తాడ్వాయి, జనవరి 23 : మేడారంలో అభివృద్ధి పనులను ఎందుకింత కాలయాపన చేస్తున్నారని గిరిజన సంక్షేమ శాఖ సెక్రటరీ శరత్ అధికారులపై మండిపడ్డారు. పనుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన నెలాఖరు వరకు పూర్తి చేస్తారా అని అధికారులను ప్రశ్నించారు. మంగళవారం ఆ శాఖ డైరెక్టర్ వెంకట నర్సింహారెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి జాతర పరిసరాల్లో ఆయన పర్యటించారు. మొదట కలెక్టర్ త్రిపాఠి, పీవో అంకిత్, ఎస్పీ శబరీష్తో కలిసి అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం సమ్మక్క భవన్లో వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన పనులతో పాటు, పురోగతిని శాఖల వారీగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం శరత్ మాట్లాడుతూ పనులు నెల రోజుల ముందు ప్రారంభించినా నేటికీ కొన్ని 60శాతం, మరికొన్ని 30శాతం వరకు మాత్రమే చేశారు, మిగిలిన పనులు వారం రోజుల్లో ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించగా పలు శాఖల అధికారులు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. పనుల్లో వేగం పెంచి పూర్తి చేయాల్సింది పోయి కాలయాపన ఎందుకు చేస్తున్నారని మండిపడ్డారు. హడావుడిగా పనులు చేస్తే కుదరదని, ప్రతి పనిలో నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సిందేనని హెచ్చరించారు. ముందస్తు మొక్కుల కోసం భక్తులు భారీగా వస్తున్నారని, ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలు వారికి ఉపయోగపడేలా ఉండాలన్నారు.
నిరంతరం పారిశుధ్య పనులు చేపట్టడంతో పాటు తాగునీటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పార్కింగ్ స్థలాల్లో ఇబ్బందులు తలెత్తకుండా సైన్ బోర్డులు, మరుగుదొడ్లు, ఫ్లడ్లైట్లు తదితర చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి పనిలో నాణ్యాతా ప్రమాణాలు పాటించాలని, స్టాళ్ల వద్ద డస్ట్బిన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. పనుల్లో వేగం పెంచి జాతరను విజయవంతం చేయాలని సూచించారు. వీఐపీ, వీవీఐపీ పార్కింగ్కు రోడ్డు చదును చేసి ఒక్కో పార్కింగ్లో ఎన్ని వాహనాలు పార్క్ చేయవచ్చో వివరాలు ప్రదర్శించాలన్నారు. జంపన్నవాగులో లోతు ప్రదేశాలను గుర్తించి ఇసుక లెవలింగ్ పనులు పూర్తి చేయాలన్నారు. అంతరాయం లేని విద్యుత్ సరఫరా, అత్యవసర వైద్యం కోసం మినీ అంబులెన్సులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. డైరెక్టర్ వెంకటనర్సింహారెడ్డి మాట్లాడుతూ కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలన్నారు. బారికేడ్ల ఏర్పాటులో పోలీస్ శాఖ సమన్వయంతో పని చేయడంతో పాటు, భక్తులకు సౌకర్యాలు తెలిసేలా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు శ్రీజ, వేణుగోపాల్, డీఎఫ్వో రాహుల్ కిషన్ జాదవ్, ఓఎస్డీ అశోక్కుమార్, వివిద శాఖల ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.