కాలనీల్లో వసతులు కల్పించాలన్న నగరవాసులు
ఏఈ కృష్ణమూర్తిపై చర్యలు తీసుకోవాలని ఆందోళన
దరఖాస్తులు స్వీకరించిన గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్య
వరంగల్, మే 30 : బల్దియా గ్రీవెన్స్లో సమస్యలు వెల్లువెత్తాయి. కాలనీల్లో కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు కమిషనర్ ప్రావీణ్యకు విన్నవించారు. సోమవారం కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో నిర్వహించిన గ్రీవెన్స్లో కమిషనర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. భవన నిర్మాణ అనుమతుల మంజూరులో జాప్యం, అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోకపోవడం, రోడ్డు ఆక్రమణలపై పలు కాలనీల ప్రజలు కమిషనర్కు ఫిర్యాదు చేశారు. గ్రీవెన్స్లో వచ్చిన వినతుల్లో సగానికి పైగా టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించినవే ఉండడం గమనార్హం. సాయిగణేశ్ కాలనీ ముంపు నివారణకు శాశ్వత పరిష్కారం చూపాలని కాలనీ వాసులు కమిషనర్ను కలిసి వినతిపత్రం అందజేశారు.
గాంధీనగర్, క్రిస్టియన్ కాలనీ, సొసైటీ కాలనీ నుంచి వచ్చే వరద నీటిని ఈ కాలనీకి మళ్లించేందుకు చేస్తున్న కల్వర్లు నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరారు. ఏఈ కృష్ణమూర్తిపై చర్యలు తీసుకోవాలని 14 డివిజన్ సాయిగణేశ్ కాలనీ ప్రజలు కమిషనర్కు ఫిర్యాదు చేశారు. 2017-18 సంవత్సరంలో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణం కోసం టెండర్ పొందిన కాంట్రాక్టర్ దండు సంజీవ కొంత పని చేసి వదిలి వేశాడు. ఐదేళ్లుగా పనులు చేయడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ఏఈని అడిగితే బెదిరిస్తున్నారని కాలనీ వాసులు తెలిపారు. గ్రీవెన్స్లో మొత్తంగా 84 వినతులు వచ్చాయి. టౌన్ప్లానింగ్ విభాగానికి 53, ఇంజినీరింగ్ విభాగానికి 21, ప్రజారోగ్యం 5, పన్నుల విభాగానికి 5 వినతులు వచ్చాయి. అదనపు కమిషనర్ అనీసుర్ రషీద్, ఎస్ఈ ప్రవీణ్ చంద్ర, సిటీ ప్లానర్ వెంకన్న, డీఎఫ్వో కిశోర్, డిప్యూటీ కమిషనర్ జోనా, హార్టికల్చర్ అధికారి ప్రిసిల్లా, అధికారులు పాల్గొన్నారు.