Kakatiya University |కాకతీయ యూనివర్సిటీ కొత్త హంగులు అద్దుకుంటోంది. పూర్వవైభవాన్ని సంతరించుకునేలా విశ్వవిద్యాలయంలో రూ.8కోట్లతో పునర్నిర్మాణ ప్రక్రియ మొదలైంది. న్యాక్ బృందం త్వరలో సందర్శించనున్న నేపథ్యంలో అధికార బృందం అన్ని విధాలా సమాయత్తం అవుతున్నది. ఈమేరకు కేయూలోని వివిధ విభాగాల భవనాలను ముస్తాబు చేస్తున్నది.
– హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 12
హనుమకొండ జిల్లాలో ఉన్న ఈ ప్రభుత్వ విశ్వవిద్యాలయం 12 సెప్టెంబర్ 2017న నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి ‘ఏ’ గ్రేడ్తో గుర్తింపు పొందింది. యూనివర్సిటీ కళలు, సైన్స్, కామర్స్, బిజినెస్ మేనేజ్మెంట్, సోషల్ ఫ్యాకల్టీల్లో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిల్లో సుమారు 120 ప్రోగ్రామ్లను అందిస్తోంది. శాస్ర్తాలు, విద్య, ఇంజినీరింగ్, ఫార్మాస్యూటికల్ సైన్సెస్తో కూడిన రాజ్యాంగ, అనుబంధ కళాశాలలు తెలంగాణలోని 12 జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. కాకతీయ విశ్వవిద్యాలయంలో పర్మినెంట్, కాంట్రాక్ట్, పార్ట్టైం ఉద్యోగులు మొత్తం 273 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. యూనివర్సిటీలో 28 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. కాకతీయ విశ్వవిద్యాలయంలో ఫలహారశాల, వసతిగృహం, ప్రయోగశాలలు, గ్రంథాలయం, వైద్య, క్రీడామైదానం ఏర్పాటు చేశారు.
రెండో అతి పెద్ద రాష్ట్ర వర్సిటీ..
కాతీయ విశ్వవిద్యాలయం ఉత్తర తెలంగాణలో రెండో అతి పెద్ద వర్సిటీ. వివిధ రాష్ర్టాల నుంచి విద్యార్థులు వర్సిటీలో ప్రవేశం పొందుతారు. ఈ విశ్వవిద్యాలయంలో సుమారు 120 విభాగాల్లో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో శిక్షణ అందిస్తున్నారు. దీని పరిధిలోకి మూడు ఉమ్మడి జిల్లాలు (వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్) వస్తాయి. ఇందులో అభ్యసించే వారితో కలిపి మొత్తం 2.23 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఐదు ఇంజినీరింగ్ కళాశాలలు, 24 ఫార్మసీ కళాశాలలు వర్సిటీ పరిధిలో ఉన్నాయి. కాకతీయ విశ్వవిద్యాలయంలో సుమారు 5 వేలకుపైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.
1976లో స్థాపన
కాకతీయ విశ్వవిద్యాలయాన్ని 1976లో స్థాపించారు. 650 ఎకరాల విస్తీర్ణంలో విశ్వవిద్యాలయం ఉంది. కేయూ క్యాంపస్లో పచ్చని అందమైన ఉద్యానవనం ఉంది. కాకతీయ విశ్వవిద్యాలయం దూరవిద్యను కూడా అందిస్తుంది. దూరవిద్యా కోర్సులో ప్రవేశానికి అభ్యర్థి ఏ రకమైన ప్రవేశ పరీక్షను క్లియర్ చేయనవసరంలేదు. యూనివర్సిటీలో సెంట్రల్ లైబ్రరీ కూడా ఉంది. యూనివర్సిటీలో 150 కంటే ఎక్కువ కంప్యూటర్లు అందుబాటులో ఉన్న సెంటర్ ఉంది. విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ఉపయోగం కోసం బ్యాంకు, పోస్టాఫీస్ను కూడా అందుబాటులో ఉంచారు.
ప్లేస్మెంట్..
యూనివర్సిటీలో ప్లేస్మెంట్, ట్రైనింగ్ సెల్ ఏర్పాటు చేశారు. 2002లో విద్యార్థులకు మార్గనిర్దేశం చేయడంతో పాటు వివిధ కెరీర్, పోటీ అవకాశాలను సులభతరం చేసేందుకు వీటిని ప్రారంభించారు. తద్వారా ప్రతి సంవత్సరం కంపెనీలను ప్లేస్మెంట్, ఇంటర్న్షిప్ కోసం ఆహ్వానిస్తోంది. యూనివర్సిటీ ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలను ప్లేస్మెంట్ కోసం ఆహ్వానిస్తోంది. కంపెనీలు విద్యార్థులకు మంచి ప్యాకేజీ అందిస్తాయి.
అన్ని సదుపాయాలు సమకూర్చాం..
కాకతీయ విశ్వవిద్యాలయంలో రూ.8 కోట్లతో పునర్నిర్మాణ పనులు పూర్తికావస్తున్నాయి. అన్ని విభాగాల భవనాలకు రంగులు, కావాల్సిన మౌలిక సదుపాయాలను సమకూర్చాం. 2017లో న్యాక్ ‘ఏ’ గ్రేడ్ గుర్తింపు పొందింది. విశ్వవిద్యాలయం న్యాక్ బృందం పర్యటనకు సమాయత్తం అవుతున్నది. ఈ నెల 20 తర్వాత తేదీలు ఖరారు అవుతాయి.
– డాక్టర్ తాటికొండ రమేశ్, కేయూ వీసీ
రూ.8 కోట్లతో పనులు..
న్యాక్ బృందం పర్యటనలో భాగంగా కాకతీయ విశ్వవిద్యాలయానికి మెరుగులు దిద్దుతున్నారు. రూ.8 కోట్లతో పునర్నిర్మాణం పనులు చేపట్టారు. విశ్వవిద్యాలయంలోని వివిధ విభాగాల భవనాలకు రంగులు, కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను సమకూర్చుతున్నారు. వర్సిటీలోని ప్రతి విభాగాన్ని అందంగా ముస్తాబు చేస్తున్నారు. భవనాలకు కొత్తరూపు తీసుకొచ్చారు. ఈ నెల 20వ తేదీ తర్వాత న్యాక్ బృందం వర్సిటీని సందర్శించనున్నట్లు కేయూ అధికారులు చెబుతున్నారు.
రిహార్సల్స్ పూర్తి..
న్యాక్ బృందం కేయూలో పర్యటించేందుకు వర్సిటీ అధికారులు సమాయత్తం అవుతున్నారు. అన్ని విభాగాల్లో ముందుగానే రిహార్స ల్స్ పూర్తి చేస్తున్నారు. ప్రతి విభాగానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలియజేసేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నారు. అన్ని విభాగాలను అందంగా ము స్తాబు చేస్తున్నారు. విద్యార్థులు, ఫ్యాకల్టీ, ఫ్యూచర్ ప్లాన్స్తో రెడీ అవుతున్నారు.