వరంగల్/ఖిలా వరంగల్/గిర్మాజీపేట/సబర్బన్, ఆగస్టు 3: ట్రై సిటీలో మంగళవారం రాత్రంతా వర్షం దంచికొట్టింది. భారీగా మెరుపులు, ఉరుముల శబ్దాలతో నగరవాసులు హడలెత్తిపోయారు. రెండు, మూడు గంటల పాటు పోసిన కుండపోతతో నగరం అతలాకుతలమైం ది. గ్రేటర్లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. నాలాలు పొంగి పొర్లాయి. మోకాలు లోతులో వరద నీరు చేరింది. వందలాది ఇళ్లను వరద ముంచెత్తింది. బల్దియా సిబ్బంది వెంట నే సహాయక చర్యలు చేపట్టారు. వరద నీటిలో మునిగిన ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రానికి తరలించారు. ముంపు ప్రాంతాలను మేయర్ సుధారాణి, కమిషనర్ ప్రావీణ్య, బల్ది యా అధికారులు పరిశీలించి సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. వరంగల్లోని ఎన్టీఆర్ నగర్, సంతోషిమాత కాలనీ, బీఆర్నగర్, శివనగర్, పెరుకవాడ, మైసయ్యనగర్, ఖిలావరంగల్, సాయిగణేశ్కాలనీ, డీకే నగర్, విశ్వనాథకాలనీ, వరంగల్ చౌరస్తా, అండర్బ్రిడ్జి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వరద చేరింది.
హనుమకొండలోని పెద్దమ్మగడ్డ, ఎస్బీహెచ్ కాలనీ, కాజీపేట ప్రాంతంలోని బాపూజీనగర్, మడికొండ, రాంనగర్, బూడిదగడ్డ ప్రాంతాలు జలమయమయ్యాయి. బొందివాగులోకి వరద నీరు చేరి నాలాలు పూర్తిగా నిండిపోయాయి. లోతట్టు ప్రాంతమైన ఎన్టీఆర్ నగర్ వాసులను అధికారులు వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. వారికి టిఫిన్తోపాటు భోజన సౌకర్యాలు కల్పించారు. వృద్ధులు, చిన్నపిల్లలను డీఆర్ఎఫ్ సిబ్బంది పునరావాస కేంద్రానికి తరలించారు. వరంగల్ నగరంలో 14 సెం.మీ వర్షం కురిసింది. గాలి దుమారం వల్ల పలు చోట్ల విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. వరంగల్ జిల్లాలో సగటు వర్షపాతం 3.4 సె.మీ నమోదైంది. హనుమకొండ జిల్లాలో 4.6 సె.మీ, ధర్మసాగర్ మండలంలో రికార్డు స్థాయిలో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ మండలంలోని ముప్పారం, ఎల్కతుర్తి మండలం గోపాల్పూర్, వేలేరులోని పెద్ద చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయి. వేలేరు మండల కేంద్రానికి సమీపంలో ఉన్న వాగు వరద ప్రవాహనికి ఆటో కొట్టుకుపోగా స్థానికులు తాడుతో కట్టి బయటికి లాగారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కొమ్ములవంచలో సుమారు 20 మోటర్లు, స్టార్టర్లు కాలిపోయినట్లు రైతులు చెబుతున్నారు. పెద్దముప్పారం వద్ద పాలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తూ బిడ్జిపై నుంచి నీరు పోతుండడంతో గ్రామానికి రాకపోకలు బంద్ చేశారు. చిన్నగూడూరు మండలంలో జిన్నలవాగు నీటి ప్రవాహం పెరగడంతో చిన్నగూడూరు పగిడిపల్లి, గుండంరాజుపల్లి మీదుగా నర్సింహులపేటకు రాకపోకలు నిలిచిపోయాయి. ములుగు జిల్లా ఏటూరునాగారంలో పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి.