ఎల్కతుర్తి, సెప్టెంబర్ 22 : హరితహారంలో పండ్ల మొక్కల పెంపకానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం కార్యాలయ హరితహారం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ సూచించారు. మండలంలోని దండేపల్లిలోని నర్సరీ, పల్లెప్రకృతి వనం, ఎల్కతుర్తిలోని బృహత్ పల్లెప్రకృతి వనాలను గురువారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా దండేపల్లిలోని నర్సరీని పరిశీలించిన అనంతరం అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పండ్ల మొక్కలు సరఫరా చేసేందుకు దండేపల్లి గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేస్తామని చెప్పారు. మొక్కలు అంటుకట్టే విధానం బాగుందని, దీనిపై వనసేవక్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి ఇచ్చే రకాల మొక్కలను నర్సరీల్లో పెంచేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గీత కార్మికులకు త్వరలో గిరకతాటి మొక్కలు నర్సరీల్లో పెంచి అందజేయనున్నట్లు చెప్పారు. జగిత్యాల జిల్లాలో గీత కార్మికులు సొసైటీ భూమిలో పెంచుకుంటున్న చెట్లను అద్యయనం చేసేందుకు స్టడీ టూర్ ఏర్పాటు చేయాలని డీఆర్డీవో శ్రీనివాస్కుమార్కు ఆమె సూచించారు. నర్సరీలో గ్రేప్స్, డ్రాగన్ప్రూట్స్ తదితర పండ్ల మొక్కలు పెంచడంపై ఆమె అభినందించారు.
గ్రామంలో ప్రతి కుటుంబానికి పది పండ్ల మొక్కలు పంపిణీ చేసేలా నర్సరీలో ఏర్పాట్లు చేయాలని, హైటెక్ నర్సరీగా తీర్చిదిద్దాలని కోరారు. గ్రామ నర్సరీలో అన్ని రకాల పండ్ల మొక్కలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు. ఏపీలోని కడియం నర్సరీ నిర్వాహకులు తెలంగాణ నుంచి సేకరించిన విత్తనాలతో మొక్కలు పెంచుతున్నారని, వాటిని రెట్టింపు ధరలు పెట్టి మనం తెచ్చుకుంటున్నామని ఆమె వివరించారు. ప్రతి గ్రామంలో మొక్కలు అంటుకడితే ప్రజలకు ఉపాధి దొరుకుతుందని, తక్కువ ధరలోనే హైబ్రిడ్ మొక్కలను తయారు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. పండ్ల మొక్కలను కొనడం కాదని, మొక్కలను పెంచి పంచాలన్నారు. ఫ్రూట్ గార్డెన్ తయారు చేయాలని, ఈ విషయంపై సీఎం కేసీఆర్కు ప్రత్యేక ఆసక్తి ఉందన్నారు. స్థానికుడు సుధీర్కుమార్కు పండ్ల మొక్కల పెంపకం ఆలోచన గొప్పదని అభినందించారు. వచ్చే నెలలో గ్రామం నుంచి ఐదుగురు వనసేవలకు అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్డీవో శ్రీనివాస్కుమార్, తహసీల్దార్ గుజ్జుల రవీందర్రెడ్డి, ఎంపీడీవో తూర్పాటి సునీత, సర్పంచ్ పుట్ట ప్రమీల, ఎఫ్ఆర్వో మయూరి, కేవీకే శాస్త్రవేత్తలు కిశోర్, వేణుగోపాల్ పాల్గొన్నారు.