ములుగు, జనవరి 27 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో వెనుకబడిన ములుగు ప్రాంతం గడిచిన నాలుగేళ్లలో ఎవరూ ఊహించిన రీతిలో అభివృద్ధి చెందింది. ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అయిన ములుగును సీఎం కేసీఆర్ జిల్లాగా ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయిలో పాలన, సకల సౌకర్యాలు ఉండేందుకు నిధులు కేటాయించారు. జిల్లాగా ఏర్పడక ముందు ములుగులో తహసీల్దార్, ఎంపీడీవో, పోలీస్స్టేషన్, ఐసీడీఎస్ కార్యాలయం, 30 పడకల ప్రభుత్వ దవాఖాన, ఆర్అండ్బీ ఇంజినీరింగ్ కార్యాలయం, ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాల మాత్రమే ఉండేవి. ప్రస్తుతం నూతన పోలీస్స్టేషన్ భవనంతో పాటు 100 పడకల దవాఖాన, సఖీ భవనం, ప్రభుత్వ అతిథి గృహం, కలెక్టర్ క్యాంపు కార్యాలయం, సంక్షేమ భవనం, జాకారంలో పోలీస్ ట్రైనింగ్ సెంటర్తో పాటు అన్ని శాఖలకు చెందిన కార్యాలయాలు రావడంతో ప్రజలకు మెరుగైన సేవలందుతున్నాయి.
శరవేగంగా కలెక్టరేట్ పనులు
ప్రజలకు అన్ని సేవలు ఒకే ప్రాంతంలో అందేలా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్ కార్యాలయ భవనాలు నిర్మిస్తున్నది. ఇందులో భాగంగా ములుగు జిల్లాలో సైతం కలెక్టరేట్ కోసం ప్రభుత్వం రూ.63.5 కోట్లు మంజూరు చేసింది. ప్రజలకు అందుబాటులో ఉండేలా గట్టమ్మ సమీపంలోని ప్రభుత్వ డిగ్రీకళాశాల పక్కన ఉన్న 60 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కలెక్టర్ గుర్తించారు. గత ఏడాది నంబర్ 19న నవతేజ కన్స్ట్రక్షన్ కంపెనీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకొని సమీకృత కలెక్టరేట్ నిర్మాణానికి అగ్రిమెంట్ చేసుకుంది. 573/2 సర్వే నంబర్లో 20వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం చేపట్టనున్నారు. అలాగే రూ.8.5 కోట్ల నిధులతో అధికారుల భవనాల సముదాయాన్ని కూడా ఇక్కడే నిర్మించనున్నారు. కలెక్టరేట్ పక్కన మరో 15 ఎకరాల్లో ఎస్పీ కార్యాలయం, 4 ఎకరాల్లో జిల్లా పరిషత్ కార్యాలయం, కోర్టు భవనాల సముదాయానికి 5 ఎకరాలు, అగ్నిమాపక కేంద్రానికి అర ఎకరం, మినీ స్టేడియానికి 5.30 ఎకరాలు కేటాయించారు. జాతీయ రహదారి నుంచి కలెక్టరేట్ వరకు రోడ్డు విస్తరణ పనులను కూడా చేపట్టారు.
గట్టమ్మ దేవాలయం దిక్సూచిగా..
ఆది దేవత, మొదటి మొక్కల తల్లి గట్టమ్మ దేవాలయం దిక్సూచిగా ప్రభుత్వ కార్యాయాలు నిర్మాణం అవుతున్నాయి. ప్రస్తుతం సమీకృత కలెక్టరేట్ నిర్మాణ పనులు ఇటు వైపుగా కొసాగుతుండగా 300 పడకల ప్రభుత్వ దవాఖాన పనులు శరవేగంగా సాగుతున్నాయి. గత మార్చిలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పనులను ప్రారంభించగా భవన నిర్మాణం తుది దశకు చేరుకుంది. జిల్లాకు ప్రభుత్వం మెడికల్ కళాశాల మంజూరు చేయగా గట్టమ్మ సమీపంలో స్థలం చుట్టూ ప్రహరీ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఇక్కడే గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు సైతం ప్రభుత్వం 347 ఎకరాల స్థలాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే అప్పగించింది.
నిర్మాణంలో ఉన్న 300 పడకల దవాఖాన
రూ.కోట్లతో ప్రభుత్వ కార్యాలయాలు
2019 ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ పుట్టిన రోజు కానుకగా ఏర్పడిన ములుగు జిల్లాలో ఇప్పటికే కోట్లాది రూపాయలతో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మాణం అయ్యాయి. రూ. 1.50 కోట్లతో సఖీ కేంద్రం, ఐటీడీఎస్ కార్యాలయం, రూ.1.50 కోట్లతో ప్రభుత్వ అతిథి గృహం, రూ.50 లక్షలతో సంక్షేమ భవన పునఃనిర్మాణ పనులు, రూ.1.50 కోట్లతో డీఎంహెచ్, డీసీవో కార్యాలయ భవనాలు, రూ.కోటితో పౌరసరఫరాల శాఖ, వ్యవసాయ శాఖ, డీపీఆర్వో కార్యాలయాల భవనాలు, రూ.2కోట్లతో ఈవీఎం గోదాం నిర్మాణం, రూ.20లక్షలతో కార్మిక శాఖ భవనం, రూ.20 లక్షలతో వైద్య ఆరోగ్య శాఖ గిడ్డంగి వంటి కార్యాలయ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. రూ.కోటితో దివ్యాంగుల కోసం డిగ్రీ కళాశాల వద్ద భవన నిర్మాణ పనులు, రూ.60 కోట్లతో మార్కెట్ యార్డులో 300 పడకల ప్రభుత్వ దవాఖాన నిర్మాణ పనులు శరవేగంగా కొసాగుతున్నాయి. దీంతో పాటు మెడికల్ కళాశాల నిర్మాణం కోసం సేకరించిన ప్రభుత్వ స్థలంలో ప్రహరీ నిర్మాణ పనులు సైతం పూర్తి కావచ్చాయి.
తెలంగాణలో రోల్మోడల్గా ములుగు జిల్లా : కలెక్టర్ కృష్ణ ఆదిత్య
ములుగు జిల్లా కలెక్టర్గా నేను చాలా గర్వపడుతున్నాను. వచ్చిన కొత్తలో చిన్న జిల్లాను ఎలా గాడిలో పెట్టాలి అనుకున్నాను. ముందుగా ప్రజల అవసరాలు, ప్రభుత్వ పాలనను సరిదిద్దే పనిలో నిమగ్నమయ్యాను. ఇప్పటికే అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు పక్కా భవనాలను ఏర్పాటు చేశాం. గ్రీవెన్స్కు వచ్చే ప్రతి సమస్యనూ పరిష్కరిస్తున్నం. ప్రజలకు పాలన ఇంకా మెరుగుపడేందుకు ప్రభుత్వం సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణాల పనులకు అనుమతి ఇచ్చింది. ఈ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తెలంగాణ వచ్చాక చాలా వరకు మార్పులు చోటు చేసుకున్నాయి. అభివృద్ధిలో మనమే ముందు న్నాం. సమీకృత కలెక్టరేట్ నిర్మాణ పనులు పూర్తయితే ములుగు జిల్లా తెలంగాణ రాష్ర్టానికి రోల్ మోడల్గా నిలుస్తుంది. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయించేందుకు నిరంతర పర్యవేక్షణ చేస్తున్నాం.