కాంగ్రెస్లో ‘తిరుగుబాటు’ ఆ పార్టీకి తలపోటుగా మారింది. టికెట్ల కేటాయింపు నుంచి హస్తాన్ని ‘అసమ్మతి’ వెంటాడుతున్నది. తాజాగా పలు నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులతో పాటు రెబల్స్గా ఇద్దరు చొప్పున నామినేషన్ వేయడం శ్రేణులను కలవరానికి గురిచేస్తున్నది. అధిష్టానం బుజ్జగించినా వెనక్కి తగ్గని తిరుగుబాటుదారులు, ఎన్నికల బరిలో నిలవడం ఆ పార్టీకి మింగుడుపడకుండా చేస్తున్నది. ముఖ్యంగా పాలకుర్తి, డోర్నకల్, మహబూబాబాద్లో ఇద్దరు చొప్పున, వరంగల్ పశ్చిమం, పరకాల, వర్ధన్నపేటలో ఒక్కొక్కరు చొప్పున కాంగ్రెస్ రెబల్స్ నామినేషన్ వేయడం హాట్ టాపిక్లా మారింది. ప్రచారంలో ఎవరివెంట వెళ్లాలో తెలియక కార్యకర్తలు తలలుపట్టుకోవడం కనిపిస్తున్నది.
వరంగల్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్లో అసమ్మతి తీవ్ర రూపం దాల్చింది. టిక్కెట్ రాని నేతలు తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో నిలిచారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎక్కువ నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉన్నది. ఒక్కో సెగ్మెంట్లో ఇద్దరు రెబల్ అభ్యర్థులు ఉన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన అధికారిక అభ్యర్థులకు పోటీగా వీరు నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అధిష్టానం ఇష్టారీతిన అభ్యర్థులను ప్రకటించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆ పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో పార్టీ నిబద్ధతను పక్కన పెట్టింది. పార్టీ కోసం ఏండ్లుగా పని చేస్తున్న వారిని కాదని, కొత్తగా వచ్చిన వారికి టిక్కెట్లు ఇచ్చింది. ప్రజల్లో ఉన్న నేతలను కాదని అప్పటికప్పుడు వచ్చిన వారిని అభ్యర్థులుగా ప్రకటించింది. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయంపై ఆశావాహులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అసమ్మతితో సమావేశాలు నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి కారణంగానే కొత్తగా పార్టీలో చేరిన వారికి టిక్కెట్లు దక్కాయని మండిపడ్డారు. బీఫారాలు ఇచ్చే వరకైనా పార్టీ నిర్ణయం మార్చుకోవాలని హెచ్చరించారు. అభ్యర్థుల ఎంపికపై అధిష్టానం నిర్ణయం మార్చుకోకుంటే తీవ్ర నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అనుచరులతో వేరుగా సమావేశాలు నిర్వహిస్తూ వచ్చారు. అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం మార్చుకోవాలని తీర్మానాలు చేశారు. అసంతృప్తులను బుజ్జగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం జాతీయ నేతలను పంపించింది. అయినా అసమ్మతి నేతలు వెనక్కి తగ్గలేదు. నామినేషన్ల దాఖలు చివరి రోజు వరకు నాలుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీలో ఉంటామని ప్రకటించారు.
పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన అభ్యర్థి మామిడాల యశస్వినికి పోటీగా డీసీసీ మాజీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్గౌడ్ రెబల్ అభ్యర్థులుగా నామినేషన్ వేశారు. ఉపసంహరణ వరకైనా అధిష్టానం నిర్ణయం మార్చుకోవాలని వీరిద్దరూ డిమాండ్ చేస్తున్నారు.
డోర్నకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున ముగ్గురు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ జాటోతు రాంచందర్నాయక్ను అభ్యర్థిగా ప్రకటించింది. అధికారిక అభ్యర్థికి పోటీగా ఇక్కడ టిక్కెట్ ఆశించిన మాలోతు నెహ్రూ నాయక్, భూపాల్నాయక్ రెబల్ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు. కురవి మండలం హటియా తండాకు చెందిన నెహ్రూనాయక్, మరో నేత భూపాల్నాయక్ టిక్కెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు.
మహబూబాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ టిక్కెట్ల పంచాయతీ ఇంకా ముగియలేదు. కాంగ్రెస్ అభ్యర్థిగా భూక్య మురళీనాయక్ను ఆ పార్టీ ప్రకటించింది. మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు నునావత్ రాధ, ఇదే పార్టీకి చెందిన గూడూరు సర్పంచ్ నునావత్ రమేశ్ రెబెల్ అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు.
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కాంగ్రెస్ వర్గపోరు కొనసాగుతూనే ఉన్నది. కాంగ్రెస్ అభ్యర్థి నాయిని రాజేందర్రెడ్డికి ఆ పార్టీ అవకాశమిచ్చింది. జనగామ డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. కాంగ్రెస్ టిక్కెట్ ప్రకటనపై జంగా రాఘవరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. అనుచరులు, పార్టీ కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. కాంగ్రెస్ రెబల్గా, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా నామినేషన్లు దాఖలు చేశారు.
పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ సభ్యత్వం లేని రేవూరి ప్రకాశ్రెడ్డిని ఆ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఇనుగాల వెంకట్రాంరెడ్డి వర్గానికి చెందిన ఆత్మకూరు నాయకుడు చిమ్మని దేవరాజు కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
వర్ధన్నపేటలోనూ కాంగ్రెస్కు అసమ్మతి బెడద తప్పలేదు. కాంగ్రెస్లో కొత్తగా చేరిన కేఆర్ నాగరాజును ఆ పార్టీ అధిష్టానం అభ్యర్థిగా ప్రకటించింది. మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ఇక్కడ రెబల్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. రాజయ్య తరఫున ఓ ప్రొఫెసర్ ఇక్కడ నామినేషన్ వేశారు.