హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): ఎంబీబీఎస్ కోర్సుకు సంబంధించిన ట్యూషన్ ఫీజుల వసూళ్ల వ్యవహారంలో హైకోర్టు జోక్యానికి నిరాకరించింది. ప్రైవేట్ మెడికల్ కళాశాలలు 4 సంవత్సరాల కోర్సుకు ఐదేండ్ల ఫీజు వసూలు చేస్తున్నాయంటూ మెడికల్ విద్యార్థుల తల్లిదండ్రుల సంఘం సహా నలుగురు దాఖలు చేసిన రిట్ పిటిషన్ ను జస్టిస్ జువ్వాడి శ్రీదేవి విచారించారు. ఇదే అంశంపై ఇప్పటికే సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం పిటిషనర్ల అభ్యర్థనలను పరిశీలించి ఎలాంటి ఉపశమనం కల్పించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.
అయితే అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనే అభ్యంతరాలుంటే బాధిత విద్యార్థులు తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ ఆర్సీ)ని ఆశ్రయించాలని సూచించారు. అలాంటి ఫిర్యాదులు అందితే వాటిని చట్టప్రకారం వీలైనంత త్వరగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని టీఏఎఫ్ ఆర్సీని ఆదేశిస్తూ రిట్ పిటిషన్ను ముగించారు. పిటిషనర్ల వాదన ప్రకారం, ప్రభుత్వం, టీఏఎఫ్ ఆర్సీ జారీ చేసిన ఉత్తర్వులు, స్పష్టీకరణలకు విరుద్ధంగా ప్రైవేట్ మెడికల్ కళాశాలలు ఐదేండ్ల పూర్తి ఫీజును వసూలు చేస్తున్నాయని, దీనిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
ఎంబీబీఎస్ కోర్సు వ్యవధి 4 సంవత్సరాలే కావడంతో అదనపు అర సంవత్సరానికి పూర్తి ఫీజు వసూలు చేయడం నిబంధనలకు విరుద్ధమని వాదించారు. ఈ వాదనలను కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ, టీఏఎఫ్ ఆర్సీ, ప్రైవేట్ మెడికల్ కళాశాలల తరఫు న్యాయవాదులు వ్యతిరేకించారు. జీవో 5 ప్రకారం మొత్తం కోర్సు ఫీజును ఐదు సమాన విడతలుగా చెల్లించే విధానమే అమల్లో ఉందని, ఐదేండ్ల వార్షిక ఫీజు వసూలు చేస్తున్నట్లు కాదని వివరించారు. అలాగే 2020లో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించిందని, ఆ స్టే ఇప్పటికీ అమల్లో ఉన్నందున అదే అంశంపై హైకోర్టు జోక్యం చేసుకునే పరిస్థితి లేదని కోర్టు పేరొంది.