పరకాల, జూన్ 5 : తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాల్లోనే చేర్పించాలని 1వ వార్డు కౌన్సిలర్ మడికొండ సంపత్కుమార్ కోరారు. బడి బాట కార్యక్రమంలో భాగంగా సోమవారం వార్డు పరిధిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న వసతులను తల్లిదండ్రులకు వివరించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ విద్యను అందించేలా సీఎం కేసీఆర్ చర్యలు చేపట్టారన్నారు. మన బస్తీ, మన పాఠశాల కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ బడుల్లో మెరుగైన వసతులను కల్పించారన్నారు. కార్యక్రమంలో సీఎస్ఐ చర్చి పాస్టర్ వై జాన్, బీఎల్వో జయప్రద, బొచ్చు సువర్ణ, బొచ్చు స్వామి, బొచ్చు విల్సన్ పాల్గొన్నారు.
నందనాయక్తండాలో…
గీసుగొండ : మండలంలోని నందనాయక్తండా గ్రామంలో సోమవారం బడిబాట కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు కలిసి బడిబాట ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఉప సర్పంచ్ ధరంసోత్ వీరన్న, ఉపాధ్యాయులు శ్రీలత, అంగన్వాడీ టీచర్ విజయ, స్థానికులు పాల్గొన్నారు.
పల్లార్గూడలో..
సంగెం : సర్కారు బడుల్లో నాణ్యమైన విద్య లభిస్తుందని పల్లార్గూడ సర్పంచ్ కక్కెర్ల కుమారస్వామి అన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా సోమవారం మండలంలోని పల్లార్గూడ గ్రామంలో విద్యాకమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలకు పిల్లలను పంపించాలని తల్లిదండ్రులను కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులను వివరించారు. సర్పంచ్ కుమారస్వామి, హెచ్ఎంలు కొంతం రమేశ్, ఉపసర్పంచ్ రఘు, ఎస్ఎంసీ చైర్మన్ జన్ను కవితా యాకయ్య, గ్రామస్తులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
దౌలత్నగర్లో..
పర్వతగిరి : మండలంలోని దౌలత్నగర్ గ్రామంలో సోమవారం ‘బడి బాట’ నిర్వహించారు. ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, స్కూల్ చైర్మన్ సుధాకర్ నేతృత్వంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కోఆప్షన్ సభ్యుడు సర్వర్ మాట్లాడారు. గ్రామంలో తిరుగుతూ విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి తమ పిల్లలను ప్రభుత్వ బడులకు పంపించాలని కోరారు. నాణ్యమైన విద్యతో పాటు సుశిక్షితులైన ఉపాధ్యాయులతో విద్యా బోధన చేస్తున్నామని చెప్పారు. పిల్లలకు దుస్తులు, నాణ్యమైన భోజనం అందిస్తున్నామన్నారు. ప్రైవేటు బడులకు పంపి డబ్బులను వృథా చేసుకోవద్దని సూచించారు.