తాడ్వాయి, ఫిబ్రవరి10 : మేడారంలో కొలువైన సమ్మక్క పుట్టిన ఊరు బయ్యక్కపేటలోని చందా వంశీయులు గురువారం అమ్మవారికి పుట్టింటి సారె సమర్పించారు. బయ్యక్కపేటలోని సమ్మక్క గుడిలో చందా వంశానికి చెందిన తలపతులు పర్మయ్య, రఘుపతిరావు, కృష్ణమూర్తి, గణేశ్, రవి, వెంకటేశ్వర్లు, నాగభూషణం, సోమేశ్వర్రావు, వెంకటేశ్వర్లు, బత్కయ్య, కల్యాణ్కుమార్, పూజారుల సంఘం ప్రధాన కార్యదర్శి చందా గోపాల్రావుతో కలిసి మేడారానికి వచ్చారు. డోలు వాయిద్యాల నడుమ తల్లి గద్దె వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పుట్టింటి నుంచి తెచ్చిన చీరె, ఒడిబియ్యం, పసుపు, కుంకుమలను చెల్లించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దశాబ్దాలుగా తల్లికి పుట్టింటి చీరెను సమర్పించడం ఆనవాయితీగా వస్తున్నది.
వనదేవతలు సమ్మక్క-సారలమ్మను దర్శించుకునేందుకు గురువారం అధికసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సమ్మక్క గద్దెపై కొలువుదీరే రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు మేడారానికి వచ్చారు. జంపన్న వాగులో పుణ్యస్నానాలు చేసి వాగు ఒడ్డున ఉన్న జంపన్న, నాగులమ్మ గద్దెల వద్ద పూజలు చేశారు. అనంతరం తల్లుల గద్దెల వద్దకు చేరుకుని పసుపు, కుంకుమ, ఎత్తుబెల్లం, నూతన వస్ర్తాలు, పూలు, పండ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తల్లులను దర్శించుకుని మొక్కులు చెల్లించారు.