ఖానాపురం, నవంబర్ 25: వానకాలంలో అన్నదాతలు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకూ కొనుగోలు చేసే బాధ్యత తెలంగాణ ప్రభుత్వానిదేనని ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహాలక్ష్మీ వెంకటనర్సయ్య భరోసా ఇచ్చారు. గురువారం టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి మండలకేంద్రంలోని సొసైటీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లు చేపట్టడం లేదని కాంగ్రెస్ నాయకులు ధర్నాకు దిగడం, ప్రభుత్వాన్ని విమర్శించడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. ఖానాపురం సొసైటీ పరిధిలో ఆరు రోజుల క్రితమే ఆరు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు. మారిన వాతావరణ పరిస్థితులతో కొద్ది మంది రైతులు మాత్రమే వరి కోతలు చేపట్టారన్నారు. ధాన్యంలో తేమశాతం అధికంగా ఉండడం, రైస్ మిల్లర్లకు ప్రభుత్వం గత యాసంగిలో అప్పగించిన ధాన్యం గోదాముల్లో నిల్వ ఉండడంతో దిగుమతులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని గుర్తుచేశారు.
50 ఏళ్ల పాలనలో ఏం చేసింది?
దేశాన్ని, రాష్ర్టాన్ని 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో 4 లక్షల మెట్రిక్ టన్నుల గోదాములు మాత్రమే నిర్మించిందని ప్రకాశ్రావు, వెంకటనర్సయ్య ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 26 లక్షల మెట్రిక్ టన్నుల గోదాములు నిర్మించినట్లు స్పష్టం చేశారు. గత యాసంగిలో కేవలం 15 రోజుల్లోనే ఖానాపురం సొసైటీ ఆధ్వర్యంలో ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామినాయక్ సహకారంతో 6.5 లక్షల బస్తాల ధాన్యం కొనుగోళ్లు చేపట్టి ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచి, ఉత్తమ సొసైటీగా ఎంపికైన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అలాంటి సొసైటీపై విమర్శలు చేయడం తగదన్నారు. సమావేశంలో ఆర్బీఎస్ మండల కన్వీనర్ కుంచారపు వెంకట్రెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ దేవినేని వేణుకృష్ణ, బొప్పిడి పూర్ణచందర్, సొసైటీ డైరెక్టర్లు సునీత, అశోక్, రమేశ్, తిరుపతి, కుమారస్వామి, లక్ష్మణ్, సర్పంచ్లు ప్రవీణ్కుమార్, సుమన్, బాలకిషన్, హఠ్య, పూలు, కిషన్, బాలరాజు, అశోక్, బాలు, రామస్వామి పాల్గొన్నారు.
దళారులను ఆశ్రయించి మోసపోవద్దు
నర్సంపేట రూరల్: రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని ఎంపీపీ మోతె కళావతి అన్నారు. లక్నేపల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ ప్రారంభించి మాట్లాడారు. రైతులు తమకు అందుబాటులో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని సూచించారు. పట్టాదారు పాస్బుక్, ఆధార్కార్డు, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ప్రతులను వెంట తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో లక్నేపల్లి, రామవరం సర్పంచ్లు గొడిశాల రాంబాబు, కొడారి రవన్న, ఎంపీటీసీ ఉల్లేరావు రజిత, మాజీ ఎంపీటీసీ పరాచికపు శ్యాంసుందర్, ఏఈవో భరత్, నవీన్ పాల్గొన్నారు. అదేవిధంగా కమలాపూర్ శివారు మాదన్నపేట పెద్ద చెరువు సమీపంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏవో కృష్ణకుమార్, ఏఈవోలు భరత్, నవీన్ ప్రారంభించారు.
నాణ్యమైన ధాన్యం తీసుకురావాలి
చెన్నారావుపేట: రైతు ఉత్పత్తి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు రైతులు నాణ్యమైన ధాన్యం తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని జైదుర్గా భవానీ సంఘం అధ్యక్షుడు భూక్యా రవీందర్నాయక్ కోరారు. బోజేర్వులో ఏఈవో స్మిత ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. పాపయ్యపేటలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని సర్పంచ్ ఉప్పెర లక్ష్మీ వెంకటేశ్వర్లు ప్రారంభించారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలన్నారు. కార్యక్రమంలో బోజేర్వు, చెరువుకొమ్ముతండా సర్పంచ్లు పిండి విజయాభిక్షపతి, బోడ సమ్మునాయక్, ఎంపీటీసీ మౌనిక, ఉపసర్పంచ్లు మేడి వెంకన్న, కుసుమ సతీశ్, చెన్నారావుపేట సొసైటీ డైరెక్టర్లు మజ్జిగ రాంబాబు, గడ్డల మల్లయ్య, టీఆర్ఎస్ పాపయ్యపేట గ్రామ అధ్యక్షుడు బుర్ర సుదర్శన్గౌడ్, ఆర్బీఎస్ గ్రామ అధ్యక్షుడు బాలుసింగ్, ఉపాధ్యక్షుడు బోడ ప్రవీణ్, సారంగం, వీవోఏ అధ్యక్షురాలు యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.