కాజీపేట, ఏప్రిల్ 8 : దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని కాజీపేట-పెద్దంపేట రైల్వే స్టేషన్ల మధ్య గురువారం కవచ్ (రైలు ప్రమాద నివారణ వ్యవస్థ) రైలింజన్ల ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బలార్ష-విజయవాడ మార్గం (హెచ్డీఎన్-8) ప్రయాణికులు, సరుకుల రవాణాకు అత్యంత కీలకంగా ఉంటుందని, హై-స్పీడ్ కారిడార్లో కవచ్ అనుసంధానంతో మానవ తప్పిదాలతో ప్రమాదాలను తగ్గించేలా సిగ్నలింగ్ నెట్వర్క్ పెరిగిందన్నారు.
జోన్ పరిధిలో కవచ్ వ్యవస్థను వేగంగా విస్తరించడానికి రైల్వేశాఖ కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలోనే కీలకమైన కాజీపేట-బలార్షా సెక్షన్లోని కాజీపేట-పెద్దంపేట్ రైల్వే స్టేషన్ల మధ్య 101 కిలోమీటర్ల మార్గంలో కవచ్ వ్యవస్థకు సంబంధించి సౌత్ సెంట్రల్ రైల్వే పీసీఎస్టీఈ పీవీ మురళీకృష్ణ, డిప్యూటీ సీఎస్టీఈ జీ కుమరన్ నేతృత్వంలో పనులు జరిగాయని చెప్పారు. కాజీపేట-పెద్దంపేట్ రైల్వే స్టేషన్ల మధ్య ఏర్పాటు చేసిన కవచ్ వ్యవస్థతో రెండు రైళ్లు ఒకే మార్గంలో ఎదురెదురుగా వచ్చినప్పటికీ ఢీ కొనవన్నారు.
అనుకోకుండా ఒకే సెక్షన్లో ఎదురుగా రెండు రైళ్లు వచ్చినా అప్రమత్తం చేయడానికి (బ్లాస్టాప్) సందేశాలను పంపడం, వెనక్కి, ముందుకు కదలకుండా రైలింజిన్లు ఆటోమేటిక్గా నిలబడి పోయేలా ఏర్పాట్లు చేశారన్నారు. అత్యవసర సమయాల్లో లోకో పైలెట్లు మాన్యువల్గా (ఎస్వోఎస్) సిగ్నల్ను అధునాతన సాంకేతికతో పంపే కీలక సదుపాయం ఏర్పాటు చేశారని తెలిపారు. కాజీపేట-పెద్దంపేట రైల్వేస్టేషన్ల మధ్య జరిగే కవచ్ లోకో రైలింజన్ల ట్రయల్ రన్లో సికింద్రాబాద్ నుంచి వచ్చే రైల్వే ఉన్నతాధికారులు పాల్గొంటారని స్థానిక అధికారులు తెలిపారు.