నర్సంపేట రూరల్, జూన్ 5 : రైస్ మిలర్లు రైతులకు సహకరించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ పీ ప్రావీణ్య సూచించారు. సోమవారం నర్సంపేట మండలం రాజుపేటలోని హరి, హేమాత రైస్ మిల్లులను కలెక్టర్ తనిఖీ చేశారు. అక్కడ ఉన్న రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం దిగుమతి వివరాలు, తూకాన్ని పరిశీలించారు. ధాన్యానికి సంబంధించిన రికార్డులు, ట్రక్ షీట్స్ను పరిశీలించారు. వే బిల్లులు పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వచ్చిన ధాన్యాన్ని మిల్లర్లు ఆలస్యం చేయకుండా త్వరగా దింపుకోవాలన్నారు. నిల్వ సామర్థ్యం సరిపోకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ధాన్యంతో వచ్చిన వాహనాలు రైసు మిల్లుల వద్ద ఎక్కువ సేపు ఉండకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. ధాన్యం తూకంలో మోసాలకు పాల్పడవద్దని, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని కోరారు. కార్యక్రమంలో సివిల్ సప్లయ్, రెవెన్యూ అధికారులు, మిల్లర్లు పాల్గొన్నారు.
జాప్యం కాకుండా ధాన్యాన్ని తరలించాలి
గీసుగొండ : కొనుగోలు కేంద్రాల్లో ఉన్న మక్కజొన్న, వరి ధాన్యాన్ని వెంటనే తరలించాలని కలెక్టర్ ప్రావీణ్య నిర్వాహకులకు సూచించారు. సోమవారం మండలంలోని ఊకల్ రైతు సహకార సంఘ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అమె పరిశీలించి రైతులతో మాట్లాడారు కాంటాలు పూర్తయిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచకూడదన్నారు. వెంటనే గోదాం, రైస్ మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ విశ్వనారాయణ, సొసైటీ ఎండీ దామోదర్రెడ్డి, ఆర్ఐ సాంబయ్య, రైతులు పాల్గొన్నారు.