టింది. అయితే ఐదేళ్లు గడుస్తున్నా పనులు మాత్రం పూర్తికాలేదు. కొన్నిచోట్ల కంకర తేలితే, మరికొన్ని ప్రాంతాల్లో అడుగుకొకటి చొప్పున ఉన్న గుంత వాహనదారులకు పరీక్ష పెడుతోంది. ముఖ్యంగా గూడూరు మండలం బుధరావుపేట నుంచి యాపచెట్టు తండా వరకున్న కిలోమీటర్ మేర అస్తవ్యస్తంగా ఉన్న రోడ్డు నరకం చూపిస్తున్నది. దీంతో వాహనాలు పాడవడమే గాక ఒళ్లు హూనవుతోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకేంద్రంలోని మూడుకొట్ల నుంచి కేసముద్రం వరకు రూ.21కోట్లతో వేసిన 15కిలోమీటర్లు రోడ్డు మూడేళ్ల క్రితమే పూర్తికాగా ప్రయాణికులు రయ్య్మ్రని దూసుకుపోతున్నారు.
– మహబూబాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ)