జనగామ, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ) : జనగామ రైల్వేస్టేషన్ ఆవరణలో ఆదివారం జరిగిన ‘అమృత్ భారత్’ స్టేషన్ పునరాభివృద్ధి పథకం పనుల శంకుస్థాపన కార్యక్రమం రసాభాసగా ముగిసింది. వేదికపైకి ఎంపీని ఆహ్వానించిన రైల్వే అధికారులు ఆయన సూచనతో మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్రెడ్డి సహా కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు మున్సిపల్ మాజీ చైర్మన్లు, నాయకులను పిలిచారు. ప్రొటోకాల్ ప్రకారం తన వార్డు పరిధిలో జరుగుతున్న సభా వేదికపైకి తనను ఆహ్వానించకుండా ఎవరెవరినో ఆహ్వానించడంపై తొలుత బీజేపీ కౌన్సిలర్ మహంకాళి హరిశ్చంద్రగుప్తా అభ్యంతరం వ్యక్తం చేస్తూ అధికారితో వాగ్వాదానికి దిగాడు. దీంతో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీ, సీపీఎం, సీపీఐ నేతలను వేదికపైకి పిలిచారు. ఈ క్రమంలో జిల్లా కేంద్రానికి చెందిన సీనియర్ బీజేపీ నాయకుడు ఒకరు తనను వేదికపైకి ఆహ్వానించకుండా కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులను పిలుస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పేర్లు చదువుతున్న రైల్వే అధికారి చేతిలోంచి పేపర్లు లాక్కొని అతడి మొహంపై విసిరికొట్డాడు. అంతేకాకుండా రైల్వే అధికారిని దుర్భాషలాడుతూ అతడిపై దాడికి యత్నించాడు. ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపనకు అరగంట ముందు వేదికపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉండగానే బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులు పోటాపోటీగా నినాదాలు చేసుకుంటూ తోపులాటకు దిగారు. ఎంపీ, పోలీసులు జోక్యం చేసుకొని గొడవకు దిగిన నాయకులకు నచ్చజెప్పి శాంతింపజేశారు.