మిర్చి కొనుగోళ్లు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. మహిళా సంఘాల ద్వారా రైతుల కల్లాల వద్దే పంట కొనుగోళ్లను ప్రారంభించింది. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మైసంపల్లి, రేకంపల్లి గ్రామాల్లో 13 మంది రైతుల నుంచి 12 టన్నుల తేజ రకం మిర్చిని ఇటీవల కొనుగోలు చేసింది. క్వింటాలుకు రూ.20,100 నుంచి రూ.20,900 వరకు ధర లభించింది. సెర్ప్ అధికారులు ముందుగా లిపిడ్ కంపెనీ ప్రతినిధితో కలిసి కల్లాల వద్దకు చేరుకుని మహిళా సంఘం సభ్యులు, రైతుల సమక్షంలో ధర నిర్ణయించారు. చెన్నారావుపేట మహిళా సంఘం ద్వారా తేజ రకం మిర్చిని కొనుగోలు చేసి కాంపెల్లిలోని లిపిడ్ కంపెనీ ప్లాంటుకు తరలించారు. రెండుమూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తామని అధికారులు పేర్కొన్నారు.
వరంగల్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రభుత్వం రైతు పక్షపాతిగా పనిచేస్తోంది. వ్యవసాయంలో అడుగడుగునా అన్నదాతకు దన్నుగా నిలుస్తోంది. 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా చేస్తోంది. ఎరువులు, విత్తనాల కొరత తీర్చింది. సబ్సిడీపై విత్తనాలను అందజేస్తోంది. పంట పెట్టుబడి కష్టాలకు చరమగీతం పాడింది. దేశంలో మరే రాష్ట్రం లో లేని విధంగా రైతుబంధు పథకాన్ని అమల్లోకి తె చ్చింది. పంట పెట్టుబడి కోసం ప్రతి సంవత్సరం రెండు విడుతల్లో ఎకరానికి రూ.10 వేల ఆర్థికసాయం చేస్తోం ది. రైతుబీమా పథకాన్ని ప్రవేశపెట్టి ఏటా ఎల్ఐసీకి రైతులు కట్టాల్సిన ప్రీమియం డబ్బును ప్రభుత్వమే చెల్లిస్తోంది. ప్రభుత్వ మద్దతు ధర దక్కాలనే ఉద్దేశంతో రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేస్తోంది. ఇందుకోసం ఏటా వానకాలం, యాసంగి కొనుగోలు కేంద్రాలను గ్రామాల్లోనే ఏర్పాటు చేస్తోంది. మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలనే సాగు చేయాలని రైతుల ను కోరుతూ ఊరూరా విస్తృత ప్రచారం నిర్వహిస్తోం ది. ఈ క్రమంలో సబ్సిడీలను అందజేస్తూ ఆయిల్పామ్ సాగులో ప్రోత్సహిస్తోంది. తాజాగా, మిర్చి రైతులకు చేయూతనిచ్చేందుకు రంగంలోకి దిగింది. ధా న్యం కొనుగోలు మాదిరిగానే జిల్లాలో కొనుగోలు చేపట్టింది. మహిళా సంఘాల ద్వారా రైతుల కల్లాల వద్దే మిర్చి కొనుగోలును ప్రారంభించడం విశేషం. ఇప్పటికే జిల్లాలో 12 టన్నుల తేజ రకం మిర్చిని సెర్ప్ అధికారులు మహిళా సంఘం ద్వారా కొనుగోలు చేశారు. ఖ ర్చులేవీ లేకుండా తమ కల్లాల వద్దే మిర్చిని అమ్ముకునే అవకాశం లభించటం, మంచి ధర కూడా దక్కడంతో రైతులు మురిసిపోతున్నారు. లాభదాయకంగా ఉండడంతో ప్రభుత్వం నిర్వహిస్తున్న మిర్చి కొనుగోలు కేంద్రాల్లో విక్రయించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
సెర్ప్తో లిపిడ్ కంపెనీ ఎంవోయూ..
మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని కాంపెల్లి వద్ద లిపిడ్ కంపెనీ ప్లాంట్ ఉంది. మిర్చి కొనుగోలు కోసం ఈ కంపెనీ సెర్ప్తో ఎంవోయూ కుదుర్చుకుంది. దీంతో సెర్ప్ అధికారులు ఈ ఏడాది నుంచి మహిళా సంఘాల ద్వారా జిల్లాలో రైతుల నుంచి మిర్చిని కొనుగోలు చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. ప్రయోగాత్మకంగా చెన్నారావుపేట అక్షయ మహిళా సంఘం ద్వారా పలు గ్రామాల్లో తేజ రకం మిర్చి కొనుగోలుకు నిర్ణయించారు. ఈ మేరకు రైతులు తేజ రకం మిర్చి పంట సాగు చేసిన గ్రామాలను గుర్తించారు. సర్వే చేసి తేజ రకం మిర్చి దిగుబడులపై ఒక అంచనాకు వచ్చారు. మిర్చి కొనుగోలుపై అక్షయ మహిళా సంఘంలోని సభ్యులకు అవగాహన కల్పించారు. ప్రథమంగా ఆదివారం దుగ్గొండి మండలం మైసంపల్లి, రేకంపల్లి గ్రామాల్లో 13 మంది రైతుల నుంచి 12 టన్నుల తేజ రకం మిర్చిని కొనుగోలు చేశారు. రైతులకు ధర క్వింటాలుకు రూ.20,100 నుంచి రూ.20,900 వరకు లభించింది. సెర్ప్ అధికారులు ముందుగా లిపిడ్ కంపెనీ ప్రతినిధితో కలిసి మైసంపల్లి, రేకంపల్లి గ్రామాల్లోని రైతుల మిర్చి కల్లాల వద్దకు చేరుకుని మహిళా సంఘం సభ్యులు, రైతుల సమక్షంలో ధర నిర్ణయించారు. రైతుల అంగీకారంతో ఇక్కడ చెన్నారావుపేట మహిళా సంఘం ద్వారా తేజ రకం మిర్చిని కొనుగోలు చేసి కాంపెల్లిలోని లిపిడ్ కంపెనీ ప్లాంటుకు తరలించారు. డీపీఎం సరిత ఈ మిర్చి కొనుగోళ్లను స్వయంగా పర్యవేక్షించారు. వారం రోజుల్లోగా డబ్బు చెల్లించే ఒప్పందంతో సెర్ప్ అధికారులు రైతుల నుంచి మిర్చి కొనుగోళ్లు చేపట్టారు. చెన్నారావుపేట అక్షయ మహిళా సంఘం (రైతు ఉత్పత్తిదారుల సేవా కేంద్రం) వద్ద డబ్బు నిల్వ ఉండడంతో వారం కాదు రెండు మూడు రోజుల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో మిర్చి డబ్బును జమ చేసే ఏర్పాట్లు చేశామని సెర్ప్ అధికారులు తెలిపారు. లిపిడ్ కంపెనీ నుంచి డబ్బు వచ్చిన తర్వాత చెన్నారావుపేట మహిళా సంఘం బ్యాంకు అకౌంట్లో క్రెడిట్ అవుతుందని చెప్పారు. దుగ్గొండి మండలంతో పాటు చెన్నారావుపేట, నెక్కొండ తదితర మండలాల్లోని వివిధ గ్రామాల్లోనూ చెన్నారావుపేట అక్షయ మహిళా సంఘం ద్వారా రైతుల నుంచి తేజ రకం మిర్చిని కొనుగోలు చేసేందుకు సెర్ప్ అధికారులు సన్నాహాలు చేశారు. సీజన్ కావడంతో తేజ రకం మిర్చి కొనుగోళ్ల ఏర్పాట్లను వేగవంతం చేశారు. ప్రస్తుతం రైతుల నుంచి తేజ రకం మిర్చిని మాత్రమే కొనుగోలు చేస్తున్నట్లు డీపీఎం సరిత చెప్పారు. నాణ్యమైన తేజ రకం మిర్చితో పాటు తాలు రకం మిర్చిని కూడా కొనుగోలు జరుపుతున్నట్లు ఆమె తెలిపారు.
మిర్చి రైతులకు ప్రయోజనాలు..
రైతుల తమ మిర్చిని మార్కెట్కు తరలించాలంటే సంచుల్లో నింపాలి. ట్రాక్టర్, వ్యాను లేదా ఇతర వాహనాల ద్వారా రవాణా చేయాలి. మార్కెట్లో దిగుమతి హమాలీ, తూకం వేసేందుకు దడువాయి చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. రూ.80 సంచికి వ్యాపారులు చెల్లించేది రూ.30. తరుగు షరా మామూలు. ఇక పేమెంట్లో కొంత పర్సంటేజీ కోత సాధారణం. వ్యా పారులు నిర్ణయించిన ధర నచ్చకపోతే రైతులు తమ మిర్చిని తిరిగి ఇంటికి తీసుకురాలేని పరిస్థితి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇవేమి లేకుండా రైతులు తమ కల్లాల వద్దే నచ్చిన ధరకు మిర్చిని అమ్ముకునే అవకాశం కలుగుతుంది. రైతులు ఓకే అన్న తర్వాతే కల్లాల వద్ద ధర ఫైనల్ అవుతుంది. మహిళా సంఘమే రైతులకు సంచులను సరఫరా చేస్తోంది. కల్లం వద్దే మహిళా సంఘం సభ్యులు మిర్చిని తూకం వేస్తున్నారు. రైతుల కు రవాణా, హమాలీ, దడువాయి చార్జీలు లేవు. కల్లా ల వద్ద మహిళా సంఘం ద్వార కొనుగోలు చేసిన మిర్చి ని సెర్ప్ అధికారులు తమ వాహనాల ద్వారా కాంపెల్లికి తరలిస్తున్నారు. ఎలాంటి ఖర్చులు లేకుండా రైతు లు తమ కల్లం వద్దే మార్కెట్లో పలుకుతున్న ధర కం టే తమ మిర్చికి మంచి ధర పొందుతున్నారు. ఉదాహరణకు సోమవారం వరంగల్ ఎనుమాముల మార్కెట్లో క్వింటాలు తేజ రకం మిర్చికి రూ.16 వేల నుంచి రూ.21,300 వరకు పలికింది. రవాణా ఖర్చులు, తరుగు, పర్సంటేజీ కోతలు, హమాలీ, దడువాయి చా ర్జీలేవీ లేకుండా ఆదివారం రేకంపల్లి, మైసంపల్లి గ్రా మాల రైతుల కల్లాల వద్ద తేజ రకం మిర్చి క్వింటాలు ధర రూ.20,100 నుంచి రూ.20,900 వరకు పలకడం గమనార్హం. మార్కెట్లో ఏదో ఒక మిర్చి లాట్కు వ్యాపారులు జెండా పాట పేర గరిష్ఠ ధర నిర్ణయించి మిగిలిన మిర్చిని మధ్య, కనిష్ఠ ధరతో కొనుగోలు చేస్తారని, మహిళా సంఘం ద్వారా సెర్ప్ అధికారులు తమ కల్లాల వద్దే మంచి ధర చెల్లిస్తున్నారని మిర్చి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.