‘ఇంటి ముందు అభివృద్ధి.. కంటి ముందు అభ్యర్థి’.. ‘మీ బిడ్డగా వచ్చా.. ఆశీర్వదించి అసెంబ్లీకి పంపండి’.. ‘ఒకసారి ఆలోచించండి.. అభివృద్ధి చేసిన కారుకే మీ ఓటు వేయండి’ అంటూ ఆకట్టుకునే నినాదాలతో బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రచారంలో భాగంగా స్థానిక నాయకులు, శ్రేణులతో గల్లీగల్లీని చుట్టి వస్తున్నారు. దారి పొడవునా అభివాదం చేసుకుంటూ ముందుకుసాగుతూ ప్రజలకు చేరువై వారి మద్దతు కూడగడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులను కలిసి మీ ఆశీర్వాదం ఉండాలంటూ దీవెనలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా తమ వద్దకు వచ్చిన బీఆర్ఎస్ అభ్యర్థులతో ‘మా ఓటు కారుకే’నంటూ బీఆర్ఎస్కు జైకొడుతున్నారు. ఇలా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రచార పర్వం జోరందుకోగా అంతటా కోలాహలం నెలకొంది.
గ్రేటర్ 38వ డివిజన్లో మున్నూరుకాపువాడ నుంచి మెట్టు దర్వాజ వద్ద 2వేల మంది బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు భారీ ర్యాలీ తీసి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి నన్నపునేని నరేందర్కు ఘనస్వాగతం పలికారు. ఆయాచోట్ల మహిళలు నరేందర్కు తిలకం దిద్ది గెలుపు నీదేనంటూ దీవించారు. అన్ని రంగాల్లో జరిగిన అభివృద్ధిని చూసి కారు గుర్తు మీద ఓటు వేసి మరోసారి తూర్పులో గులాబీ జెండాను ఎగురవేయాలన్నారు.
నర్సంపేట మండలంలోని నర్సింగాపురం, ఇటుకాలపల్లి, ఆకులతండా, ఇప్పల్తండా, కొండసముద్రంతండా, ఏనుగల్తండా, ముత్యాలమ్మతండా, జంగాలపల్లితండా, గార్లగడ్డతండా, రాజుపేట, ముత్తోజిపేట, రామవరం, రంగంపల్లి, లక్నెపల్లి, మర్రినర్సయ్యపల్లి గ్రామాల్లో నర్సంపేట ఎమ్మెల్యే అభ్యర్థి పెద్ది సుదర్శన్రెడ్డి పర్యటించారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ ముందుకు సాగారు. ఐదేళ్లు కమిట్మెంట్తో పనిచేశానని.. చేసిన అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.
దామెర మండలం కోగిల్వాయి, వెంకటాపురం, సింగరాజుపల్లి, ల్యాదెళ్ల, ఆత్మకూరు మండలం కటాక్షపురం, హౌసుబుజుర్గు, నీరుకుళ్ల గ్రామాల్లో పరకాల ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి విస్తృత ప్రచారం నిర్వహించారు. స్వార్థం కోసం వచ్చే వారిని నమ్మొద్దని.. కష్టసుఖాల్లో మీ ఇంటి మనిషిలా ఉంటూ అన్నివిధాలా అభివృద్ధి చేసిన తనకు భారీ మెజార్టీ ఇవ్వాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఆడబిడ్డలు ఆయనకు బొట్టు పెట్టి ఆశీర్వదించి దీవెనలు అందించారు.
జనగామ, స్టేషన్ఘన్పూర్ అభ్యర్థులుగా బరిలో ఉన్న ఇద్దరు ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్రెడ్డిలను గెలిపించే బాధ్యత తనపై ఉన్నదని బీఆర్ఎస్ జనగామ ఇన్చార్జి, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. బేషజాలు లేకుండా పార్టీ కోసం పనిచేసి అభ్యర్థుల విజయానికి కృషిచేయాలని శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఈమేరకు వేలేరు మండలం సోడాషపల్లిలో నియోజకవర్గంలోని బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
గ్రేటర్ 55, 56 డివిజన్ల పరిధిలోని గోపాల్పూర్, పూరిగుట్ట, జవహర్కాలనీ, కోమటిపల్లిలో వర్ధన్నపేట ఎమ్మెల్యే అభ్యర్థి అరూరి రమేశ్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు, పార్టీ శ్రేణులు మంగళహారతులు, కోలాటాలు, బతుకమ్మలతో ఘనస్వాగతం పలికారు. కాంగ్రెస్ చెప్పే వారెంటీ లేని గ్యారెంటీలను నమ్మొద్దని, సమగ్ర అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమని, కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో తనను గెలిపించాలని రమేశ్ కోరారు.
ములుగు మండలంలోని 17 గ్రామాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతి విస్తృత ప్రచారం చేశారు. ఉదయం 7గంటల నుంచే జనంలోకి వెళ్లిన ఆమె రాత్రి 8:30 గంటల వరకు అవిశ్రాంతంగా క్యాంపెయిన్లో పాల్గొన్నారు. అడుగడుగునా డప్పుచప్పుళ్ల నడుమ బతుకమ్మలతో ఆడబిడ్డలు, బైక్ ర్యాలీలతో శ్రేణులు, యువకులు ఘన స్వాగతం పలికారు. ప్రజాసేవకే రాజకీయాల్లోకి వచ్చానని.. గెలిపించాలని కోరారు.
గూడూరు మండలంలోని లక్ష్మీపురం, అప్పరాజుపల్లి, దబ్బతండా, గండీతండా, మధనాపురం గ్రామాల్లో మానుకోట ఎమ్మెల్యే అభ్యర్థి బానోత్ శంకర్నాయక్ ఇంటింటా ప్రచారం చేశారు. పేదల మేలు కోరే ప్రభుత్వాన్ని అందరూ దీవించాలని, గ్యారెంటీ లేని కాంగ్రెస్ పథకాలను నమ్మి ప్రజలు ఆగం కావద్దని కోరారు. కేసీఆర్ మూడోసారి సీఎం కావడం, మానుకోట మీద మూడోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు.