సుబేదారి, జనవరి 3 : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొందరు పోలీస్ అధికారులు నెరుపుతున్న అనైతిక వ్యవహారాలు ఆ శాఖకే మాయని మచ్చ తెస్తున్నాయి. తాజాగా ఓ మహిళా ఎస్ఐ, సీఐ మధ్య ఉన్న అనైతిక బంధం వెలుగులోకి రాగా, ఆ శాఖలో కలకలం రేపింది. ఈస్ట్జోన్లో పనిచేస్తున్న మహిళా ఎస్ఐ, ఇదే జోన్లో పనిచేస్తున్న ఓ సీఐ మధ్య చనువు ఉండడంతో సదరు మహిళా ఎస్ఐ భర్త గమనించి మూడు రోజుల క్రితం పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశాడు. పోలీస్ అధికారులు విచారణ జరుపగా మహిళా ఎస్ఐ, సీఐ మధ్య ఉన్న ఆ బంధం నిజమేనని తేలినట్లు విశ్వనీయ సమాచారం. కాగా కొద్ది నెలల క్రితమే వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఓ మహిళా సీఐ తన నివాసంలో మరో సీఐతో ఉండడాన్ని గమనించిన ఆమె భర్త (ఆయన కూడా సీఐ) సుబేదారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
ఈ కేసులో సీఐ బీ రవిపై సస్పెన్షన్ వేటు పడింది. భార్యాభర్తలైన సీఐలపైనా కేసులు నమోదయ్యాయి. ఈ మధ్యకాలంలో కమిషనరేట్ పరిధిలో ఇలాంటి అనైతిక వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండడం రాష్ట్ర పోలీస్ శాఖలో చర్చనీయాంశమైంది.
ముగ్గురు ఇన్స్పెక్టర్లపై సస్పెన్షన్ వేటు
ఓ సీఐ, ఇద్దరు ఎస్ఐలపై సస్పెన్షన్ వేటు వేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. సస్పెండైన వారిలో గీసుగొండ సీఐ వెంకటేశ్వర్లు, దామెర ఎస్ఐ హరిప్రియ, సుబేదారి ఎస్ఐ పున్నం చందర్ ఉన్నారు. సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ హరిప్రియ కొద్ది రోజులుగా హద్దుమీరి వ్యవహరిస్తున్నారని సదరు మహిళా ఎస్ఐ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ అనంతరం ఇద్దరినీ సస్పెండ్ చేస్తూ సీపీ ఉత్తర్వులిచ్చారు. ఓ యువకుడు వేధిస్తున్నాడని హనుమకొండ బాలసముద్రానికి చెందిన ఓ యువతి సుబేదారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్ఐ పున్నం చందర్ నిందితుడిపై కేసు నమోదు చేయకుండా రాజీప్రయత్నం చేసుకోవాలని బాధిత యువతికి సూచించాడన్న ఫిర్యాదు మేరకు ఆయనపైనా సస్పెన్షన్ వేటు పడింది.