కాంగ్రెస్ ములుగు సభ అట్టర్ ఫ్లాప్ అయిందని, ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్, ప్రియాంకాగాంధీల మాటలకు ప్రజల నుంచి కనీసం స్పందన కూడా లభించలేదని స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్ ఎద్దేవా చేశారు. గురువారం బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎంపీలు దయాకర్, కవితతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఢిల్లీ నేతల మాటలను గల్లీ ప్రజలు విశ్వసించరని, అరవై ఏళ్లు ఉమ్మడి రాష్ర్టాన్ని పాలించిన కాంగ్రెస్ కనీసం రామప్ప ఆలయాన్ని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఇప్పుడు అధికారదాహంతో జాతీయ హోదా కల్పిస్తామని చెప్పడం హాస్యాస్పదమని, విభజన హామీలపై ఏనాడైనా రాహుల్ గాంధీ, రేవంత్ మాట్లాడారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలోనే ములుగు ప్రాంతం అభివృద్ధి చెందిందని, ఈ సారి ఇక్కడ గులాబీ జెండా ఎగురవేస్తామని స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసమే రాహుల్ ములుగులో పర్యటించారని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి విమర్శించారు.
హనుమకొండ, అక్టోబర్ 19 : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ, ప్రియాంక గాంధీల ములుగు జిల్లా పర్యటన ఫ్లాప్ షోగా మారిందని స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్ ఎద్దేవా చేశారు. గురువారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్తో కలిసి విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు, రాహుల్గాంధీ, ప్రియాంకగాంధీలు బీఆర్ఎస్, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్పై చేసిన వ్యాఖ్యలను పూర్తి ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో చేర్చిన ఆరు హామీలు హాస్యాస్పదంగా ఉన్నాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధినేతలు మత ప్రాంతానికి వస్తున్నారని, గొప్ప హామీలు ఇస్తారని ఎదురు చూసిన ప్రజలకు నిరాశే ఎదురయ్యిందన్నారు. ప్రాంతంపై అవగాహన లేని రాహుల్గాంధీ స్థానిక నాయుకులు రాసిచ్చిన స్క్రిప్టును చదివారని, కొండను తవ్వి ఎలుకను పట్టినుట్లుగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఉందని పేర్కొన్నారు. తెలంగాణపై ఆ పార్టీకి ఎలాంటి దూరదృష్టి లేదన్నారు. అరవై ఏళ్లు పాలించినా ఎప్పుడూ గుర్తుకురాని రామప్ప దేవాలయం, మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఎన్నికలు ముందు గుర్తుకు రావడాన్ని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. పోడు చట్టం తామే తెచ్చామని అంటున్న కాంగ్రెస్ నాయకులు, అప్పటి చట్టంతో గిరిజన, గిరిజనేతరులకు అన్యాయం జరిగిందని తెలిపారు.
కాంగ్రెస్ హయాలో 3 లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇస్తే, సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో 4.60 లక్షల ఎకరాలకు పట్టాలు ఇచ్చామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో ములుగు, భూపాలపల్లిలు కుగ్రామాలుగా ఉండేవని, ప్రత్యేక రా్రష్ట్రంలో ఎంతో అభివృద్ధి సాధించాయన్నారు. జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు పాలన చేరువైందన్నారు. విభజన చట్టంలోని హామీలపై రాహుల్ గాంధీ ఎప్పుడైనా పార్లమెంట్లో మాట్లాడారా? అని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు ఏది చెబితే అది నమ్మే పరిస్థితుల్లో గిరిజనులు లేరన్నారు. గిరిజనుల రిజర్వేషన్పై ఆ పార్టీ మోసపూరిత హామీలు ఇస్తున్నదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క ఐదు సంవత్సరాలుగా చేసింది ఏమీ లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన ఆరు హామీలు ఆ పార్టీ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు అమలు చేయడం లేదో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ రాష్ర్టాల్లో ఆడపిల్లల పెళ్లిళ్లకు ఒక్క రూపాయి అయినా ఇచ్చారా? అని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో కల్యాణలక్ష్మి పథకం కింద రెండు లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కనీసం ఆరు నెలలైనా ఒకే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటారా అనేది స్పష్టం చేయాలన్నారు. గిరిజనులు, పేదల గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ అధినాయకత్వానికి లేదన్నారు. ఢిల్లీ బానిసలను ఇక్కడి ప్రజలు విశ్వసించరని అన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 108 సీట్లు వస్తాయని, ములుగు, భూపాలపల్లి నియోజక వర్గాల్లో గులాబీ జెండా ఎగురవేయడంతో పాటు సీఎంగా కేసీఆర్ హాట్రిక్ కొట్టడం ఖాయమని మంత్రి స్పష్టం చేశారు.
రామప్ప దేవాలయానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ, ప్రియాంక గాంధీ రాజకీయ టూరిస్టులుగా మాత్రమే వచ్చిపోయారని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పాలనలో రామప్ప టెంపుల్ గురించి పట్టించుకోకుండా ఇప్పుడు ఓట్ల కోసం దొంగళ్లా వచ్చి వెళ్లారన్నారు. మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని పలుమార్లు కేసీఆర్ కోరినప్పటికీ పట్టించుకోని కాంగ్రెస్ ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం, అధికార దాహంతో జాతీయ పండుగగా గుర్తిస్తామని అనడం సిగ్గుచేటన్నారు. రాహుల్గాంధీ, రేవంత్రెడ్డి పార్లమెంట్లో రామప్పకు యునెస్కో గుర్తింపు, విభజన చట్టంలోని హామీల గురించి ఒక్క రోజైనా అడిగారా? అని ప్రశించారు. సీఎం కేసీఆర్ కృషితోనే రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు వచ్చందన్నారు. ప్రశ్నించే గొంతుకలను అసెంబ్లీకి రాకుండా అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే సీతక్క అనడం సరికాదనన్నారు. ములుగును జిల్లా చేసి మెడికల్ కళాశాల, వంద పడకల దవాఖాన ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని పేర్కొన్నారు. వరదల సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం బాధితులకు అండగా నిలిచిందన్నారు. రానున్న రోజుల్లో ములుగు ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ములుగులో ఈసారి కచ్చితంగా గులాబీ జెండా ఎగురవేస్తామని శ్రీనివాస్రెడ్డి తెలిపారు. సమావేశంలో ఎంపీలు పసునూరి దయకర్, మాలోత్ కవిత పాల్గొన్నారు.