స్టేషన్ఘన్పూర్, జూన్ 10 :ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయలేని సీఎం రేవంత్రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య విమర్శించారు. ఇందుకు తగ్గట్టుగానే డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క బీఆర్ఎస్ హయాంలో మంజూరైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారని తెలిపారు. బుధవారం డివిజన్ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజయ్య మాట్లాడారు. చిల్పూరు మండలం పల్లగుట్టలో మంగళవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్వహించిన కార్యక్రమం చూస్తుంటే కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుందని ఎద్దేవా చేశారు. పీచర, కొండాపూర్, కుర్చపల్లి, సాగరం గ్రామాల్లో ఏర్పాటు చేసిన సబ్స్టేషన్లు బీఆర్ఎస్ పాలనలో మంజూరయ్యాయని వివరించారు.
పీచర సబ్స్టేషన్ ఎప్పుడో ప్రారంభమైందన్నారు. తెలంగాణలో 95 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉండగా, 65 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, 72 లక్షల మెట్రిక్ టన్నులని డిప్యూటీ సీఎం భట్టి, 75 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నామని సీఎం రేవంత్రెడ్డి పొంతనలేకుండా చెబుతున్నారని రాజయ్య విమర్శించారు. నియోజకవర్గంలో 28 కిలోమీటర్లు పాదయాత్ర చేశానని, ఇక్కడి సమస్యలు తెలుసని చెబుతున్న భట్టికి గాడిద గుడ్డంత కూడా తెలియవని రాజయ్య ఎద్దేవా చేశారు. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని చేతిలో రాజ్యాంగం పుస్తకం పట్టుకుని రాహుల్గాంధీ తిరుగుతుంటే కాంగ్రెస్వి ఊసరవెల్లి రాజకీయాలని తెలుస్తుందన్నారు.
టీటీపీ, బీఆర్ఎస్ పాలనలో మంత్రిగా ఉండి అభివృద్ధి పనులు చేయని నీవు ఇప్పుడు ఎలా అభివృద్ధి చేస్తావని ఎమ్మెల్యే కడియం శ్రీహరిని మాజీ ఎమ్మెల్యే రాజయ్య ప్రశ్నించారు. అప్పటి డిప్యూటీ సీఎం కడియం, నేటి డిప్యూటీ సీఎం భట్టి ఇద్దరు దొందుదొందేనని, వీరిద్దరూ తెలంగాణకు ఒరగబెట్టింది ఏమీ లేదని అన్నారు. పార్టీ ఫిరాయింపునకు పాల్పడలేదని, నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్తో కలిసి పని చేస్తున్నానని పదేపదే చెబుతున్న కడియం శ్రీహరి మంగళవారం జరిగిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సాక్షిగా, అధికారిక సభలో జై కాంగ్రెస్ అని పెద్ద ఎత్తున నినాదాలు చేయడమే కాకుండా సభకు వచ్చిన వారిని కూడా నినాదాలు చేయమంటే స్పందన రాలేదని రాజయ్య అన్నారు. బీఆర్ఎస్ పాలనలోనే ప్రతి గ్రామంలో ప్రజలకు మౌలిక వసతులు కల్పించామని గుర్తు చేశారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు నెరవేర్చే వరకు కాంగ్రెస్ సర్కారు వెంట పడుతామని ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో కౌన్సిలర్ తాటికొండ మధు, బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు మాచర్ల గణేశ్, నాయకులు పాల్గొన్నారు.