కనీస అవసరాలను అందుబాటులో ఉంచాల్సింది పోయి ధరలు పెంచుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదల నడ్డి విరుస్తున్నదని, దేశానికి ఆ పార్టీ గుది‘బండ’లా మారిందని ప్రజలు మండిపడ్డారు. వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ గురువారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆందోళనలతో హోరెత్తించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి కేంద్రంపై కదం తొక్కారు. రహదారులపై ధర్నాలు, రాస్తారోకోలు, వంటావార్పులు చేయడంతో పాటు గ్యాస్ సిలిండర్లతో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. గ్యాస్, పెట్రో ధరలు తగ్గించకుంటే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు.
– నమస్తే నెట్వర్క్, మార్చి 24
కనీస అవసరాలైన వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి కేంద్రం మోయలేని భారం మోపుతున్నదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి గురువారం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ రోడ్లపై ధర్నాలు, రాస్తారోకోలు, వంటావార్పు నిర్వహించారు. గ్యాస్ బండలతో ప్రదర్శనలు ఇచ్చారు. హనుమకొండలోని తారా గార్డెన్ వద్ద ప్రధాన రహదారిపై ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, వరంగల్ మేయర్ గుండు సుధారాణి పార్టీ శ్రేణులతో కలిసి స్థానికులు ధర్నా చేశారు. ములుగులో మంత్రి సత్యవతి రాథోడ్, టీఆర్ఎస్ శ్రేణులు ప్రధాని దిష్టిబొమ్మను తాళ్లతో లాగి, కూడలిలో దహనం చేసి నిరసన తెలిపారు. వరంగల్ కరీమాబాద్లోని సుభాష్సెంటర్లో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, టీఆర్ఎస్ ముఖ్యనేతలు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నర్సంపేటలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, జడ్పీ ఫ్లోర్లీడర్ పెద్ది స్వప్న ఆధ్వర్యంలో మహిళలు గ్యాస్ సిలిండర్లతో భారీ ర్యాలీ తీశారు. రహదారిపై బైఠాయించి కేంద్రానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో టీఆర్ఎస్ నాయకులు, మహిళలు రాస్తారోకో చేశారు. గ్యాస్ స్టౌవ్లు, సిలిండర్లతో ప్రదర్శన ఇచ్చారు. జనగామలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్రెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు ప్లకార్డులతో నిరసన తెలిపారు. కేంద్రం దిష్టిబొమ్మను దహనం చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మదర్ థెరిస్సా సెంటర్లో ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నేతలు, మహిళలు ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. మరిపెడలో జాతీయ రహదారిపై ఎంపీ, మానుకోట జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షురాలు మాలోత్ కవిత, డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు వంటా వార్పు నిర్వహించారు.
– నమస్తే నెట్వర్క్, మార్చి 24