బయ్యారం/ గార్ల/ మహబూబాబాద్ రూరల్, డోర్నకల్/ కేసముద్రం, ఏప్రిల్ 20 : ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో ఆదివారం రాత్రి మహబూబాబాద్ జిల్లాలో వర్ష బీభత్సం సృష్టించింది. మహబూబాబాద్, బయ్యారం, గార్ల, డోర్నకల్ మండలాల్లో తీవ్ర ఆస్తి నష్టాన్ని మిగిల్చింది. పెద్ద పెద్ద వృక్షాలు నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. చేతికొచ్చిన పంటలు దెబ్బతిన్నాయి.
బయ్యారం మండలంలో 34 విద్యుత్ స్తంభాలు విరిగి పడడంతోపాటు 11 కేవీ వైర్లు తెగిపోవడంతో 24 గంటలపాటు కరెంటు సరఫరా నిలిచి పోయింది. ఇటుక బట్టీల్లో ఇటుకలు తడిసి ముద్దయ్యాయి. డోర్నకల్ మండలం మన్నెగూడెంలో తేజావత్ నెహ్రూ చెందిన కోళ్లఫాం కూలి 2400 కోళ్లు మృతి చెందా యి. 45 బస్తాల దాణా తడిపోయింది. మొత్తంగా జిల్లాలో 1,873 ఎకరాల్లో మామిడి తోటలు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు.