వరంగల్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) డెలివరీ చేయని డిఫాల్టర్లపై ప్రభుత్వం కొరడా ఝలిపిస్తోంది. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లాలో నాలుగు రైస్ మిల్లులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఇప్పటికే ఒక రైస్ మిల్లు యజమానిపై అధికారులు కేసు నమోదు చేశారు. 2022-23 వానకాలం సీజన్లో ప్రభుత్వం పౌర సరఫరాల సంస్థ ద్వారా రైతుల నుంచి 1,79,922 టన్నుల ధాన్యా న్ని కొనుగోలు చేసింది. దీన్ని సీఎంఆర్ డెలివరీ కోసం జిల్లాలోని రైస్ మిల్లర్లకు తరలించింది.
రైస్ మిల్లర్లు ప్రభుత్వం తమకు కేటాయించిన ధాన్యాన్ని నూర్పిడి చేసి సీఎంఆర్ కింద ఎఫ్సీఐ, సీఎస్సీకి డెలివరీ చేయాల్సి ఉంది. 1,21,017 టన్నుల బియ్యా న్ని ప్రభుత్వానికి డెలివరీ చేయాల్సి ఉండగా, రైస్ మిల్లర్లు 1,18,446 టన్నుల బియ్యాన్ని మాత్రమే డెలివరీ చేశారు. అంటే 98 శాతం సీఎంఆర్ డెలివరీ జరిగినట్లు పౌర సరఫరాల సంస్థ అధికారులు వెల్లడించారు. జిల్లాలోని నాలుగు రైస్ మిల్లుల యజమానులు పూర్తిగా 2022-23 వానకాలం తాము ప్రభు త్వం నుంచి పొందిన ధాన్యానికి సంబంధించిన సీఎంఆర్ను డెలివరీ చేయలేదు. ఈ నాలుగింటిలో సంగెం మండలం పల్లారిగూడలోని శ్రీమహాలక్ష్మి బిన్ని రైస్మిల్, నర్సంపేటలోని శ్రీ వీరభద్ర మోడ్రన్ రైస్మిల్, గీసుగొండ మండలం గొర్రెకుంటలోని జయ ఇండస్ట్రీస్, చెన్నారావుపేట మండలంలోని అక్కల్చెడ వద్ద ఉన్న లక్ష్మీగణపతి రైస్ మిల్లులు ఉన్నట్లు సివిల్ సప్లయ్ జిల్లా మేనేజర్ సంధ్యారాణి వెల్లడించారు.
ఈ నాలుగు రైస్ మిల్లుల యజమాను లు రూ.12.38 కోట్ల విలువ చేసే 2,547 టన్నుల సీఎంఆర్ బకాయిలు ఉన్నట్లు ఆమె తెలిపారు. మహాలక్ష్మి బిన్ని రైస్మిల్ రూ.2.35 కోట్లు, శ్రీ వీరభద్ర రైస్ మిల్ (పాత ముగ్దుంపురం) రూ.3.50 కోట్లు, జయ ఇండస్ట్రీస్ రైస్ మిల్ రూ.2.13 కోట్లు, లక్ష్మీగణపతి రైస్మిల్ రూ.4.40 కోట్ల విలువ చేసే సీఎంఆర్ను డెలివరీ చేయాల్సి ఉందని ప్రకటించా రు. వీటిలో మహాలక్ష్మి బిన్ని రైస్మిల్ 722, శ్రీవీరభద్ర రైస్మిల్ 1,073, జయ ఇండస్ట్రీస్ 654, లక్ష్మీగణపతి రైస్మిల్ 1,351 టన్నుల ధాన్యానికి సంబంధించి సీఎంఆర్ బకాయి ఉన్నట్లు సంధ్యారాణి వెల్లడించారు.
ఈ నాలుగు మిల్లులకు 2022-23 వానకాలం మొత్తం 5,094 టన్నులు, యా సంగిలో 1,272 టన్నుల ధాన్యాన్ని కేటాయించినట్లు ఆమె తెలిపారు. సీఎంఆర్ డెలివరీ చేయని ఈ రైస్మిల్లుల డిఫాల్టర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు జిల్లా మేనేజర్ పేర్కొన్నారు. ఇప్పటివరకు శ్రీమహాలక్ష్మి బిన్ని రైస్మిల్ యజమానిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. త్వరలో వీరభద్ర మోడ్రన్ రైస్మిల్ యజమానిపై కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు. జయ ఇండస్ట్రీస్, లక్ష్మీగణపతి రైస్మిల్లులపై కేసు నమోదు చేసే ప్రక్రియ జరుగుతున్నట్లు ఆమె చెప్పారు.