వేలేరు: వరంగల్ జిల్లా వేలేరు మండలంలోని రైతులకు సాగునీరు ( Irrigation Water ) అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ( BRS ) మండల నాయకులు, రైతులు స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ( MLA Kadiyam Srihari ) కి శనివారం వినతిపత్రం అందజేశారు. మండలంలోని సాగు భూములకు గోదావరి జలాలు అందేలా పెండింగ్లో ఉన్న సాగునీటి పనులను వేగవంతం చేయాలని కోరారు.
వర్షాలపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతులు సాగునీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నారని, శాశ్వత పరిష్కారం కోసం ఎత్తిపోతల పథకాలు, పైప్లైన్, కాలువల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. వేలేరు మండలానికి గండి రామారం ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలు అందించి రెండు పంటలకు సాగునీరు కల్పిస్తామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇచ్చిన హామీని గుర్తు చేశారు.
రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం, నీటిపారుదల శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు నర్సింహారావు, సర్పంచ్ మరిజె అనిత, నాయకులు విజేందర్ రెడ్డి, జానీ, హరీఫ్ పాల్గొన్నారు.