భూగర్భ జలాల పెంపునకు చర్యలు చేపట్టాలి
జలశక్తి అభియాన్ కేంద్ర కమిటీ డైరెక్టర్ మోహన్, శాస్త్రవేత్త జీవీఆర్ మూర్తి
తొర్రూరు/మరిపెడ/పెద్దవంగర, జూన్ 28: వర్షపు నీటిని ఒడిసిపట్టి, భూగర్భ జలాల పెంపునకు ఇంకుడు గుంతలు నిర్మించాలని జలశక్తి అభియాన్ డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాన్పవర్ ఎంపవర్మెంట్ అండ్ డిసెబులిటీ కేంద్ర డైరెక్టర్ కే మోహన్, కేంద్ర నీటి విద్యుత్, పరిశోధనా సంస్థ శాస్త్రవేత్త జీవీఆర్ మూర్తి అన్నారు. జలశక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం వారు తొర్రూరు, మరిపెడ, పెద్దవంగర మండలాల్లోని గ్రామాల్లో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పర్యటించారు. జలశక్తి అభియాన్ ద్వారా నిర్మించిన కుంటలు, చెరువులు, చేపల చెరువులు, ఇంకుడు గుంతలను పరిశీలించి మాట్లాడారు. జలశక్తి అభియాన్లోని ప్రతి పనిని అధికారులు జియో ట్యాగింగ్ చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ భూగర్భ జలాలు పెంపొందించేలా జలశక్తి అభియాన్ కార్యక్రమాలు నిర్వహింస్తున్నదన్నారు. భూగర్భ జలాలను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం వాగులపై అనువైన ప్రదేశాల్లో చెక్డ్యాంలను నిర్మించి, వర్షపు నీటిని వృథాగా వెళ్లకుండా చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నదన్నారు.
తెలంగాణలో గ్రామీణ ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందాయని తెలిపారు. గ్రామాల్లో హరితహారం, పారిశుధ్య పనులు, ఇంకుడు గుంతల నిర్మాణం ఆదర్శనీయమైన పథకాలని ప్రశంసించారు. హరితహారంలో భాగంగా ఎన్ఆర్ఈజీఎస్, అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కలు పెంచుతున్న నర్సరీలను పరిశీలించి పథకం ఎంతో గొప్పదన్నారు. జిల్లాలో పెద్దవంగర, తొర్రూరు, నర్సింహులపేట, నెల్లికుదురు, దంతాలపల్లి, మరిపెడ మండలాల్లో భూగర్భాజలాలు మంచి స్థాయిలో ఉన్నాయని తెలిపారు. నీటి వినియోగంలో పొదుపును పాటిస్తూ, సహజ వనరులను సంరక్షించాలని కోరారు. వారి వెంట సర్పంచ్ శ్రీపాల్రెడ్డి, ఎంపీటీసీ దేవమ్మ, ఉపసర్పంచ్ రామ్మూర్తి, డీఆర్డీవో సన్యాసయ్య, జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఛత్రూనాయక్, ఏపీడీ దయాకర్, ఎంపీడీవో సింగారపు కుమార్, ఎంపీవో ఎండీ గౌస్, ఏపీవో పార్థసారధి, పంచాయతీ కార్యదర్శి మౌనిక, మరిపెడలో జీవీఆర్ మూర్తి, డీఆర్డీవో సన్యాసయ్య, మాలతి, ఎంపీడీవో ధన్సింగ్, ఎన్ కృష్ణ, పెద్దవంగరలో ఏపీడీ దయాకర్, ఇరిగేషన్ డీఈ పూర్ణచందర్, ఎంపీపీ రాజేశ్వరి, స ర్పంచ్ శ్రీనివాసరెడ్డి, ఎంపీడీవోలు వేణుగోపాల్రెడ్డి, కుమారస్వామి, ఎంపీవో యాకయ్య, ఎస్బీఎం కోఆర్డినేటర్ రవికుమార్, నరేందర్కుమార్ ఉన్నారు.