రాయపర్తి, మే 31 : సమగ్రాభివృద్ధే లక్ష్యంగా రూ.కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేస్తూ మం డల ప్రజల రుణం తీర్చుకునేందుకు కృషి చేస్తానని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. బుధవారం మండలంలోని మైలారం రామాలయంలో విగ్రహాల పునఃప్రతిష్ఠతోపాటు ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీ సీతారామచంద్రస్వామిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అండతో పాలకుర్తి నియోజక వర్గంలోని అన్ని మండలాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. తన 40 ఏండ్ల రాజకీయ జీవితంలో రాయపర్తి మండలంతో విడదీయరాని అనుబంధం ఏర్పడిందన్నారు. తనకు ఎదురైన ప్రతి ఆపత్కాలంలో రాయపర్తి మండలమే ముందుండి గెలిపించిందన్నారు. మండల సమగ్రాభివృద్ధి కోసం తను శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. ప్రభు త్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
మైలారంపై ప్రత్యేక నజర్..
మండలంలోని మైలారం గ్రామానికి మహర్దశ వచ్చేలా పని చేస్తానని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. గ్రామస్తులంతా ఐక్యంగా ఉంటూ గ్రామంలో నూతనంగా ఆలయాల నిర్మాణం, ధ్వజస్థంభ ప్రతిష్ఠాపనోత్సవాలు జరుపుకోవడం అభినందనీయమన్నారు. శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయాభివృద్ధి కోసం రూ.20లక్షలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. అలాగే, గ్రామంలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మా ణం కోసం మరో రూ.20లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఆలయ ఆవరణలో పూజారి నివాసం కోసం డబుల్ బెడ్ రూం ఇల్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. కాగా, గ్రామంలో రామాలయ నిర్మాణ దాత బొమ్మినేని రంగారెడ్డితోపాటు రూ.7లక్షలతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన ఎస్ఆర్ఆర్ అధినేత పరుపాటి శ్రీనివాస్రెడ్డిని మంత్రి ఎర్రబెల్లి అభినందించారు.
వారిని పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ ఎర్రబెల్లి ఉషాదయాకర్రావు, సర్పంచ్ లేతాకుల సుమతీ యాదవరెడ్డి, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మునావత్ నర్సింహానాయక్, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ ఆకుల సురేందర్రావు, ఎంపీటీసీ గాడిపల్లి వెంకన్న, ఉప సర్పంచ్ బాద సారయ్య, గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎలమంచ శ్రీనివాస్రెడ్డి, గూడెల్లి వెంకన్న, లేతాకుల మాధవరెడ్డి, సంది వంశీధర్రెడ్డి, గబ్బెట బాబు, యాకయ్య, పరుపాటి రవీందర్రెడ్డి, బొమ్మినేని రవీందర్రెడ్డి, భీమారెడ్డి, పూస మధు, కుందూరు యాదగిరిరెడ్డి, రాంచంద్రారెడ్డి, గారె నర్సయ్య, రెంటాల గోవర్ధన్రెడ్డి, గూడెల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.