హనుమకొండ, ఆగస్టు 5 : తెలంగాణ సిద్ధాంతకర్త, స్వరాష్ట్ర స్వాప్నికుడు, ఉద్యమ భావజాల వ్యాప్తి కోసం తన జీవితాన్ని అర్పించిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 88వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. తెలంగాణ జన హృదయాల్లో సదా నిలిచిన ఆయన రాష్ట్ర సాధనకు కోసం చేసిన త్యాగం మరువలేనిది. సబ్బండ వర్గాల సమగ్రాభివృద్ధి కోసమే తెలంగాణ స్వరాష్ట్రం అని తెలిపిన సార్ ఆశయాలను తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నది.
హనుమకొండ జిల్లాలోని ఆత్మకూరు మండలం అక్కంపేటలో 1934 ఆగస్టు 6వ తేదీన జన్మించిన జయశంకర్ సార్ తెలంగాణ సాధన కోసం ఎనలేని కృషి చేశారు. హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాలసముద్రంలో ఉన్న ఏకశిల పార్కును ప్రభుత్వం జయశంకర్ స్మృతివనంగా అభివృద్ధి చేసింది. శనివారం ఆయన జయంతి వేడుకలను ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగసంస్థలు, గ్రామాల్లో ఘనంగా జరుపుకోనున్నారు. బాలసముద్రంలోని ఏకశిల పార్కులో ఉదయం 10 గంటలకు జయశంకర్ విగ్రహానికి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పూల మాలలు వేసి నివాళులర్పించనున్నారు.